ICC ODI Ranking:  బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా పురుషుల వన్డే ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్ల ర్యాంకులు మెరుగయ్యాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ ల స్థానాలు ఎగబాకాయి. శ్రీలంకతో తొలి వన్డేలో అద్భుత శతకం సాధించిన కోహ్లీ 2 స్థానాలు మెరుగై 6వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ 8వ స్థానంలో నిలిచాడు. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగంలో 18వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే శ్రీలంక జట్టు ఓడిపోయినప్పటికీ ఒంటరి పోరాటం చేసి శతకం బాదిన ఆ జట్టు కెప్టెన్ దసున్ శనక 20 స్థానాలు మెరుగుపరచుకుని 61వ ర్యాంకులోకి వచ్చాడు. 


టీ20ల్లో సూర్యదే అగ్రస్థానం


ఇక టీ20ల్లో భారత సంచలనం సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో చివరి టీ20లో సెంచరీ చేసిన సూర్య తన పాయింట్లను మరింతగా పెంచుకున్నాడు. పొట్టి ఫార్మాట్ లో ఆల్ రౌండర్ల విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హసన్ మొదటి ర్యాంకులో ఉన్నాడు. అలాగే బౌలింగ్ విభాగంలో అఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉన్నాడు. 


టెస్టుల్లో భారత ఆటగాళ్ల హవా


ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ అగ్రస్థానంలో ఉన్నాడు. కమిన్స్ బౌలింగ్ విభాగంలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌-10లో ఇద్దరు భారత ఆటగాళ్లున్నారు. రిషభ్‌ పంత్‌ ఆరో స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ పదో స్థానంలో నిలిచాడు.  బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్‌ రెండో స్థానంలో నిలిచాడు.