అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ న‌వంబ‌ర్ నెలకు ప్రతిష్ఠాత్మక ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్అవార్డు నామినీస్ పేర్లను వెల్లడించింది. ప్రపంచకప్‌లో అద్భుత ఆటతీరుతో సత్తా చాటిన టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ నవంబర్‌ నెలకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో రాణించిన ఆటగాళ్లను ఐసీసీ ఈ అవార్డుకు నామినేట్‌ చేసింది. మహ్మద్‌ షమీ, ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ట్రావిస్‌ హెడ్‌ పేర్లను ఐసీసీ నవంబర్‌ నెలకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ చేసింది. ఈ అవార్డుకు ఈసారి మ‌హిళ‌ల విభాగంలో ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు, పాకిస్థాన్‌ స్పిన్నర్‌ కూడా నామినేట్‌ అయ్యారు. బంగ్లాదేశ్‌ నుంచి న‌హిదా అక్తర్(Nahida Akter), ఫ‌ర్గానా హ‌క్(Fargana Hoque) నామినేట్ అవ్వగా... పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ స‌దియా ఇక్బాల్‌(Sadia Iqbal) కూడా పోటీలో నిలిచింది. బంగ్లాదేశ్ స్పిన్ సెన్షేష‌న్ న‌హిదా న‌వంబ‌ర్‌లో జ‌రిగిన పాకిస్థాన్ సిరీస్‌లో అద‌ర‌గొట్టింది. మూడు వ‌న్డేల సిరీస్‌లో 7 వికెట్లు తీసింది. దాంతో బంగ్లా 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. బంగ్లా బ్యాటర్‌ ఫ‌ర్గాన పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో 36.62 స‌గటుతో 110 ప‌రుగులు చేసింది.


భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత స్టార్‌ పేసర్ మహ్మద్‌ షమీ(Mohammed Shami).. ప్రదర్శన క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. అది మాములు ప్రదర్శన. ప్రతీ బంతికి వికెట్‌ తీసేలా.. బంతిబంతికి పరీక్ష పెట్టేలా..బుమ్రా, సిరాజ్‌లకు ఆత్మ విశ్వాసం పెరిగేలా షమీ చెలరేగిపోయాడు. బంతితో నిప్పులు చెరిగాడు. బాల్‌ అందుకుంటే వికెట్‌ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతీ బంతికి వికెట్‌ తప్పదేమో అని బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఆడే అవకాశమే దక్కని షమీ.. ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత తానేంటో నిరూపించాడు.



 భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు.. కోర్టు సమన్లు... ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు.. రోడ్డు ప్రమాదం.. ఇలా ఒకటా రెండా షమీని సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ వెనక్కి తగ్గాడా.... లేదు.. ఇంకా దృఢంగా తయారయ్యాడు. జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపోయాడా.. లేదు.. తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు. ఇప్పుడు దానికి తగ్గ ఫలాలను అందిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో తొలి నాలుగు మ్యాచ్‌లకు షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. హార్దిక్‌ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమీ తొలి మ్యాచ్‌లోనే పటిష్ఠమైన న్యూజిలాండ్‌ (New Zealand) బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై 4, శ్రీలంకపై 5, దక్షిణాఫ్రికాపై 2 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో  షమీ’ విధ్వంసమే సృష్టించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి కివీస్‌ పతనాన్ని శాసించాడు. ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించడంతో.. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇచ్చారు. భారత బౌలింగ్‌ దళం రారాజుగా నిలిచి తనలో ఎంత కసి ఉందో చాటి చెప్పాడు.