Dhruv Jurel does not regret missing maiden Test hundred: రాంచీ(Ranchi) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన ధ్రువ్‌ జురెల్‌(Dhruv Jurel) తన ప్రదర్శనపై స్పందించాడు. మ్యాచ్‌ సమయంలో తనకు ఇలానే ఆడాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదని ధ్రువ్‌ చెప్పాడు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని...  బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నానని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్‌.. తన మొదటి సిరీస్‌ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని తెలిపాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల అని. ఇప్పుడు నెరవేరడం సంతోషంగా అనిపిస్తోందన్నాడు. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తనను మరో ధోనీ అంటూ పొగడడం ఆనందంగా ఉందని ధ్రువ్‌ తెలిపాడు. నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 39 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా, స‌ర్ఫరాజ్ ఖాన్  త్వరగా ఔట్ అయినా శుభ్‌మ‌న్ గిల్‌, ధ్రువ్ జురెల్ లు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వలేదు. వీరిద్దరు అభేధ్య‌మైన ఆరో వికెట్‌కు 72 ప‌రుగులు జోడించి భార‌త్‌కు విజ‌యాన్ని అందించారు. 


జురెల్‌పై ప్రశంసల జల్లు
టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన జురెల్‌పై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. జురెల్‌ను చూస్తుంటే మరో ధోనీలా కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. ధ్రువ్‌ జురెల్‌ ఏకాగ్రతలో మరో ధోనీని తలపిస్తున్నాడని గవాస్కర్‌ అన్నాడు. శతకం చేజారినాఉం ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడని గవాస్కర్‌ అన్నాడు.


అశ్విన్‌ రికార్డులే రికార్డులు
రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌, క్రికెట్‌ జీనియస్‌, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఈ ఘనతను ఈ చెన్నై స్పిన్‌ మాంత్రికుడు అందుకున్నాడు. అశ్విన్‌ కంటే ముందు 147 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో కేవలం 8 మంది మాత్రమే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి చేరుకున్నారు. అలాగే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్‌ స్టోను అవుట్‌ చేసి అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. 23 మ్యాచుల్లోనే ఈ స్టార్‌ స్పిన్నర్‌ వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్‌ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు జేమ్స్‌ అండర్సన్‌ భారత జట్టుపై 139 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు.