Ind Batting vs Eng In 2nd Test: బర్మింగ్ హామ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. బుధవారం ఎడ్జ్ బాస్టన్ లో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్.. మరోసారి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఓడిపోయి నిరాశలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో కొన్ని మార్పులు చేసింది. నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. మరోవైపు తొలి టెస్టులో గెలిచి సమరోత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ మైదానంలో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా భారత్ సాధించలేదు. దీంతో ఈ రికార్డును తిరగరాసి, సిరీస్ సమం చేయాలని భావిస్తోంది.
బ్యాటింగ్ పై దృష్టి..ఈ మ్యాచ్ లో భారత్ చేసిన మూడు మార్పులను గమనించినట్లయితే, బ్యాటింగ్ బలాన్ని మరింతగా పెంచింది. తొలి టెస్టులో ఆడిన జస్ ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్ స్థానాల్లో ఆకాశ్ దీప్ సింగ్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లను జట్టులోకి తీసుకుంది. దీంతో ఎనిమిదో నెంబర్లో బాగా బ్యాటింగ్ చేయగల సుందర్ జట్టులోకి వచ్చాడు. అయితే ఒక పేసర్ స్థానంలో స్పిన్నర్ తీసుకున్నట్లయింది. అలాగే తొలి టెస్టులో ఎదురైన బ్యాటింగ్ కొల్లాప్స్ కు సమాధానం కూడా దొరికినట్లయ్యిందని పలువురు పేర్కొంటున్నారు.
ఈ బౌలింగ్ తో ఆలౌట్ చేస్తారా..?ఈ మ్యాచ్ లో భారత్ కేవలం ఇద్దరు నికార్సైన పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలతో బరిలోకి దిగుతోంది. అయితే బుమ్రాలాగా వీరు నమ్మకస్తులు కారు. ఎప్పుడెలా ఆడతారో ఎవరూ చెప్పలేరు. అలాగే మూడో పేసర్ గా నితీవ్ ఆడతాడు. ఈ క్రమంలో పటిష్టమైన ఇంగ్లాండ్ ను పేస్ దళం ఎలా నిలువరిస్తుందో చూడాలి. ఇక స్పిన్నర్లలో సుందర్ ను తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అంతా కుల్దీప్ యాదవ్ ను తీసుకుంటారని అనుకుంటుండగా, సుందర్ ను తీసుకుని టీమ్ మేనేజ్మెంట్ చిన్నపాటి షాకిచ్చారు. ఏదేమైనా ఈ మ్యాచ్ లో ఇద్దరు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, సుందర్లతో బరిలోకి దిగుతోంది. అయతే ఈ పిచ్ స్పిన్నర్లకు ఏమాత్రం సహకరిస్తుందో చూడాలి. మరోవైపు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని, ఛేజింగ్ పై తనకున్న మక్కువను మరోసారి స్టోక్స్ చూపించాడు.
