ఎలిస్‌ పెర్రీ... అంతర్జాతీయ క్రికెట్లో ఓ సంచలనం.. నిఖార్సైన పేస్‌ బౌలింగ్‌, మిడిలార్డర్లో హిట్టింగ్‌తో మోస్ట్‌ ప్రామినెంట్‌ క్రికెటర్‌గా ఎదిగింది. 2007 నుంచి ఏకధాటిగా క్రికెట్ ఆడుతోన్న ఎలిస్‌ పెర్రీ... అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. నేడు భారత్‌– -ఆస్ట్రేలియా మధ్య నవీ ముంబైలోని డాక్టర్‌ డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరగాల్సి ఉన్న రెండో టీ20 పెర్రీ ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 300వ మ్యాచ్‌. మహిళల క్రికెట్‌ చరిత్రలో 300కుపైగా ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడినవారిలో ముగ్గురు క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. నేటి మ్యాచ్‌తో పెర్రీ వాళ్ల సరసన చేరనుంది. ఆస్ట్రేలియా తరఫున 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఎలిస్‌పెర్రీ చరిత్ర సృష్టించనుంది. ఉమెన్స్‌ క్రికెట్‌లో 300 ప్లస్‌ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడిన వారిలో భారత్‌ నుంచి మాజీ సారథి మిథాలీ రాజ్‌ (333), ఇంగ్లండ్‌ దిగ్గజం చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (309), కివీస్‌ మాజీ బ్యాటర్‌ సూజీ బేట్స్‌ (309)లు మాత్రమే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో పెర్రీ కూడా చేరనుంది. 2007లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పెర్రీ తన సుదీర్ఘ కెరీర్‌లో 12 టెస్టులు, 141 వన్డేలు, 146 టీ20లు ఆడింది. డజను టెస్టులాడిన పెర్రీ 21 ఇన్నింగ్స్‌లలో 925 పరుగులు, 141 వన్డేలలో 114 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి 3,852 పరుగులు చేసింది. 

 

తొలి టీ 20 లో భారత్‌ విజయం

వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడిన భారత మహిళల జట్టు... మూడు మ్యాచుల టీ సిరీస్‌ను ఘన విజయంతో ప్రారంభించింది. మొదట ఆస్ట్రేలియా(Austrelia)ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమిండియా ఉమెన్స్‌ టీం(Team India Womens ).... తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. మొదట తితాస్‌ సాధు అద్భుత బౌలింగ్‌తో కంగారు జట్టును కట్టిపడేసింది. తర్వాత ఓపెనర్‌ షెఫాలి వర్మ, స్మృతి మంధాన మెరుపులతో తొలి టీ 20 మ్యాచ్‌లో విజయదుంధుబి మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే పర్వాలేదనిపించిన కంగారుల బ్యాటింగ్‌...యువ పేసర్‌ తితాస్‌ సాధు బౌలింగ్‌కు రాగానే కకావికలమైంది. ఆ జట్టు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న తీరు చూస్తే 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ లిచ్‌ఫీల్డ్‌.. ఎలిస్‌ పెర్రీ మరోసారి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఎలిస్‌ పెర్రీ 30 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు చేయగా.... లిచ్‌ఫీల్డ్‌ 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 49 పరుగులు చేసి అర్ధ శతకానికి ఒక్క పరుగు దూరంలో అవుటైంది. వీరి దూకుడుతో 14 ఓవర్లలో ఆస్ట్రేలియా 112 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌ (2/19), దీప్తిశర్మ (2/24) విజృంభించడంతో ఆసీస్‌ తడబడింది. భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో లిచ్‌ఫీల్డ్‌ ఔట్‌ కావడంతో మొదలైన పతనం ఆ తర్వాత ఆగలేదు. ఆస్ట్రేలియా తన చివరి 6 వికెట్లను కేవలం 29 పరుగుల తేడాతో చేజార్చుకుంది. దీంతో 19.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 141 పరుగులకు ఆలౌట్‌ అయింది.

 

142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు లక్ష్య చేధన కష్టంగానే అనిపించింది. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంధాన ఎదురుదాడికి దిగి ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమే లేకుండా చేశారు. షెఫాలి వర్మ (64 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4, 3×6), స్మృతి మంధాన (54; 52 బంతుల్లో 7×4, 1×6) మెరుపులతో లక్ష్యాన్ని భారత్‌ 17.4 ఓవర్లలో ఒక వికెటే కోల్పోయి అందుకుంది.