Delhi Test Pitch Report: వెస్టిండీస్ తో ఈనెల 10 నుంచి న్యూఢిల్లీ వేదికగా రెండోటెస్టు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి పిచ్ ను కాస్త బ్యాటింగ్ కు అనుకూలంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ పై ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 2 టెస్టుల సిరీస్ లో 1-0తో టీమిండియా తిరుగులేని ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల విజృంభణతో విండీస్ బౌలర్లు కనీస ప్రతిఘటన చేయలేకపోయారు. కనీసం 200+ మార్కును ఒక్క ఇన్నింగ్స్ లోనూ నమోదు చేయలేక పోయారు. అయితే ఈసారి మాత్రం బ్యాట్ కు మంచిగా అనుకూలించే పిచ్ తో పాటు మంచి బౌన్స్ ఉండే వికెట్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. జాగ్రత్తగా ఆడితే తొలి రెండున్నర రోజులు బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశముంది. విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినట్లయితే మంచి స్కోరును సాధించే చాన్స్ ఉంది. అయితే దీనిని ఆ జట్టు బ్యాటర్లు ఎలా ఉపయోగించుకుంటారో చూడాల్సి ఉంది.
ట్రెడిషినల్ గా..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం అనాదిగా స్పిన్ కు అనుకూలిస్తూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం కొత్త వికెట్ ను క్యూరెటర్లు రూపొందించారు. స్టేడియంలో మధ్య భాగంలో నూతన బ్లాక్ సాయిల్ పిచ్ ను ఏర్పాటు చేశారు. గతంలో స్మృతి మంధాన ఇదే వేదికపై 50 బంతుల్లో సెంచరీ చేసిన పిచ్ కంటే కాస్త భిన్నంగా ఉంటుందని క్యూరెటర్లు చెబుతున్నారు. తొలి రెండురోజులతోపాటు మూడోరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి స్పిన్ కు అనుకూలించే అవకాశముంది. దీంతో పిచ్ పరిస్థితి రిత్యా జట్టు కూర్పు ఎలా ఉండబోతోందో అని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పిచ్ పరిస్థితిని బట్టి, పేసర్లకు ఎక్కువగా ఆడించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో స్పిన్నర్లలో ఎవరిపై వేటువేస్తారో చూడాల్సి ఉంది.
రెండో స్థానంపై కన్ను..
ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో ప్రస్తుతం మూడోస్థానంలో భారత్ ఉంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన టీమిండియా 3 విజయాలు, 1 డ్రా, రెండు పరాజయాలతో 40 పాయింట్లు సాధించింది. ఇక విండీస్ తో జరిగే రెండో టెస్టులో విజయం సాధిస్తే తన స్థానాన్ని మెరుగుపర్చుకునే అవకాశముంది. టేబుల్ టాప్ లో ఆస్ట్రేలియా ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి, టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. రెండు మ్యాచ్ లు ఆడిన శ్రీలంక ఒక గెలుపు, ఒక డ్రాతో 16 పాయింట్లు, 66.67 విజయ శాతంతో రెండో స్థానంలో నిలిచింది. సో..ఇప్పుడు ఢిల్లీ టెస్టులో ఇండియా గెలిస్తే లంకను అధిగమించే అవకాశముంది. ఇక ఈ చాంపియన్షిప్ లో ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్ కు వెళ్లినా, రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. 2021లో న్యూజిలాండ్ చేతిలో, 2023లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. 2025 ఫైనల్ కు ఇండియా అర్హత సాధించలేదు. ఈసారి మాత్రం ఫైనల్ చేరాలని భావిస్తోంది.