MI Vs DC Thrilling Match: ఢిల్లీ అద్భుత విజయం.. చివరి బంతికి జట్టును గెలిపించిన తెలుగమ్మాయి.. ముంబై ఓటమి
చివరి బంతికి తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి 2పరుగులు సాధించడంతో ఢిల్లీ.. 2 వికెట్లతో గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది.

WPL MI Vs DC Result Update: డబ్ల్యూపీఎల్ ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 2 వికెట్ల తేడాతో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. చివరి బంతికి తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (2 నాటౌట్) రెండు పరుగులు సాధించడంతో ఢిల్లీ.. 2 వికెట్లతో గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాటర్ నాట్ స్కివర్ బ్రంట్ అజేయ అర్థ సెంచరీ (59 బంతుల్లో 80 నాటౌట్, 13 ఫోర్లు)తో సత్తా చాటింది. బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనను సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి ఢిల్లీ పూర్తి చేసింది. విధ్వంసక ఓపెనర్ షెఫాలీ వర్మ (18 బంతుల్లో 43, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచింది. హీలీ మాథ్యూస్, అమేలియా కెర్ కు రెండేసి వికెట్లు లభించాయి. నికీ ప్రసాద్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. డిల్లీ తరఫున ఇదే అత్యుత్తమ ఛేదన కావడం విశేషం.
మిడిలార్డర్ విఫలం..
ఈ మ్యాచ్ లో ముంబై తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలోనే హీలీ డకౌట్ గా వెనుదిరిగినా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (42)తో కలిసి బ్రంట్ ఇన్నింగ్స్ ను కుదుట పర్చింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 73 పరుగులు జోడించడంతో ఒక దశలో 105/2 తో పటిష్టంగా నిలిచింది. ఢిల్లీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోన్న బ్రంట్ వేగంగా పరుగులు సాధించింది. దీంతో 36 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. మరోవైపు హర్మన్ కూడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకు పడింది. అయితే హర్మన్ వెనుదిరిగాకా, మిడిలార్డర్ విఫలం కావడంతో ముంబై అనుకున్నంత స్కోరు చేయలేక పోయింది. బౌలర్లలో శిఖా ఫాండేకు రెడు, అలైస్ కాప్సే, మిన్ను మణిలకు తలో వికెట్ దక్కింది.
తుఫాన్ ఆరంభం..
ఛేజింగ్ లో షెఫాలీ దూకుడుగా ఆడటంతో రాకెట్ వేగంతో ఢిల్లీ ఇన్నింగ్స్ దూసుకుపోయింది. పవర్ ప్లే లోపలే ఫెఫాలీ వీలైనంతగా డ్యామెజీ చేసింది. దీంతో 5.5 ఓవర్లలోనే 60 పరగుల మార్కును ఢిల్లీ దాటింది. ఆ తర్వాత మిడిలార్డర్లో తలో చేయి వేయడంతో ఢిల్లీ లక్ష్యం వైపు కాస్త పడుతూ లేస్తూ వెళ్లింది. ఈ దశలో నికీ ప్రసాద్ (35) యాంకర్ రోల్ పోషిస్తూ జట్టును దాదాపుగా విజయతీరాల వరకు తీసుకెళ్లింది. అయితే చివర్లో 2 బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన దశలో ఔట్ కావడంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన తెలుగమ్మాయి అరుంధతి.. సంజన బౌలింగ్ లో బంతిని గాల్లోకి లేపి, రెండు పరుగులు పూర్తి చేసింది. త్రో అందుకున్న హర్మన్ రనౌట్ చేయాలని ప్రయత్నించినా, సేఫ్ గా క్రీజులోపలికి చేరుకుంది. దీంతో ఢిల్లీ క్యాంప్ ఆనంద డోలికల్లో మునిగి పోయింది. మిగతా బౌలర్లలో షబ్నిం ఇస్మాయిల్, బ్రంట్, సంజనలకు తలో వికెట్ దక్కింది.