Virat Kohli Congratulates Smriti Mandhana & Co. On Video Call After RCB's WPL Trophy: గత రెండు రోజులుగా క్రికెట్‌ ప్రపంచం ఆర్సీబీ నామస్మరణతో ఊగిపోతోంది. దశాబ్దంన్నర కాలంగా పురుషుల జట్టు సాధించలేకపోతున్న ట్రోఫీ కలను.. డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి బెంగళూరు మహిళలు నిజం చేశారు. ఐపీఎల్‌(IPL) ప్రారంభమైనప్పటి నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) బరిలో దిగినప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే మాట. ఈ సాలా కప్‌ మనదే అంటూ హంగామా చేసి.... తీరా కీలక మ్యాచ్‌లలో ఓడిపోతూ పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ విజేత కలను ఉమెన్స్‌ ప్రీమియర్‌ల లీగ్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. కోహ్లీ, డివిలియర్స్‌ సహా దిగ్గజ ఆటగాళ్లతో చాలా పటిష్టంగా కనింపించిన RCB... ఐపీఎల్‌లో ప్రతీసారి టైటిల్‌ ఫేవరెట్‌గానే బరిలోకి దిగేది. కానీ విరాట్‌ కోహ్లీ(Virat kohli), అనిల్‌ కుంబ్లే(Anil Kumble), ఏబీ డివిలియర్స్‌(ABD), ఫాఫ్‌ డుప్లెసిస్‌ వంటి దిగ్గజాలు.. ఈ కలను సాకారం చేయలేకపోయారు. దాదాపుగా 16 ఏళ్లుగా దిగ్గజ క్రికెటర్లకు సాధ్యంకాని కలను ఆర్సీబీ అమ్మాయిలు సాకారం చేశారు. ఈ చారిత్రక విజయం తర్వాత బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మంధాన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




 

కోహ్లీ వీడియో కాల్‌లో...

ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ అమ్మాయిలు గెలిచిన తర్వాత కోహ్లి వీడియో కాల్‌ చేసి మంధానతో పాటు జట్టును అభినందించాడు. స్టేడియంలో అధిక శబ్దం కారణంగా వీడియో కాల్‌లో కోహ్లి ఏం చెప్పాడో వినిపించలేదని... బొటనవేలు ఎత్తి విజయ సంకేతం చూపించాడని కెప్టెన్‌ స్మృతి మంధాన తెలిపారు. కోహ్లీ ఎంతో సంతోషంగా కనిపించాడని, విజయ దరహాసం చేశాడని ఆమె ఆనందంతో చెప్పారు. నిరుడు కోహ్లి తమ కోసం వచ్చాడని... అది తనకు, జట్టుకు వ్యక్తిగతంగా ఎంతో ఉపయోగపడిందని కూడా స్మృతి తెలిపిందితెలిపింది. ఫైనల్లో నాలుగు వికెట్లు సహా ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన శ్రేయాంక పాటిల్‌పై మంధాన ప్రశంసల జల్లు కురిపించింది. శ్రేయాంక అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. 

 

స్మృతి ఏమందంటే...

ఆర్సీబీ ఉమెన్స్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఈసాలా కప్ నమదే నినాదంపై స్పందించింది. ఇప్పుడు తన ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించలేనని తెలిపింది. తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నానని భావోద్వేగానికి గురైంది. సరైన సమయంలో సమష్టిగా రాణించి అద్భుతం సృష్టించామని మంధాన తెలిపింది. గత సీజన్ ఓటమి నుంచి ఠాలు నేర్చుకుని.. ఈ సీజన్‌లో రాణించామని తెలిపింది. తమ ఫ్రాంఛైజీ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఇది మీ టీమ్ మీ ఇష్టమున్న నిర్ణయాలు తీసుకోండని చెప్పిందని తెలిపింది. ఈ టైటిల్ ఆర్సీబీకి ఎంతో విలువైందన్న స్మృతి  ట్రోఫీ గెలిచింది తాను కాదని  ఇది జట్టు విజయమని తెలిపింది. ప్రతిసారి ఈసాలా కప్ నమదే  అని నినదించే అభిమానులకు స్మృతి చక్కటి సందేశాన్ని ఇచ్చింది. ఈసాలా కప్ మనదే అని గర్వంగా చెప్పండి. తనకు కన్నడ మరీ అంత గొప్పగా ఏమీ రాదని... కానీ ఫ్యాన్స్‌కు ఈ మెసేజ్ ఇవ్వడం ముఖ్యమని స్మృతి మంధాన పేర్కొంది.