Border Gavaskar Trophy:  యాషెస్ గెలవడం కన్నాభారత్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడమే తమకు చాలా ముఖ్యం అని ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెప్తున్నారు. అంతటి ప్రతిష్ఠాత్మకమైన సిరీస్ కు మరొక రోజు మాత్రమే మిగిలిఉంది. భారత్- ఆస్ట్రేలియా మధ్య ఎప్పట్నుంచో మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే 1996- 97 సీజన్ నుంచి ఆసీస్, టీమిండియా లెజెండ్స్ అలెన్ బోర్డర్- సునీల్ గావస్కర్ పేరు మీదుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఉన్న టాప్- 10 విశేషాలు ఏంటో చూద్దామా. ఇందులో ఏది ముందు, ఏది చివర అని ఏంలేదు. ఎందుకంటే దేనికదే స్పెషల్. సో పదండి.. ఆ విశేషాలు తెలుసుకుందాం.


1. 2021 గబ్బా టెస్టు


ఈ టెస్టు కన్నా 32 ఏళ్ల ముందు వరకు గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించిన జట్టు లేదు. అలాంటిది గాయాలతో స్టార్ ఆటగాళ్లు దూరమైనా.. అనుభవం లేని బౌలింగ్ విభాగంతో.. ద్వితీయ శ్రేణి జట్టుతోనే భారత్, ఆసీస్ పై గెలిచింది. ఈ విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా సాధించిన ఈ విజయం చరిత్రలో తప్పక నిలిచిపోతుంది. శుభ్ మన్ గిల్, పుజారా, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ లు ఈ మ్యాచ్ లో హీరోలు. 


2. 2021లోనే భారత్ 36 ఆలౌట్


ఇదే చరిత్రాత్మక సిరీస్ లో భారత్ ఘోర పరాభవానికి గురైంది. ఆసీస్ తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో 36 పరుగులకే ఆలౌట్ అయి అవమానాన్ని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ ఈ దారుణ ప్రదర్శనను మరిపించేలా భారత్ సిరీస్ విజయం సాధించింది. 






3. 2018-19 సిరీస్


2020-21 సీజన్ లో వరుసగా రెండోసారి మనం ఆసీస్ గడ్డపై సిరీస్ గెలుచుకున్నాం. అయితే అంతకుముందే కెప్టెన్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2018- 19 సిరీస్ లో ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించిన తొలి నాయకుడిగా నిలిచాడు. ఆ సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది.


4. 2017లో ఇషాంత్ శర్మ


2020-21 సీజన్, 2016-17 సిరీస్... ఈ రెండింటిలో బెస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏదో చెప్పడంకొంచెం కష్టమే. ఎందుకంటే 2017 సిరీస్ లోనూ ఎంతో డ్రామా ఉంది. దానికి చిన్న ఉదాహరణ ఇషాంత్ శర్మ హావభావాలు. ఈ సిరీస్ సమయానికి ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ అద్భుత ఫాంలో ఉన్నాడు. భారత బౌలర్లను విసిగించడమే పనిగా పెట్టుకున్నాడు. స్టీవ్ స్మిత్ క్రీజులో ఉన్నప్పుడు చాలా వింత కదలికలు ఇస్తుంటాడు. దానికి కౌంటర్ గానే ఇషాంత్ కూడా వింత ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. అది అప్పుడు నవ్వులు పూయించింది. 


5. 2021లో అశ్విన్-పైన్ స్లెడ్జింగ్


బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆటతో పాటు స్లెడ్జింగ్ కూడా భాగమే అన్నట్లు ఉంటుంది. అలాంటిదే 2021లో అశ్విన్, టిమ్ పైన్ మధ్య జరిగింది. అశ్విన్ ను ఉద్దేశించి.. పైన్ మొదట స్లెడ్జింగ్ చేశాడు. నువ్వు గబ్బాకు ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తున్నా అన్నాడు. కానీ చివరకు గబ్బాకు వచ్చేసరికి ఏమైందో తెలుసుగా. ఆస్ట్రేలియాపై గెలిచి ఇన్ డైరెక్ట్ గా టిమ్ పైన్ కు టీమిండియా మొత్తం కలిసి కౌంటర్ ఇచ్చింది. అప్పుడు భారత అభిమానులు పైన్ ను గట్టిగా ట్రోల్ చేశారు. 


6. 2001 ద్రవిడ్-లక్ష్మణ్ 


ఫాలో ఆన్ ఆడుతూ భారత్ మ్యాచ్ గెలిచిన అద్భుతమైన ఘట్టం ఇది. దీన్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మ్యాచ్ అనవచ్చు. భారత దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180)లు వారి కెరీర్ లోనే బెస్ట్ ఆటను బయటపెట్టిన వేళ ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. హర్భజన్ సింగ్ 13 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. టెస్ట్ చరిత్రలోనే గ్రెటెస్ట్ కంబ్యాక్ మ్యాచుల్లో దీన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు. 


7. 2003లో సచిన్ 241 ఇన్నింగ్స్


టెస్ట్ క్రికెట్ కు అవసరమైన నైపుణ్యాలు, కావలసిన సహనం అంటే ఏంటో సచిన్ చూపిన ఇన్నింగ్స్ ఇది. అప్పటికి సచిన్ కు ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతులు ఆడడంలో బలహీనత ఉండేది. అందుకే అసలు ఈ మ్యాచ్ మొత్తం సచిన్ ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడలేదు. ఎంతో ఓపికగా ఆఫ్ స్టంప్ బయట పడిన బంతులను వదిలేస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సచిన్ కెరీర్ లోనే కాదు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోను ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది.


8. 2017 పుణె టెస్ట్


పర్యటనకు వచ్చీ రాగానే ఆస్ట్రేలియాను స్పిన్ తో ఉక్కిరిబిక్కిరి చేసేద్దామనుకున్న టీమిండియా ప్లాన్ మనకే ఎదురుతిరిగింది. స్టీవ్ ఓ కీఫ్ దెబ్బకు మనవాళ్లు అల్లాడారు. అంతకంతకూ ప్రమాదకరంగా మారుతున్న పిచ్ పై మూడో ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ సెంచరీ తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్. తొలి టెస్టులో గెలిచి సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 లీడ్ సాధించినా చివరకు ఇండియానే 2-1 తో సిరీస్ గెలుచుకుంది. 


9. 2004-05 సిరీస్


ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే... 1969-70 తర్వాత తొలిసారి భారత గడ్డపై ఆస్ట్రేలియా ఓ టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. 4 మ్యాచుల ఈ సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఆఖరి మ్యాచ్ ను ఇండియా గెలిచింది. సిరీస్ ను 2-1 తేడాతో ఆసీస్ గెలుచుకుంది. 


10. 2014లో  విరాట్ కోహ్లీ ట్విన్ సెంచరీస్


ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది కానీ.. అటాకింగ్ గేమ్ ను మాత్రం పరిచయం చేసింది. రాబోయే రోజుల్లో టీమిండియా ఎలాంటి క్రికెట్ ఆడుతుందో ప్రపంచానికి చాటిచెప్పింది. ధోనీ గాయపడటంతో విరాట్ కోహ్లీ తొలిసారి టెస్ట్ మ్యాచ్ కు సారథ్యం వహించాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు బాదాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో సహచరులందరూ పెవిలియన్ చేరుతున్నా కోహ్లీ గెలుపు కోసం పోరాడిన తీరు ఆకట్టుకుంటుంది. డ్రా కోసం కాకుండా గెలుపు కోసమే ఆడిన విరాట్ జట్టును దాదాపు గెలిపించినంత పని చేశాడు. కానీ మురళీ విజయ్ (99) తప్ప మిగతా వారి సహకారం లేకపోవటంతో భారత్ కు ఓటమి తప్పలేదు. అయితే ఆ తర్వాతి నుంచి టీమిండియా ఫియర్ లెస్ క్రికెట్ ఆడడం నేర్చుకుంది.