Case Filed Against Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)పై ఛీటింగ్ కేసు నమోదైంది. క్రికెట్ అకాడమీ నిర్వహణ విషయంలో మహేంద్రసింగ్‌ ధోనీ తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశాడని ఓ వ్యక్తి బీసీసీఐ(BCCI)కి ఫిర్యాదు చేశాడు. ఉ్తతరప్రదేశ్‌లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య ఈ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై బీసీసీఐ వెంటనే స్పందించింది. రూల్ 36 కింద కేసును నమోదు చేసుకొన్న బీసీసీఐ ఎథిక్స్‌ కమిటీ.. ఆగస్ట్ 30లోపు వివరణ ఇవ్వాలని ధోనీని ఆదేశించింది. 2017లో ఎంఎస్ ధోనీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీ నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మహేంద్రసింగ్‌ ధోనీతో ఒప్పందం చేసుకుంది. 

 

అయితే ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విఫలమైంది. ఆర్కా స్పోర్ట్స్‌(Aarka Sports Management Pvt Ltd)కు చెందిన మిహిర్‌ దివాకర్‌, సౌమ్య విశ్వాస్‌తో మహీ భాయ్‌ చర్చించినా అవి సఫలం కాలేదు. దీంతో విసిగిపోయిన ధోనీ ఆ ఒప్పందం నుంచి వైదొలిగాడు. 2021 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను ధోనీ రద్దు చేసుకున్నాడు. దాదాపు రూ. 15 కోట్ల మేర తనకు రావాలని పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించినా ఆర్కా స్పోర్ట్స్‌ నుంచి ఎవరూ స్పందించడం లేదని ధోనీ గతంలోనే రాంచీ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారాణలో ఉంది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే ధోనీనే తమను మోసం చేశాడని ఆర్కా స్పోర్ట్స్‌కు చెందిన రాజేశ్ కుమార్ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో ధోనీపై ఛీటింగ్ కేసు నమోదవ్వడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఈ వార్త తలా అభిమానులకు ఆందోళనకు గురిచేసింది. 

 

తలా ఐపీఎల్‌ ఆడతాడా..?

మరోవైపు మహేంద్రుడు ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ధోనీని ఎలాగైనా ఆడించాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్రణాళికలు రచిస్తోంది. ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకోవాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌ వ్యూహాలు రచిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తయిన ఆటగాళ్లను అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా గతంలో పరిగణించే వాళ్లు.  2008 నుంచి 2021 వరకు ఈ రూల్‌ అమల్లోనే ఉంది. అయితే ఆ తర్వాత ఈ రూల్‌ను తీసేశారు. ఇప్పుడు ఈ  రూల్‌ను మళ్లీ అమల్లోకి తేవాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ కోరుతోంది. ధోనీ కోసం ఈ రూల్‌ను మళ్లీ అమలు చేయాలని చెన్నై సూపర్‌కింగ్స్ కోరుతోంది. అయితే ఇతర ఫ్రాంచైజీలు మాత్రం చెన్నై సూపర్‌కింగ్స్ డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ రిటైన్షన్ రూల్స్ వచ్చిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోనీ ఇప్పటికే స్పష్టం చేశాడు.