Border-Gavaskar Trophy between India and Australia extend to five Tests: ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య  ప్రతిష్ఠాత్మక జరిగే బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌(Border Gavaskar Trophy)లో మార్పు జరిగింది. ఈ సిరీస్‌లో ఒక టెస్ట్‌ మ్యాచ్‌ను అదనంగా జోడించారు. ఇప్పటివరకూ ఎక్కువగా నాలుగు టెస్టుల సిరీస్‌గా దీన్ని నిర్వహించగా ఇప్పుడు ఐదు టెస్టుల సిరీస్‌గా దీన్ని నిర్వహించనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు(Cricket Australia) ప్రకటించింది. 32 ఏళ్ల తర్వాత  తొలిసారి ఇలా రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ నిర్వహిస్తున్నారు. 1991-92 తర్వాత తొలిసారి భారత్‌-ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయని బీసీసీఐ( BCCI ) తెలిపింది. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ తాజా షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తగా ఎక్స్‌లో పోస్టు చేశాయి.



వేదికలు ఇవే
టీమిండియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా వేదికలను ఖరారు చేసింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో మొదటి టెస్టు జరగనుంది. పెర్త్‌లో ఇటీవల పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు పెద్దగా ప్రేక్షకులు రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులను రప్పించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రణాళికలు రచిస్తోంది. రెండో మ్యాచ్ అడిలైడ్ ఓవల్‌ మైదానంలో జరగనుండగా, మూడో టెస్టు మ్యాచ్‌కు బ్రిస్బేన్‌లోని ది గబ్బా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. బాక్సింగ్ డే టెస్ట్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకురావాలని క్రికెట్ ఆస్ట్రేలియా గట్టిగా ప్రయత్నిస్తోంది.


టీ 20 ప్రపంచకప్‌ వేట కూడా..
క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్‌ ఇప్పటికే వచ్చేసింది. జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Team India), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. ఈ టీ 20 ప్రపంచకప్ ట్రోఫీ యాత్ర న్యూయార్క్‌లో మొదలైంది. ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌ ట్రోఫీ యాత్ర ప్రారంభమైంది. విధ్వంసకర బ్యాటర్‌, యూనివర్సల్‌ బాస్‌, రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన క్రిస్‌ గేల్‌, అమెరికా బౌలర్‌ అలీ ఖాన్‌ ప్రఖ్యాత ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ నుంచి ట్రోఫీ యాత్రను ఆరంభించారు. ట్రోఫీ యాత్ర 15 దేశాల్లో సాగుతుంది.