BCCI New Chief Selector: 


టీమ్‌ఇండియాకు సరికొత్త చీఫ్‌ సెలెక్టర్‌ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌నే ఈ పోస్టు వరిస్తుందని సమాచారం. నార్త్‌ జోన్‌ నుంచి అతడిని మించిన సమర్థులు ఎవరూ కనిపించడం లేదు. అయితే సాలరీ దగ్గరే పేచీ ఉందని తెలిసింది.


ఇప్పుడు చేతన్‌ శర్మ టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నార్త్‌ జోన్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రొటేషన్‌ పద్ధతిలో మరోసారీ ఇదే జోన్‌ వ్యక్తికి ఈ పదవిని అప్పగించాల్సి వస్తోంది. దాంతో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను బీసీసీఐ సంప్రదించినట్టు తెలిసింది. అయితే వేతనం దగ్గరే అసలు సమస్య ఎదురవుతోంది. ప్రస్తుతం ఛైర్మన్‌ ఆఫ్‌ సెలక్టర్‌కు ఏడాదికి రూ.కోటి వరకు ఇస్తున్నారు. మిగిలిన నలుగురు సెలక్టర్లకు రూ.90 లక్షలు ఇస్తున్నారు. ఇంత తక్కువ మొత్తానికి వీరూ అంగీకరించేలా లేడు.


క్రికెట్‌ పరంగా వీరేంద్ర సెహ్వాగ్‌ స్థాయి పెద్దది. అతడితో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు చాలామంది స్పాన్సర్లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా వాణిజ్య ప్రకటనల్లో ఆయన నటిస్తున్నారు. అంతేకాకుండా క్రికెట్‌ కామెంటరీ చేస్తున్నారు. సొంతంగా పాఠశాల నిర్వహిస్తున్నారు. గతంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో కోచ్‌, క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పటికీ ఆయన అలాంటి వచ్చే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నిటితో పోలిస్తే రూ.కోటి ఎంత వరకూ సరిపోదు.


టీమ్‌ఇండియా క్రికెటర్ల వార్షిక వేతనమే గ్రేడ్లను బట్టి రూ.3 నుంచి రూ.10 కోట్లకు పైగా ఉంది. పైగా వాణిజ్య ఒప్పందాలతో రూ.కోట్లలో సంపాదిస్తున్నారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వంటి క్రికెటర్లు ఏకంగా రూ.100 కోట్ల మేర ఆర్జిస్తున్నారు. ఇక కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ సైతం ఏడాదికి రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు చీఫ్‌ సెలక్టర్‌కు ఎందుకు తక్కువ ఇస్తున్నారో అర్థమవ్వడం లేదు. బహుశా సెహ్వాగ్‌ గనక అంగీకరిస్తే అతడి సాలరీ పెంచొచ్చు. కాకపోతే పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో ఇతరు ఎండార్స్‌మెంట్లు చేసుకోలేడు.


నిజానికి అనిల్‌ కుంబ్లే కన్నా ముందే వీరేంద్ర సెహ్వాగ్‌ను టీమ్‌ఇండియా కోచ్‌ పదవి కోసం సంప్రదించారు. 'క్రికెట్‌ పాలకుల సమయంలో ప్రధాన కోచ్‌ పదవికి అనిల్‌ కుంబ్లే కన్నా ముందు వీరేంద్ర సెహ్వాగ్‌ను దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరింది. అతడి స్థాయికి తక్కువ వేతనం కావడంతో ముందుకు రాలేదు. ఒకవేళ నిజంగానే స్థాయి గురించి ఆలోచిస్తే నార్త్‌ జోన్‌ నుంచి అతడిని మించి ఎవరూ లేరు. చీఫ్ సెలక్టర్‌కు రూ.4-5 కోట్లు ఇవ్వడం బీసీసీకి అసలు సమస్యేమీ కాదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల గొడవల వల్లే మాజీ ఆటగాళ్లు ఎవరూ ముందుకు రావడం లేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.


అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ స్థాయి లేని క్రికెటర్లు సెలక్టర్లుగా విరాట్‌ కోహ్లీ, రవిశాస్త్రి లేదా రాహుల్‌ ద్రవిడ్‌ లాంటివాళ్లతో ఎక్కువగా మాట్లాడలేరని ఆ అధికారి అన్నారు. 'దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు విరాట్‌ కోహ్లీ, ఎస్‌ బద్రీనాథ్‌లో ఎవరో ఒకర్నే ఎంచుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆస్ట్రేలియాలో ఇండియా-ఏ గేమ్స్‌ను ఆయన చూశారు. విరాట్‌ను ప్రోత్సహించారు. ఆ నిర్ణయం చరిత్ర సృష్టించింది. గ్రెగ్‌ ఛాపెల్‌ వంటి దిగ్గజాల ముందు ఆయన సులువుగా తన అభిప్రాయం చెప్పగలరు' అని వెల్లడించారు.


టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌, గౌతమ్ గంభీర్‌ సైతం నార్త్‌ జోన్‌కు చెందినవారే. కాకపోతే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు అవ్వలేదు. దాంతో వారు సెలక్షన్‌ పరిధిలోకి రావడం లేదు. ఒకవేళ బీసీసీఐ నిబంధనలను సడలిస్తే ఇతరులకు అవకాశం దక్కొచ్చు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial