భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఏడాది క్రితం డిసెంబర్‌ 30న పంత్‌కు యాక్సిడెంట్‌ అయింది. ఇప్పటికీ ఈ ప్రమాదం జరిగి ఏడాది గడిచిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్‌ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. కొత్త ఏడాది రోజున ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఢిల్లీ నుంచి ఒంటరిగా పంత్‌ బయల్దేరగా.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  గత ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన పంత్‌ మళ్లీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ పంత్‌ ప్రమాదం జరిగిన రోజును  గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోను ఢిల్లీ ఫ్రాంచైజీ షేర్‌ చేసింది.

 

ఆ ఫోన్‌తో వణికిపోయా...

ఉదయం ఏడు గంటల సమయంలో మా సోదరి నాకు ఫోన్‌ చేసి పంత్‌తో నువ్వు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడావు? అని అడిగింది. ముందు రోజే మాట్లాడాలని అనుకున్నా కుదరలేదని చెప్పానని... వెంటనే పంత్‌ అమ్మగారి ఫోన్‌ నంబర్‌ ఉంటే పంపించమని నన్ను అడిగిందని అక్షర్‌ గుర్తు చేసుకున్నాడు. ఎందుకు అని అడిగితే.. పంత్‌కు ప్రమాదం జరిగిందని చెప్పిందని... ఆ మాట వినగానే షాక్‌కు గురయ్యానని... ఒక్కసారిగా భయం ఆవరించిందని అక్షర్‌ అన్నాడు. పంత్‌కు ఏదో జరిగిపోయిందని భావించానని భావోద్వేగానికి గురయ్యాడు. ఆనాటి ఘటనను అతడు తాజాగా గుర్తుచేసుకున్నాడు.

 

శ్రమిస్తున్న పంత్‌

కారు ప్రమాదంలో గాయపడ్డ పంత్ గత ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. ఈసారి ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో పునరాగమనం కోసం తీవ్రకసరత్తు చేస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ల ప్రారంభం నాటికి పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉండేందుకు శ్రమిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో పంత్ కూడా ఉన్నాడు. అతను దక్షిణాఫ్రికాలో సిరీస్ కు భారత్ జట్టులో ఎంపిక కానప్పటికీ.. గత నెలలో జాదవ్ పూర్ యూనివర్శిటీ సాల్ట్ లేక్ క్యాంపస్ పిచ్ లో శిక్షణా శిబిరంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ సహచరులతో చేరాడు. పంత్ మళ్లీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం తన బరువును తగ్గించుకొని ఫిట్ గా ఉండేందుకు పంత్ జిమ్ లో వర్కవుట్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు. తిరిగి వస్తున్నాను అని పంత్ రాశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో బరువులు ఎత్తుతూ పుష్‌అప్స్ తీస్తున్న వీడియోను పోస్ట్ చేసి.. బౌన్సింగ్ బ్యాక్ విత్ ఎవ్‌రీ రిప్ అని పంత్‌ కామెంట్ పెట్టాడు. అంటే ఏ అవకాశాన్ని వదలట్లేదని అర్థం వచ్చేలా అన్నాడు. పంత్‌ను ఐపీఎల్- 2024 కోసం ఢిల్లీ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోగా.. భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ కోసం.. చెన్నై సూపర్ కింగ్స్ పంత్‌ను తీసుకునే అవకాశం ఉందని అంచనా వేశాడు. ధోనీ వారసుడిగా పంత్‌ కోసం చెన్నై చూస్తుండొచ్చని, ఇది మంచి ఎంపిక అని వ్యాఖ్యానించాడు.