AB de Villiers is excited to see Sarfaraz Khan: దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌(Sarfaraz Khan)కు భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. వైజాగ్‌(Vizag) వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరగనున్న రెండో టెస్టుకు కేఎల్ రాహుల్(KL Rahul), రవీంద్ర జడేజా(ravindra jadeja) దూరం కానుండటంతో.. సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. రంజీల్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన సర్ఫరాజ్‌కు అవకాశం ఇస్తూ ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీసీసీఐ అతణ్ని కరుణించింది. రెండో టెస్ట్‌లో తుది జట్టులో చోటు దక్కితే రాణించి స్థానం పదిలం చేసుకోవాలని సర్ఫరాజ్‌ ఖాన్‌ పట్టుదలతో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అందరిచూపు సర్ఫరాజ్‌పై నే కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్‌ 360 డివిలియర్స్‌... సర్ఫరాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Continues below advertisement


అతడి కోసం ఎదురుచూస్తున్నా...
విశాఖ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు  అవకాశం ఇవ్వాలని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ సూచించాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని మిస్టర్‌ 360 అన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి రికార్డు అత్యద్భుతంగా ఉందని.. టీమిండియా తరపున ఆరంగేట్రం చేసేందుకు సర్ఫరాజ్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని ఈ దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు తెలిపాడు. దేశవాళీలో అద్భుత ఆటతీరుతో అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా సర్ఫరాజ్‌ సత్తా చాటుతాడని డివిలియర్స్‌ ఆకాంక్షించాడు. రజత్ పాటిదార్ కూడా డొమాస్టిక్‌ క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడని.. కాబట్టి ఎవరికి జట్టులో చోటు దక్కుతుందో వేచి చూడాలని ఏబీడీ పేర్కొన్నాడు. దేశవాళీలో సర్ఫరాజ్‌ 66 ఇన్నింగ్స్‌లో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. 


దేశవాళీలో రికార్డుల మోత
26 ఏళ్ల సర్ఫరాజ్..ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్‌ జట్ల మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో 161 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్టులోనూ అతడు 96 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌ 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 69.85 యావరేజ్‌తో 3912 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు .


సిద్ధమవుతున్న టీమిండియా
ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం పాలై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్‌ సేన... ఈ టెస్టులో గెలిచి మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. రాహుల్‌, జడేజా గాయం కారణంగా రెండో టెస్ట్‌ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు జట్టు కూర్పు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్‌ బౌలర్‌ అవసరం లేనపుడు మహ్మద్‌ సిరాజ్‌ను తప్పించి ఒక బ్యాటర్‌ను అదనంగా తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.