why Jay Shah could be considered the best man for the job: ఐసీసీ ఛైర్మన్‌(ICC chairman)గా జై షా(Jay Shah) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో క్రికెట్‌ ప్రపంచంలో భారత్ ఎంత బలంగా ఉందో మరోసారి స్పష్టమైంది. ఇక ఐసీసీ ఛైర్మన్‌గా జైషా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఐసీసీ ఛైర్మన్‌గా జై షా సమర్ధుడని క్రికెట్‌ సభ్యత్వం ఉన్న మెజార్టీ దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం BCCI కార్యదర్శిగా.. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా జై షా చాలా కీలక పదవులు నిర్వర్తించాడు.  ఇంతకీ జైషా ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికవ్వడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఈ కారణాల కారణంగానే జైషా ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్ పదవికి అత్యుత్తమ ఎంపికగా చాలా దేశాలు భావించాయి. ఆ కారణాలు ఏంటంటే...?


 

ఆర్థిక నైపుణ్యం.. 

 జై షాకు ఆర్థిక కార్యకలాపాల నిర్వహణపై మంచి పట్టు ఉంది. జైషా పదవి కాలంలో బీసీసీఐ ఆర్థికంగా చాలా బలోపేతమైంది. ఐపీఎల్ మీడియా హక్కుల ఒప్పందం క్రికెట్‌ ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసింది. జై షా ఆర్థిక నైపుణ్యాలే దీనికి కారణం. క్రికెట్‌కు ఆదాయాన్ని పెంచే సామర్థ్యం జై షాకు ఉంది. ఈ ఆర్థిక నైపుణ్యత ICCకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కీలకం. ఐసీసీలో సభ్య దేశాల మధ్య ఆదాయ పంపిణీ ఎలా చేయాలన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. చిన్న దేశాల బోర్డులకు ఇందులో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్‌లు ఉన్నాయి. దీనికి ఐసీసీలో వ్యూహాత్మక ఆర్థిక సామర్థ్యం అవసరం. ఇది జై షాకు చాలా ఉంది. ICC ఆర్థిక కమిటీ ద్వారా ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు ఆదాయ వాటాను పెంచడానికి షా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

 

క్రికెట్ విస్తరణ 

  జైషా దృష్టి ఆర్థిక అంశాలతోపాటు క్రికెట్ విస్తరణపై కూడా దృష్టి పెట్టనున్నారు. జై షా చొరవతో ఇప్పటికే భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్‌ ప్రాముఖ్యత పెరుగుతోంది. క్రికెట్ సౌకర్యాలను అభివృద్ధి చేయడం, సాంప్రదాయేతర ప్రాంతాల్లో క్రికెట్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి  జై షా విస్తృత వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇటీవలి T20 ప్రపంచ కప్‌ను అమెరికాలో నిర్వహించి ఇప్పటికే ప్రాశ్చాత్య దేశాలకు క్రికెట్‌ను విస్తరించే వ్యూహాన్ని ఐసీసీ మొదలుపెట్టింది. ఇప్పుడు కొత్త మార్కెట్‌లలోకి క్రికెట్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో జై షా ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లీగ్‌లకు బ్లూప్రింట్‌గా మార్చిన ఐపీఎల్‌ అనుభవం జై షాకు ఉంది. కాబట్టి కొత్త మార్కెట్లకు క్రికెట్‌ను విస్తరించడంలో జై షా సమర్థుడని సభ్య దేశాలు భావించాయి. 

 

క్రికెట్‌ దౌత్యం

క్రికెట్ ప్రపంచం కేవలం ఆటకే పరిమితం కాలేదు. క్రికెట్‌ రాజకీయాలతో లోతుగా ముడిపడి ఉంది. అంతర్జాతీయ సంబంధాలు, టోర్నమెంట్ హోస్టింగ్‌లపై రాజకీయ చర్చ కూడా జరుగుతోంది. ఆసియా కప్ 2023ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడంలో జై షా పాత్ర ఉంది. సంక్లిష్టమైన దౌత్య కార్యకలాపాలను జై షా వ్యూహాత్మకంగా నిర్వహిస్తాడన్న పేరు ఉంది. ICCలో జైషా  నాయకత్వంలో ప్రధాన టోర్నమెంట్‌లు ఎలాంటి వివాదాలు లేకుండా జరుగుతాయని ఐసీసీ సభ్య దేశాలు భావించాయి.