3 Former Cricketers Who Can Become Next BCCI Secretary:

ఐసీసీ ఛైర్మన్‌(ICC Chairman) ఎంపిక ఆసక్తి రేపుతోంది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా(Jay Shah)... ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్‌.. గ్రెగ్‌ బార్‌ క్లే మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇక తదుపరి ఛైర్మన్‌ జై షానే అంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై జై షా ఎలాంటి ప్రకటన చేయకపోయినా... బీసీసీఐ అధికారికంగా స్పందించకపోయినా ఈసారి ఐసీసీ ఛైర్మన్‌ పీఠం భారత్‌కే దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే క్రికెట్‌లో పెద్దన్నలా వ్యవహరిస్తున్న బీసీసీఐ మరోసారి ఐసీసీ ఛైర్మన్‌ పదవిని చేపట్టే అవకాశం ఉందని చాలా దేశాల క్రికెట్‌ బోర్డులు భావిస్తున్నాయి. జై షా ఎంపికపై చాలా దేశాలు సానుకూలంగా కూడా ఉన్నాయి. అదే జరిగి జై షా నిలబడితే ఐసీసీ ఛైర్మన్‌ ఎంపిక ఏకగ్రీవం కానుంది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌ క్లే నవంబర్‌ 30తో తన పదవీ కాలాన్ని ముగిస్తారు. గ్రెక్‌ బార్‌ క్లే మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే దానికి బార్‌ క్లే నిరాసక్తత వ్యక్తం చేశాడు. గతంలో బార్‌ క్లే ఐసీసీ ఛైర్మన్‌గా నిలబడ్డప్పుడు జై షా సంపూర్ణ మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు కూడా జై షా నిలబడితే అదే పద్ధతి అవలంభించే అవకాశం ఉంది. 

 

బరిలో ముగ్గురు దిగ్గజాలు..?

అయితే జై షా ఐసీసీ ఛైర్మన్‌గా వెళ్తే బీసీసీఐ కార్యదర్శి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. జై షా రాజీనామా చేస్తే  ఆ శక్తివంతమైన పదవిని ఎవరు చేపడతారనే చర్చ జరుగుతోంది. అయితే జై షా స్థానంలో ముగ్గురు దిగ్గజ క్రీడాకారులు ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌, దిగ్గజ ఆటగాడు అనిల్‌ కుంబ్లే  ఈ పదవిని చేపడతారని అంటున్నారు. వీటిపైన ఎలాంటి స్పష్టత లేకపోయినా ప్రచారం మాత్రం బాగా జరుగుతోంది.

 

ముగ్గురిలో ఒకరు ఖాయమేనా..?

అన్ని సక్రమంగా కుదిరి బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షాఐసీసీ ఛైర్మన్‌ అయితే... తదుపరి బీసీసీఐ కార్యదర్శి ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. భారత్‌ క్రికెట్‌లో అత్యంత శక్తివంతమైని బీసీసీఐ సెక్రటరీ పదవి చేపట్టేందుకు వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag), ద్రవిడ్‌(Rahul Dravid) , కుంబ్లే(Anil Kumble)  పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేరు బీసీసీఐ సెక్రటరీ పొజిషన్‌కు వినిపిస్తోంది. వ్యాఖ్యతతో పాటు క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్న సెహ్వాగ్‌... బీసీసీఐ కార్యదర్శి అయితే యువ ఆటగాళ్లకు లక్కీ ఛాన్స్‌ లభించినట్లే. అలాగే ఇప్పటికే కోచ్‌లుగా... టీమిండియా కెప్టెన్లుగా భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన కుంబ్లే, ద్రావిడ్‌ కూడా ఈ పదవికి పోటీ పడుతున్నారన్న వార్త సంచలనం రేపుతోంది. ఒకవేళ ద్రావిడ్‌ ఈ పదవికి పోటీ పడితే అతడి వైపే మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు.