Spirituality:  భారతీయ హిందు సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు మొదలయ్యే శ్రీమంతం నుంచి  చనిపోయిన తర్వాత చేసే కర్మల వరకూ చేసే ప్రతి కార్యంలోనూ ఎన్నో నిగూఢమైన విషయాలు దాగి ఉన్నాయి. పెద్దలు చెప్పారు మేం పాటిస్తున్నాం అంటారుకానీ వాస్తవానికి అవెందుకు ఫాలో అవుతున్నామో , వాటి వెనుకున్న ఆంతర్యం ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిలో తలనీలాలివ్వడం ఒకటి. దేవుడికి మొక్కుకున్నాం గుండుచేయించుకున్నాం అని చెబుతారు కానీ ఇంతకీ మొక్కుకుంటే తలనీలాలు ఎందుకిస్తారు...ఎందుకివ్వాలి. 


Also Read:  మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!


తలనీలాలు అనగానే తిరుమల కళ్యాణ కట్ట గుర్తుకువస్తుంది. తిరుమల వెళ్లిన భక్తుల్లో దాదాపు 80శాతం భక్తులు తలనీలాలు ఇస్తారు. ఇలా ఇవ్వడం సంప్రదాయం అంటారు. చాలామంది పుట్టువెంట్రుకలు తిరుమలలోనే తీయిస్తారు. తిరుమల ఆలయంలో మాత్రమే కాదు చాలా ఆలయాల్లో కళ్యాణ కట్టలు ఏర్పాటు చేశారు. భక్తులు వారి వారి మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు. ఇంతకీ తలనీలాలు ఎందుకిస్తారంటే..శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తొలగించుకోవడం ద్వారా పాప ప్రక్షాళణ చేయించుకున్నవారు అవుతారని  పురాణాలు చెబుతున్నాయి.  గర్భంలో వున్న శిశువు తొమ్మిది నెలల తర్వాత భూమిపైకి వస్తాడు. ఆ శిశువికి ఉన్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసనలు అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే పుట్టువెంట్రులకు తీయడం (కేశ ఖండన) కార్యక్రమం నిర్వహిస్తారు. 


Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..


శిరోగతాని పాపాని
పాపాలను కలిగివున్నందునే శిరోజాలను 'శిరోగతాని పాపాని' అంటారు. భగవంతుడికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు కదా....ఓ రకంగా చెప్పాలంటే శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. ఈ విషయాన్ని వివరిస్తూ మహాభారతంలో ఓ కథ సంఘటన ఉంది. జయద్రధుడు( సైంధవుడు) ని సంహరించేందుకు సిద్ధమైన భీముడిని...ధర్మరాజు వారిస్తాడు.కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. వరుసకు పాండవులకు కూడా దుశ్శల సోదరి అవుతుంది. అందుతే అతడిని వధించడం ధర్మ సమ్మతం కాదంటాడు...అందుకే వెంట్రుకలు తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. 


పాప ప్రక్షాళన మాత్రే కాదు జ్ఞానార్జన
శిశువు పుట్టిన తర్వాత ఏడాది, మూడేళ్ల సమయంలో మొదటి సారిగా పుట్టు వెంట్రుకలు తీస్తారు. దీనికోసం మంచి ముహూర్తం చూసుకుని మరీ వెళతారు. ఎందుకంటే తల నీలాలు ఇవ్వడం వల్ల పాప ప్రక్షాళనకి మాత్రమే కాదు..జ్ఞాన సముపార్జనకి కూడా. అందుకే మంచి ముహూర్తం చూసుకుంటారు. 



  • సాధారణంగా పుట్టు వెంట్రుకలు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల వయసులో తీస్తారు

  • ఉత్తరాయణ పుణ్యకాలంలో కేశ ఖండన కార్యక్రమం జరిపించాలి

  • మగ పిల్లలకు సరిమాసంలో, ఆడపిల్లలకు బేసి మాసంలో తీయాలి

  • జన్మ నక్షత్రం ఆధారంగా తారాబలం, శుభలగ్నం, శుభ గ్రహ సంపత్తిని పరిగణలోకి తీసుకుని ముహూర్తం నిర్ణయించాలి

  • సోమ , బుధ, గురు, శుక్రవారాలలో మధ్యాహ్నం12లోపు కేశ ఖండన కార్యక్రమం జరిపించాలి

  • శుక్లపక్ష విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిధులు మంచివి

  • గురు, శుక్ర మూఢాల్లో ఈ కార్యక్రమం నిర్వహించరాదు