నెగెటివ్ ఎనర్జీ వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది జీవితంలో ఎలాంటి సుఖ సంతోషాలు లేకుండా చేస్తుంది. రోజు వారీ జీవితాలను ఇబ్బంది పెట్టె దరిద్రం వెంటాడతుంది. ప్రతి పనిలోనూ అపజయం ఎదురవుతుంది. అడుగేసిన ప్రతి దారి మూసుకుంటుంది. ఇలాంటి ప్రతికూల శక్తిని ఎదుర్కోవాలంటే తప్పకుండా దీన్ని నివారించే మార్గాలు తెలిసి ఉండాలి. ఇలాంటి మార్గాలన్నీ కూడా మన సనాతన జ్యోతిషం చర్చించింది. ఎన్నో వివరణలను, పరిహారాలను సూచించింది. వీటిని అనుసరించడం ద్వారా జీవితంలో ఇబ్బందులను అధిగమించడం సాధ్యం అవుతుంది. అంతేకాదు కొన్ని ప్రత్యేక పరిహారాలు మన జీవితంలో సంపదను పెంచుతాయి. ఆర్థిక స్థితి గతులు కూడా క్రమంగా మెరగవుతాయి.


నెగెటివిటిని గుర్తించాలి


ఏదో పని మొదలు పెట్టుకుంటాం. అవి పూర్తికాకుండా అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి పనులు పూర్తిగా చెడిపోతాయి కూడా. ఇంట్లోని వారు ఒకరు కాకపోతే ఒకరు అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతారు. ఆర్థిక సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇలాంటి స్థితులు కనిపిస్తున్నాయి అంటే తప్పకుండా మీ మీద ఏదో నెగెటివ్ ఎనర్జీ తన ప్రభావాన్ని చూపుతుందని అర్థం.


కర్పూర హారతి


హిందువులకు కర్పూరం చాలా పవిత్రమైంది. దీని ప్రాశస్త్యం గురించి వాస్తు, జ్యోతిషం వంటి సనాతన శాస్త్రాలలో కూడా వివరించారు. కర్పూరం రకరకాల పమస్యలను అధిగమించేందుకు దోహదం చేస్తుంది. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని అదిగమించేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూర హారతి వెలిగించాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లోని నెగెటివిటి దూరం అవుతుంది. ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది.


కర్పూర హారతి వెలిగించే ముందు కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించాలి. హారతి వెలిగించే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న చెత్త బయట పడెయ్యాలి. ఇల్లు ఊడ్చి, తుడిచి శుభ్రం చేసుకున్న తర్వాత హారతి చెయ్యాలి. కర్పూరాన్ని నేతిలో నానబెట్టి ఆ తర్వాత హారతిగా వెలిగిస్తే ఒక చక్కని సువాసన ఇల్లంతా నిండడమే కాదు, ఇంట్లోంచి నెగెటివిటిని తరిమి కొడుతుంది. అంతేకాదు నిద్రకు ఉపక్రమించే ముందు కర్పూరం దిండుకింద పెట్టుకోవడం ద్వారా కూడా నెగెటివిటిని ఎదుర్కోవచ్చు. అంతేకాదు సుఖ నిద్ర కూడా సాధ్యపడుతుంది.


మరో చిన్న పరిహారం ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. రాత్రి భోజనం ముగిసిన తర్వాత ఒక చిన్న వెండి గిన్నెలో లవంగాలు, కర్పూరాన్ని వేసి కాల్చాలి. ఇలా ప్రతి రోజూ చెయ్యడం వల్ల జీవితంలో ఐశ్వర్యం నిలిచి ఉంటుందని శాస్త్రం చెబుతోంది.


కర్పూరంతో చేసే పరిహారాలు పితృదోషం, కాలసర్ప దోషం వంటి వాటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. పితృదోషాలు అభివృద్దికి ఆటంకంగా మారుతుంది. దీన్ని నివారించేందుకు ఉదయం, సాయంత్రం, రాత్రి మూడు సార్లు కర్పూరం వెలిగించాలి. ఇలా రోజూ చేస్తుంటే త్వరలోనే జీవితంలో మార్పు రావడం గమనించవచ్చు.


నరదృష్టికి నాపరాళ్లు పగులుతాయని సామెత. దృష్టి దోషంతో బాధపడే వారికి ఏదో ఒక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. ఇలా దిష్టి తగిలిన వారికి చిన్న కర్పూరం ముక్క తీసుకుని  దాన్ని తలనుంచి పాదాల వరకు మూడు సార్లు సవ్య దిశలో తప్పి తర్వాత నేలపై ఉంచి వెలిగించాలి. ఇలా చేస్తే దిష్టి దోషం పోతుంది.


Also Read: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక