కాశీకి ఎందుకెళతారు….అక్కడ ఏం వదిలేయాలి?




ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా అన్నది భక్తుల విశ్వాసం. అందుకే హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం కాశీ. ఇక్కడ గంగానదిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య వున్నందున వారణాసి అనే పేరువచ్చిందని చెబుతారు. వారణాసి పేరును పాళీభాషలో బారణాసిగా రాసేవారు. ఆ తర్వాత బవారాస్ గా మారింది. ఈనగరాన్ని పురాణ ఇతిహాసాల్లో అవిముక్తక, ఆనందకానన, మహాస్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశి అనే పేర్లతో ప్రస్తారించారు.




వారణాశిలో మరణం సంభవిస్తే మోక్షం వస్తుందని భావిస్తారు. అందుకే ముక్తి స్థలం అంటారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి ఎన్నో భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీనగరం ప్రసక్తి ఉంది. అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని చెబుతారు. కాశీలో ప్రతిరోజూ సాయంత్రం హారతి, ప్రార్థనలు భక్తులను కట్టిపడేస్తాయి.




అయితే కాశీకి వెళ్తే ఏ కాయో..పండో వదిలేయాలని అంటారు.అందులో అసలు మర్మమేంటో తెలుసా? వాస్తవానికి కాశీలో కాయో-పండో వదిలేయాలని ఏ శాస్త్రము చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసీ తెలియని పరిజ్ఞానంతో అలా మార్చేశారు. ఇంతకీ శాస్త్రం ఏం చెప్పిందంటే…కాశీక్షేత్రం వెళ్లి గంగలో స్నానం చేసిన వారు కాయాపేక్ష, ఫలాపేక్షను గంగలోనే వదిలి విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాలని అంతరార్థం.




ఇక్కడ కాయాపేక్ష, ఫలాపేక్ష అంటే…. కాయం అంటే శరీరం….శరీరంపై ఆపేక్షని, ఫలం అంటే కర్మఫలం…. కర్మఫలముపై ఆపేక్షని పూర్తిగా వదిలేసి నిజమైన భక్తితో ఈశ్వర చింతన కలిగి ఉండాలని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా అది కాయ, పండుగా మారిపోయింది. అంతేకానీ కాశీకి వెళ్లి ఇష్టమైన కాయగూరలు, పండ్లు, ఆకులు గంగలో మునకేశాక వదిలేస్తే అందులో నిజమైన పుణ్యం ఏమీ ఉండదు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకుని ఆ క్షేత్ర దర్శనం, సంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది.




జామపండు, మామిడిపండు, పనసపండు కాశీలో వదిలేసినంత మాత్రాన వచ్చే ఫలితం ఏమీ ఉండదు. ప్రతి మనిషీ జీవిత చరమాంకంలో బంధాలు, రాగద్వేషాలు, తోటివారితో వివాదాలు వదిలిపెట్టి కాశీ యాత్ర చేయడజం వెనుక అసలు అంతరార్థం ఇదే. విశ్వనాథుడి దర్శానంతరం మృత్యువు దరిచేరేవరకూ మనసును ఆ పరమశివుడిపై లగ్నం చేయాలి.