Swarna Radhotsavam In Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారి కరుణా కటాక్షాలతో సర్వ శుభాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, వసంత రుతువులో మలయప్ప స్వామికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.


ఒంటిమిట్టలో కల్యాణానికి ఏర్పాట్లు


మరోవైపు, ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కానున్న కల్యాణం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందు తలెత్తకుండా ఇప్పటికే టీటీడీ, జిల్లా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనున్నారు. వేసవి దృష్ట్యా గ్యాలరీల్లో ఎయిర్ కూలర్లు, స్వామి వారి కల్యాణం వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ ముత్యాల తలంబ్రాలు, తిరుమల నుంచి తెప్పించిన చిన్న లడ్డూలు పంపిణీ చేయనున్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈసారి దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, అన్ని ఆలయాల్లో శ్రీరామనవమి రోజున స్వామి వారికి కల్యాణ వేడుక జరుగుతుంది. అయితే, ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున కల్యాణం నిర్వహిస్తారు.


రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం


అటు, తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 2023 - 24 ఏడాదికి గాను రూ.1,161 కోట్లు, 1,031 ​కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాజాగా టీటీడీ ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేసింది. గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం గణనీయంగా పెరుగుతూ వచ్చిందని వెల్లడించారు. తాజాగా రూ.1,161 కోట్లు, 1,031 ​కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్‌ చేయడంతో మొత్తంగా రూ.18 వేల కోట్లకు దేవస్థాన డిపాజిట్లు చేరుకున్నాయని అన్నారు. దీంతో, ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ రూ.1,200 కోట్లు దాటింది. కాగా, 2018 నాటికి ఏటా లభించే వడ్డీ రూ.750 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఐదేళ్ల  కాలంలో వడ్డీ దాదాపుగా రూ.500 కోట్లు ఎక్కువకు చేరుకుంది. మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.


Also Read: AP 10th Results 2024: ఏపీ టెన్త్ ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత - బాలికలదే హవా, ఫస్ట్ ప్లేస్ లో పార్వతీపురం మన్యం జిల్లా