మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానిది ఒక్కో ప్రత్యేకత. స్థలపురాణాలు, వెలసిన విగ్రహాలు, శిల్ప కళా నైపుణ్యం, అంతు పట్టని రహస్యాలు ఇలా ఎన్నో విషయాలు ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే వీటికి అతీతంగా కొన్ని ఆలయాల్లో మాత్రం తాంత్రిక పూజలు జరుగుతుంటాయి. స్వయంగా అఘోరాలు వచ్చి పూజలు చేసి వెళతారు. అలాంటి కొన్ని ఆలయాలు గురించి ఇక్కడ చూడండి.
కాలభైరవ ఆలయం
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న కాలభైరవుని ఆలయం అతి పురాతన ఆలయాల్లో  ఒకటి. ఈ స్వామి మద్యపాన ప్రియుడు. ఆలయం చుట్టుపక్కల స్వామి వారికోసమే మద్యం అమ్ముతుంటారు. సీసాలో ఉండే మద్యం స్వామి నోటి దగ్గర పెడితే చాలు శబ్దం చేస్తూ సీసా ఖాలీ అయిపోతుందట.  ఇది ఎంత వరకు వాస్తవం అనేది ఇప్పటికి అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.
వైద్యనాథ మందిరం
హిమాచాల్ ప్రదేశ్ లో ఉన్న వైద్యనాథ మందిరంలో శివయ్యకి  నిత్యం అఘోరాలు పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా శివలింగాన్ని అభిషేకం చేసిన నీటికి అతీత శక్తులు వస్తాయని భావిస్తారు.
Also Read:  దీపారాధనకు ఏ కుందులు వాడుతున్నారు... ఎందులో దీపం పెడితే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..
వైతల్ ఆలయం
ఒడిశా భువనేశ్వర్ లో ఉంది వైతల్ ఆలయం. ఇక్కడ కొలువైన చాముండీ దేవిని కాళీమాత ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. పుర్రెల దండ ధరించి దర్శనమిచ్చే చాముండీ దేవికి  నిత్యం అఘెరాలు తాంత్రిక పూజలు నిర్వహిస్తారు.
జ్వాలాముఖి దేవాలయం
హిమాచల్ ప్రదేశ్ కాంగడాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది జ్వాలాముఖి ఆలయం. 51 శక్తిపీఠాలలో ఈ జ్వాలాముఖి ఒకటి.  సతీదేవి నాలుక పడిన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. అమ్మవారు జ్వాలారూపంలో ఉండటం వల్ల జ్వాలాదేవి అనే పేరుతో పిలుస్తారు.  ఇక్కడ కొలువైన శివుడిని ఉన్నత భైరవుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ  పదేళ్లలోపు ఆడపిల్లలను దేవి స్వరూపంగా తలచి పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగి శత్రునాశనం జరుగుతుందని భక్తుల విశ్వాసం.
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
కాళికాదేవి ఆలయం
పశ్చిమ బెంగాల్ కోల్ కతాలో కాళీఘాట్ లో ఉంది శ్రీ కాళికాదేవి ఆలయం. ఈ అమ్మవారి కారణంగానే నగరానికి కోల్ కతా అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారిది పూర్తి విగ్రహం ఉండదు. సుమారు మూడు అడుగుల ఉన్న తల భాగం మాత్రమే ఉంటుంది.
ఏక లింగజి ఆలయం
రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉన్న ఏకలింగజి ఆలయంలో నాలుగు ముఖాలు గల శివుడి విగ్రహం దర్శనమిస్తుంది.  గర్భాలయానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలుండగా మధ్యలో నల్లని శివలింగం కనిపిస్తుంది. దీనికి కనిపించే నాలుగు ముఖాలు బ్రహ్మ, విష్ణు, ,మహేశ్వర, సూర్య అనే  పేర్లతో పిలుస్తారు. 
కామాఖ్యాదేవి ఆలయం
శక్తిపీఠాల్లో ఒకటైన ఈ కామాఖ్య దేవాలయం తాంత్రి విధి విధానాలకు చాలా ప్రాచుర్యం చెందింది. ఇక్కడ సతీదేవి యోని పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారికి రుతుస్రావం జరుగుతుందని నమ్ముతారు.
ఖజురహో దేవాలయం
మధ్యప్రదేశ్ లోని ఖజురహో దేవాలయం శిల్పకళలకే కాదు తాంత్రిక విద్యలకు ప్రాచుర్యం చెందింది. అందువల్లే ఇక్కడికి తాంత్రిక విద్యను అభ్యసించేవారు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
ముంబాదేవి మందిరం
మంత్ర, తంత్ర శక్తులను నేర్పించే దేవాలయాల్లో ముంబైలోని ముంబాదేవి దేవాలయం ముందు ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి 8 చేతులు ఉంటాయి. నిత్యం అఘోరాలు వచ్చి పూజలు చేస్తుంటారిక్కడ.