Significance And Importance Of Irumudi: రోజూ రెండు పూటలా చన్నీళ్లతో స్నానం..నేలపైనే నిద్ర..మాట జారకుండా అయ్యప్ప నామ స్మరణ..శత్రువులో కూడా స్వామిని చూసే గుణం..మండల దీక్షతో మనసుని పునీతం చేసుకునే క్రతువు.. 41 రోజులు అత్యంత నియమ నిష్టలతో కొనసాగించే ఆధ్యాత్మిక సాధన అయ్యప్ప మండల దీక్ష. కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్పదీక్షల కోలాహలం కనిపిస్తుంది. దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకుని అయ్యప్పను దర్శించుకుని వచ్చాక దీక్ష విరిమిస్తారు


అయ్యప్ప దీక్ష ధరించిన వాళ్లు నల్లని దుస్తులు ధరిస్తారు. అన్నిటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుంది. నలుపు తమో గుణానికి ప్రతీక. తనలోని తమో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగిన దీక్షధారుడి హృదయం పరమాత్మలో విలీనం అవుతుంది. అయ్యప్ప పూజలో ప్రధానాంశం ‘శరణుఘోష’. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి సత్వర ఫలితాన్నిస్తుందని చెబుతారు. శరణాగతి వేడిన భక్తుల బాగోగులు స్వయంగా దేవుడే చూసుకుంటాడని విశ్వాసం.


Also Read: మార్గశిర గురువారం లక్ష్మీపూజ ప్రత్యేకం, అష్ట లక్ష్మీ రూపాల వెనుకున్న ఆంతర్యం ఇదే!


ఇరుముడి వెనుకున్న ఆంతర్యం
మండల దీక్ష పూర్తైన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకుని బయల్దేరుతారు స్వాములు. ఇరుముడి అంటే రెండు ముడులు కలది అని అర్థం. ఆ రెండూ భక్తి, శ్రద్ధకు ప్రతీక. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులో ఆంతర్యం. ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులోని ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. అయ్యప్పను కన్నులారా దర్శించుకుని పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి చేరుకుంటారు.


Also Read: నిలదీస్తే జటాయువు స్థితి - మిన్నకుంటే భీష్ముడి పరిస్థితి తప్పదు!


18 మెట్లపై ఏం వదిలేయాలంటే 
ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు.  
మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలి
తర్వాతి  8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దర్పాన్ని  విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్లాలని సూచిస్తాయి.
ఆ తర్వాత 3 మెట్లు సత్వం, తామసం, రాజసానికి సూచన
చివరి రెండు మెట్లు విద్య- అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.


దీక్ష విరమించిన వెంటనే మళ్లీ పాత అలవాట్లకు లోబడితే ఆ దీక్ష ధారణకు అర్థం -సార్థకం లేనట్టే. మాల విరమించినా నిమమాలు లేకున్నా..వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో వచ్చిన మార్పులు కొనసాగించినప్పుడే మండల దీక్ష చేపట్టినందుకు సార్థకత...


స్వామియే శరణం అయ్యప్ప