Ratha Saptami 2024 Date And Puja Vidhi:  భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు.  హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి రోజు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదని చెబుతారు. ఆదిత్యుడితి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజు ఏఏ నియమాలు పాటించాలో ఇక్కడ తెలుసుకోండి...


సూర్యోదయానికి ముందే స్నానం


సూర్యుడిని ఆరోగ్యప్రదాత అంటారు. రథసప్తమి రోజున ప్రాతఃకాల సమయంలో గంగలో స్నానాలు, సూర్యోపాసనల వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం. ఈ రోజు నదీ తీరంలో స్నానం ఆచరించాలి. తలమీద 7 జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను ఉంచుకుని స్నానం చేయాలని చెబుతారు పండితులు.  జిల్లేడు ఆకుని అర్కపత్రం అంటారు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం , ఏడు జన్మల్లో చేసిన పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశింపజేస్తాయంటారు.


Also Read: మనిషి లోపలున్న చీకటిని కూడా తొలిగించే సూర్య భగవానుడు!


నదిలో దీపం విడిచిపెట్టండి


నదులు, కోనేరు దగ్గర స్నాన మాచరించిన వారు నదీ తీరంలో నేయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి..నీటిలో వదలండి. రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. 


సూర్య కిరణాల కాంతిలో పాలు పొంగించండి


రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట దగ్గర ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు. పొంగిన పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.


Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!


ఎరుపు రంగు పూలతో పూజ


రథసప్తమి రోజు సూర్యుడిని  ఎరుపు రంగు పూలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. రథసప్తమి రోజు బంగారం, వెండి లేదా రాగితో సూర్యుడికి చిన్న  రథం చేయించి అందులో ఎర్రరంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించి ఆ రథాన్ని పండితులకు దానం ఇస్తే మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. రథ సప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాథనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారు


నోముల ఆరంభానికి మంచి రోజు


ముత్తైదువులు నోములకు ఈ రోజు అంకురార్పణ చేస్తారు. చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోములను ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ రోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా విజయవంతగా పూర్తి అవుతుందని నమ్మకం. 


మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథిని ‘రథ సప్తమి’గా జరుపుకుంటారు. 2024 ఫిబ్రవరి 16 రథసప్తమి వచ్చింది. సూర్యరథం దక్షిణాయనం ముగించి ఉత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.  అదితి, కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించిన రోజు ఇది..అందుకే సూర్య జయంతి, రథ సప్తమిగా పూజలందిస్తారు.