Ramadan 2025 Start Date : సాధారణంగా నెలవంక మొదటగా గల్ఫ్ దేశాల్లో కనిపిస్తుంది...ఒక రోజు తర్వాత దక్షిణాసియా దేశాల్లో కనిపిస్తుంది.  ఈ ఏడాది సౌదీ అరేబియాలో  ఫిబ్రవరి 28 శుక్రవారం సాయంత్రం నెలవంక దర్శనం ఇవ్వనుంది. దీంతో మార్చి 1వ తేదీ శనివారం.. భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో  చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీలో మొదలైన తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ఆరంభమవుతాయి. అంటే మార్చి 01 శనివారం సాయంత్రం నెలవంక కనిపిస్తే మార్చి 02 ఆదివారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.  


నెల రోజులు ముస్లింలకు ఎందుకంత ప్రత్యేకం అంటే దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించింది. 


ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో  సాగుతుంది. 


మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం ..మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు భగవంతుడు ఈ మాసాన్ని సృష్టించాడని విశ్వాసం.


Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!
 
రంజాన్ మాసంలో నెల రోజుల పాటూ చేసే కఠిన ఉపవాస దీక్షలతో శరీరం, మనసులోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని విశ్వసిస్తారు. సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే 'ఇప్తార్‌' వరకు నీళ్లు కూడా ముట్టుకోరు. 


ఈ నెలలో ఎవరైనా మరణిస్తే నేరుగా స్వర్గానికే చేరుకుంటారని ముస్లింల ప్రగాఢ విశ్వాసం
  
రంజాన్ ఉపవాస దీక్షలకు వయసుతో పనిలేదు.  ఈ దీక్షలతో బలహీనతలను, వ్యసనాలను జయించవచ్చని మత గురువులు బోధిస్తారు. సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి..ముందుగా ఖర్జూరపు పండు తిని దీక్ష విరమిస్తారు. ఆ తర్వాత రుచికరమైన వంటకాలు భుజిస్తారు. వీటిలో ప్రత్యేకమైన వంటకం హలీమ్
 
ఈ నెల రోజులు పెట్టుకునే ‘సుర్మా'తో కళ్లకు కొత్త అందం వస్తుంది. ప్రవక్త హజరత్‌ మహ్మద్‌ నిత్యం సుర్మా పెట్టుకునేవారని చెబుతారు. పౌడర్‌ రూపంలో ఉండే సుర్మాను భరిణెల్లో దాచుకుని వాళ్లు మాత్రమే కాదు..ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఇస్తారు. నమాజు చేసేముందు ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు..ఇది కేవలం సంప్రదాయం మాత్రమే అనుకోవద్దు..కళ్లకు ఆరోగ్యం కూడా.  
 
ప్రతి  శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేస్తుంటారు కదా ఇక రంజాన్ లో చేసే నమాజ్ లకు ఎందుకంత ప్రత్యేకం అంటే ఈ సమయంలో మత పెద్దలతో నమాజ్ చేయిస్తారు. మసీదుకి వెళ్లేలని వారు ఇంటి దగ్గర స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థనలు చేస్తారు. నమాజ్ పూర్తైన తర్వాత  పిల్లలు, పెద్దలు అంతా స్నేహభావంతో  'అలయ్ బలయ్ ' చెప్పుకుంటారు. పండుగ రోజు షీర్‌ ఖుర్మా  అనే వంటాకాన్ని అంతా పంచుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు .


Also Read: కేదార్ నాథ్ ఆలయం తెరిచే డేట్ ఇదే .. శివరాత్రి సందర్భంగా ప్రకటించిన బద్రీనాథ్ - కేదార్నాథ్ బోర్డ్


ఖురాన్ సిద్దాంతాల ప్రకారం ...ప్రతి మనిషి తమ సంపాదనలో ఎంతోకొంత పేదలకు దానం చేయాలి. అందుకే ఈ నెలలో పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం  ఎవరి స్థోమతుకు తగ్గట్టు వాళ్లు దాన ధర్మాలు చేయాలని ఖురాన్ చెబుతోంది. నిరుపేదలు కూడా సంతోషంగా ఉండాలన్నదే ఈ దానాల వెనుకున్న ఆంతర్యం అని మతపెద్దలు చెబుతారు.