Durga Amma Seva:  శ్రీవారి సేవ మాదిరిగా దుర్గమ్మ సేవ చేసుకునే అవకాశం భక్తులకు కల్పించనున్నారు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం అధికారులు.ఇందుకు  సంబంధించి కొత్తగా సేవావిభాగం ఏర్పాటు చేయనున్నారు. అన్ని విభాగాల్లానే ఈ సేవా విభాగం కూడా శాశ్వతంగా పనిచేస్తుంది. దీనికి కూడా ఓ EO, సూపరింటెండెంట్, ఓ గుమస్తా ఉంటారు. ఇప్పటివరకూ సేవకు సంబంధించి ఎలాంటి విభాగం లేదు..  సేవకుల పేర్లను రిజిస్టర్‌ చేసుకునే పనిని విధుల్లో ఉండే ఇతర సిబ్బందికి అప్పగించేవారు. ఇకపై సేవకుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.

దుర్గమ్మ సేవకు వచ్చేవారికి వన్‌టౌన్‌లో ఉన్న సీవీరెడ్డి సత్రంలో బస, ఆలయంలో భోజనం ఏర్పాటు చేస్తారు. దేవస్థాన వాహనాల్లో వారిని తీసుకెళ్లి సేవ చేయాల్సిన ప్రదేశాల్లో విడిచిపెడతారు. మళ్లీ బస చేసే కేంద్రం వద్దకు కూడా దేవస్థాన వాహనాలే దింపుతాయి. సేవ పూర్తైన తర్వాత అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదం , ఆశీర్వచనం ఇప్పించి పంపిస్తారు.   దుర్గమ్మ సన్నిధి మాత్రమే కాదు దానికి అనుబందంగా ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ సేవకుల సేవలు వినియోగించుకోనున్నారు. రోజుకి 200 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీనివాసుడి సేవ చేయాలి అనుకునే భక్తులు ఆన్ లైన్లో బుక్ చేసుకోవాలి. ఖాళీగా ఉన్న తేదీలను చూసి బుక్ చేసుకుంటే..అక్కడకు వెళ్లిన తర్వాత శ్రీవారి సేవావిభాగం పనులు కేటాయిస్తుంది. ఇప్పుడు ఇదే పద్ధతి ఇంద్రకీలాద్రిపైనా అవలంభించనున్నారు. అమ్మవారి సేవ చేయాలి అనుకున్న వారు దేవస్థాన అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

ప్రస్తుతం సేవకులను అన్నదాన విభాగం, క్యూలైన్ల వద్ద మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ ఇకపై సేవకులను ఆలయానికి సంబంధించిన అన్ని కేంద్రాల్లోనూ సహకరించేలా ప్రమాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతరాలయం ముందు, లోపల ప్రస్తుతం మహిళా సెక్యూరిటీగార్డులు ఉంటున్నారు. రద్దీ ఉన్నప్పుడు తప్పదు కానీ రద్దీ లేనప్పుడు కూడా సరిగా దర్శనం చేసుకోనివ్వడం లేదనే ఆరోపణలున్నాయి. అందుకే ఆ ప్రదేశంలో సేవకులను పెట్టాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

అంతరాలయంతో పాటూ ముఖద్వార దర్శనం, ఉచిత క్యూలైన్లు, 100 రూపాయల క్యూలైన్ల వద్ద కూడా సెక్యూరిటీ గార్డులను తొలగించి ఆ స్థానంలో సేవకులను నియమించనున్నారు. ఇంకా అన్నదానం, క్యూలైన్ల ప్రవేశ మార్గం, ప్రసాదం కౌంటర్లు, సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ పాయింట్లు, లగేజీలు భద్రపరిచే కౌంటర్‌, చెప్పుల స్టాండ్‌ వద్ద కూడా సేవకులను నియమిస్తారు. పార్కింగ్ దగ్గర సెక్యూరిటీ గార్డులుగా కూడా సేవకులే ఉండబోతున్నారు. ఆర్జిత సేవల వద్ద కూడా సేవకులే సేవలే వినియోగించుకోనున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను కొండపైకి తీసుకెళ్లేందుకు  రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌, దుర్గాఘాట్‌ నుంచి బస్సులు నడుపుతున్నారు. ఈ ప్రదేశాల్లో బస్ ఎక్కేటప్పుడు భక్తులు రద్దీ ఎక్కువై తోపులాటలు జరుగుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు గాయపడిన సందర్భాలున్నాయి. అందుకే ఈ ప్రదేశాల్లో సేవకులను నియమిస్తే క్యూలైన్లలో ప్రయాణికులు బస్ ఎక్కే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి