Kedareshwar Cave Mandir Maharashtra: ప్రపంచం అంతమయ్యే సమయంలో ప్రకృతి కొన్ని సంకేతాలిస్తుంది. ఆ సంకేతాల గురించి పురాణాల్లో చాలా చాలా చెప్పుకొచ్చారు. పురాణాల ప్రకారం నాలుగు యుగాలున్నాయి.. అవే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలోనే... ఈ యుగాంతంలో సృష్టి మొత్తం అంతమైపోతుందని పురాణాల్లో ఉంది. కలియుగం గురించి, కలియుగాంతం గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన గ్రంథంలోనూ ప్రస్తావించారు. వీటన్నటి తోపాటూ కళ్లముందు కనిపించే మరో సంకేతమే మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లా హరిశ్చంద్రకోటలో ఉన్న శివాలయం. లయకారుడైన శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా...అలా కొండమీదున్న కేదారేశ్వర్ గుహాలయం యుగాంతంతో ముడిపడి ఉందని చెబుతారు.   


Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!


4 స్తంభాలే 4 యుగాలు


కొండమీదున్న ఈ శివాలయంలో 5 అడుగుల శివలింగం ఉంటుంది. దానిపైనున్న రాయి కిందకు జారకుండా ఆపుతూ నాలుగు స్తంభాలుంటాయి. ఈ స్తంభాలే యుగాంతం ఎప్పుడో చెప్పేస్తాయంటారు. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకు ప్రతీకగా చెబుతారు. ఇప్పటికే మూడు యుగాలు పూర్తయ్యాయి అనేందుకు గుర్తుగా యుగానికొకటి చొప్పున మూడు స్తంభాలు ఒక్కొక్కటిగా విరిగిపోయాయి. ఇక కేవలం ఒక్క స్తంభం మాత్రమే మిగిలింది...ఇది కలియుగానికి ప్రతీక. ఇది విరిగినప్పుడు కలియుగాంతమే అని అక్కడి పండితులు వివరిస్తున్నారు.  


కృత యుగం నుంచి ఉన్న శివాలయం


ఈ శివాలయాన్ని మొదటి యుగం అయిన కృతయుగంలోనే నిర్మించారని కొందరంటే...హరిశ్చంద్రకోటను మొదటిసారి నిర్మించి పరిపాలించిన కాలచూరి అనే వంశం వారు 4వ శతాబ్దంలో నిర్మించారని మరికొందరు అంటారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి సరైన సమాచారం మాత్రం ఎవ్వరికీ తెలియదు.  ఈ ఆలయంలో ఉన్న మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ శివలింగం నీటితో నిండి ఉంటుంది...ఆలయ గోడల నుంచి నీరు ఉబికివస్తుంటుందని చెబుతారు. మరో వింత ఏంటంటే ఎక్కడైనా వానాకాలంలో వరద ముంచెత్తుతుంది కానీ...ఈ శివాలయంలో వానాకాలంలో చుక్కనీరు కూడా కనిపించదట. ఇదెలా జరుగుతోందనేది ఇప్పటికీ మిస్టరీనే అయితే..ఒకే ఒక స్తంభం అంత పెద్ద బండరాయిని కిందపడకుండా ఎలా ఆపుతోందనేది మరో మిస్టరీ..అందుకే మూడు స్తంభాలు పడిపోయి ఒక్కటే మిగిలి ఉండడం వల్ల ఇది కలియుగానికి ప్రతీకగా భావిస్తున్నారు.


Also Read: అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? ‘కల్కి 2898 ఏడీ’ లో అమితాబ్ నుదుట కనిపించిన అద్భుతమైన మణి గురించి తెలుసా!
 
కొండ మీదకి చేరుకోవటానికి ఆరేడు మార్గాలున్నాయి..వాటిలో  ప్రసిద్ధి చెందిన రూట్లు ఖిరేశ్వర్ , బెల్పడ ,కొథలె ,బలెకిల్ల గ్రామాలు. ఈ గ్రామాల మీదుగా ఆలయానిక చేరుకునేందుకు బస్సులుంటాయి. హరిశ్చంద్రగడ్ కోట ఆవరణలో  విష్ణు దేవాలయం , ఆ సమీపంలో పురాతన బౌద్ధ గుహలు  మధ్య యుగ కాలానికి చెందిన నాగేశ్వర్ ఆలయం, హరిశ్చంద్రేశ్వర్ ఆలయం, సప్త తీర్థపుష్కరిణి కూడా చూడొచ్చు. వసతి సౌకర్యాల విషయానికొస్తే కొండ మీద ఉన్న గుహాల్లో ఉన్న వినాయకుడి ఆలయంలో 50 మందికి వసతి సదుపాయం ఉంటుంది. స్థానికంగా బస చేయాలంటే అక్కడ పాఠశాలల్లో ఉండాల్సిందే. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు... ఆహారం కూడా స్థానికులు గుహల వద్ద అమ్ముతుంటారు. వర్షాకాలంలో వెళితే మాత్రం స్వయంగా మీ వంట మీరు చేసుకోవాల్సిందే. ఓవరాల్ గా యుగాంతానికి ముడిపడి ఉన్న ఈ ఆలయాన్ని చేరుకునేందుకు సాహసయాత్ర చేయాల్సిందే....