Maha Shivaratri 2023: అమ్మవారు అయ్యవారిని క్వశ్చన్ చేయడం ఏంటి..పోనీ ఎవ్వరూ లేని సమయం చూసి ఏకాంతంగా మాట్లాడిందా అంటే అదీ కాదు..నిండు కొలువులో అందరి మధ్యా అడిగేసింది. భోళాశంకరుడు కూడా  ఏమాత్రం కోపగించుకోకుండా పార్వతీదేవి సందేహాలన్నీ తీర్చాడు. ఏ సందర్భంలో పార్వతీ దేవి పరమేశ్వరుడిని ప్రశ్నించింది.. ఆ సందేహాలు వాటికి సమాధానాలు చూద్దాం..


కైలాశంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు,భూతగణాలతో నిండి  ఉన్న  కొలవులో భోళాశంకరుడు కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి భర్త కళ్లు మూసింది. అంతే..లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులన్నీ అల్లాడిపోవడం చూసి శంకరుడు మూడో కన్ను తెరిచాడు. ఇంకేముంది హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన గౌరీదేవి ...'స్వామీ మూడోకన్ను తెరిచారేమి'  ఆ కారణంగా నా తండ్రి హిమవంతుడికి బాధ కలిగిందని వేడుకుంది. నీకు చెప్పకూడని రహస్యాలు నా దగ్గర లేవు, సర్వలోకాలు నన్ను పట్టి ఉంటాయి, నువ్వు నా రెండు కళ్లూ మూసేస్తే లోకం చీకటిమయం అయింది. అందుకు మూడోకన్ను తెరవాల్సి వచ్చిందన్నాడు శంకరుడు. అంత ప్రశాంతంగా స్పందించిన భర్తని చూసి..తనలో ఉన్న సందేహాలు తీర్చుకునేందుకు ఇదే మంచి సమయం అని భావించింది. ఇంకేముంది ప్రశ్నలు సంధించింది. 


Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!


పార్వతి: స్వామీ మీ కంఠంపై నల్లటి మచ్చ ఎందుకుంది?
శివుడు: దేవతలు, దానవులు కలిసి పాలసముద్రం మధించినపుడు వచ్చిన హలాహలాన్ని మింగి అక్కడ ఉంచాను. అందుకు అక్కడ మచ్చ కనిపిస్తుంది. 


పార్వతి: పినాకమనే విల్లునే ఎందుకు ధరిస్తారు? 
శివుడు: కణ్వుడనే మహాముని ఆదియుగంలో తపస్సు చేశాడు. ఆయనపై పుట్టలు మొలిచాయి. ఆ పుట్టమీద ఒక వెదురుపొద మొలిచింది. అద్భుతంగా పెరిగిన ఆ వెదురు నుంచి బ్రహ్మ మూడు విల్లులు తయారు చేశాడు. అందులో ఒకటి పినాకము( నా దగ్గర ఉంది), రెండోది శారంగం( విష్ణువు దగ్గరుంది), మూడోది బ్రహ్మదగ్గరుంది. పినాకం నా చేతిలో ఉన్నప్పటి నుంచి పినాకపాణిగా మారాను
 
పార్వతి: మరే వాహనం లేనట్టు ఎద్దును వాహనంగా చేసుకున్నారెందుకు స్వామి?
శివుడు: ఓసారి తపస్సు చేసుకుంటున్నప్పుడు చుట్టూ చేరిన గోవులు కారణంగా నా తపస్సుకి భంగం కలిగింది. కోపంగా చూడడంతో అవి పడిన బాధను చూసిన శ్రీ మహావిష్ణువు..శాంతింపచేసి ఓ ఎద్దుని కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఎద్దు వాహనమైనంది. 


పార్వతి: కైలాశంలో ఉండకుండా శ్మశానంలో ఉంటారేంటి స్వామి?
శివుడు: భయంకరమైన భూతాలు ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మ నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉన్నంతవరకూ లోకాలు సురక్షితంగా ఉంటాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం, జనం తిరగని స్థలం, అందుకే ఇక్కడ నుంచి లోకాలను రక్షించాలనుకున్నా.


పార్వతి: భస్మ  లేపనం, పాములు ధరించడం, శూలం, ఈ భీకరమైన రూపం ఎందుకు స్వామి?
శివుడు: లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి శీతం (చలి), రెండవది ఉష్ణం (వేడి). సౌమ్యం విష్ణువు, అగ్ని నేను అందుకే భస్మం సహా ఈ భీకర రూపం.


Also Read: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!


పార్వతి: తలపై నెలవంక ఎందుకు?
శివుడు: దక్షయజ్ఞ సమయంలో నేను దేవతలని బాధించాను, ఆ సమయంలో చంద్రుడిని కాలితో తొక్కగా..శరణు వేడాడు. పొరపాటు చేశానని అర్థమై చంద్రుడిని తలపై పెట్టుకున్నాను...


ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగింది పార్వతీదేవి..అయినా లోకమాతకు ఈ సమధానాలు తెలియవా..ఆమెకు అర్థనారీశ్వరుడిపై సందేహాలు ఎందుకుంటాయి..సకల జీవులకు తన భక్త గొప్పతనం తెలియజెప్పేందుకే నిండుసభలో ఈ ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించింది లోకమాత..


ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం 
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా  శివోమే అస్తు సదా శివోం