శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు 
రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, సుదంత, భద్ర, లక్ష్మణ. వీరిలో ఎవర్ని ఏం సందర్భంలో పెళ్లిచేసుకున్నాడంటే..


రుక్మిణి 
ఈమె విదర్భ రాజు భీష్మకుని కుమార్తె. కృష్ణుడు తన భర్తగా రావాలని చిన్నప్పటి నుంచీ కోరుకుంది. ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి అస్సలు ఇష్టం లేదు. రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు. శిశుపాలుడు, జరాసంధుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు కావడంతో రుక్మిణి ఇష్టాన్ని వ్యతిరేకించాడు సోదరుడు రుక్మి. తన బలవంతంగా వివాహం చేస్తున్నాడంటూ రుక్మిణి సందేశం పంపుతుంది. కృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి విదర్భ చేరుకుని ఆమెని అక్కడ నుంచి ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. రుక్మిణి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ అవతారం. అందుకే ఆమె అంటే కన్నయ్యకి వల్లమాలిన అభిమానం. 


Also Read:  స్వర్గానికి షార్ట్ కట్! ధర్మరాజు తమ్ముళ్లు కుక్కతో కలసి వెళ్లిన రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!


జాంబవతి-సత్యభామ
ద్వారక కోశాధికారి సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి రోజుకు వేయి బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణిని వరంగా పొందాడు. శమంతకమణిని ఒకసారి తనకు ఇవ్వమని కృష్ణుడు అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు నిరాకరిస్తాడు. అతని సోదరుడు ప్రసేనుడు దీన్ని ధరించి వేటకు వెళతాడు. అడవిలో వేటకు వెళ్లిన ప్రసేనుడిని ఓ సింహం దాడి చేసి హతమార్చుతుంది. అదే సమయంలో జాంబవంతుడు సింహాంతో పోరాడి శమంతకమణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు. కృష్ణుడే తన సోదరుడిని సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రాజిత్తు ఆరోపిస్తాడు. తనపై వచ్చిన నిందను తొలగించుకోడానికి కృష్ణుడు ఆ మణిని వెదుకుతూ అడవికి వెళ్లి జాంబవంతుడితో 28 రోజులు భీకర యుద్ధం చేస్తాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీమన్నారాయణుడిగా గుర్తించిన జాంబవంతుడు మణితోపాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు.


శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు అప్పగించడంతో ఆయన తన తప్పును తెలుసుకుని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య. ఈమె గొప్ప విష్ణు భక్తురాలు. అమె అందానికి మోహితుడైన మైరావణుడు తన స్థావరంలో బంధిస్తాడు. త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావణుడి రాజ్యంలో బంధీగా ఉన్న ఆమెను విడిపిస్తాడు. పెళ్లిచేసుకోమని కోరిన చంద్రకాంతకు ఈ జన్మకు ఏకపత్నీవ్రతుడిని, వచ్చే జన్మలో పెళ్లిచేసుకుంటానని మాట ఇస్తాడు. ఆమె ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది. పురాణాల ప్రకారం సత్యభామను భూదేవి అంశంగా చెబుతారు. నరకాసుర సంహారంలోనూ సత్యభామ పాత్ర కీలకం. 


మిత్రవింద
మిత్రవింద అనగానే రామ్ చరణ్-రాజమౌళి మగధీర హీరోయిన్ మిత్రవింద గుర్తుకు వస్తుందేమో కానీ...కృష్ణుడి ఎనిమిది మంది భార్యలో మిత్రవింద ఒకరు.  కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు. వాళ్ళపేర్లు పృథ (కుంతి), శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాథిదేవి. పృథని శూరసేనుని బంధువు కుంతిభోజుడు దత్తత చేసుకోవడం వలన కుంతి  అంటారు.వీరిలో రాజాథిదేవి అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య. ఈవిడ కొడుకులు విందానువిందులు, కూతురు మిత్రవింద. విందానువిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడతారు. చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్ళిచేసుకుంటుంది. 


భద్ర
మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె భద్ర. శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలో మిత్రవింద, భద్ర మేనత్త పిల్లలు. 


Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 


సుదంత
అసలు పేరుసుదంత.  కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె. రాజ్యంలో ఏడు ఎద్దులు అల్లకల్లోలం సృష్టిస్తాయి.వీటిని ఎవ్వరూ బంధించలేకపోతారు. వీటిని అదుపుచేసిన వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు నగ్నజిత్తు. ఆ ప్రకటన తర్వాత కృష్ణుడు ఆ ఎద్దులను వధించడంతో సుదంతను ఇచ్చి వివాహం చేశాడు నగ్నజిత్తు. 


కాళింది
కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే కామవాంఛతో కృష్ణుడిని చూసింది కాళింది. గమనించిన అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆవిడ మనోగతాన్ని కృష్ణుడికి చెప్పి పెళ్లిచేసుకునేలా చేశాడు. 


లక్షణ
మద్రదేశ రాకుమారి,  బ్రుహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ. నారదుడి ద్వారా శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం గురించి విని తననే పెళ్లిచేసుకుంటాని పట్టుబట్టింది. ఈ సందర్భంగా తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో  కృష్ణుడిని మనువాడింది.