హనుమాన్ చాలీసా... ఎంతటి కష్టాన్నైనా దూరం చేసే అద్భుతమైన స్తోత్రం ఇది. మొత్తం 40 శ్లోకాలుగా ఇది ఉంటుంది. సాధారణంగా వీటిని దోహాలు అంటారు. 40 ఉన్నాయి కనుక దీన్ని చాలీసా అంటారు. ప్రతీరోజు చాలామంది నిత్యపూజలో భాగంగా ఈ హనుమాన్ చాలీసా చదువుతూనే ఉంటారు. దీన్ని రాసింది గోస్వామి తులసీ దాస్. రామచరిత మానస్ గ్రంథాన్ని రాసిన తర్వాత తులసీ దాస్ కు హనుమన్ సాక్షాత్కారం అయిందట. ఆ సమయంలో హనుమంతుడి వైభవాన్ని వర్ణిస్తూ తులసీదాస్ రాసిన స్తోత్రమే హనుమాన్ చాలీసా. అయితే హనుమాన్ చాలీసాలో చాలా గొప్పదనం దాగి ఉంది. ఇది రాసి దాదాపు 500 సంవత్సరాలు గడిచింది. అయినప్పటకీ ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణం నిరంతరం జరుగుతూనే ఉంది.


శాస్త్రజ్ఞులు సూర్యుడికి భూమికి మధ్య దూరాన్ని 17వ శతాబ్దంలో కనుగొన్నారు. కానీ తులసీదాస్ ఈ విషయాన్ని చాలీసాలో 15 శతాబ్దంలోనే రాశారు. యుగ సహస్ర యోజన పరభాను.. లీల్యోతాహి మధుర ఫలజాన... అనే ఫంక్తులు హనుమాన్ చాలీసా చదివే ప్రతి ఒక్కరికీ తెలుసు. దాన్ని అనుసరించి భాను అంటే సూర్యుడు, యుగసహస్ర అనేది దూరాన్ని తెలియజేస్తుంది, లీల్యోతాహి మధుర ఫల జాను అంటే బాల్యంలో సూర్యుడిని పండు అనుకున్న బాల హనుమంతుడి లీలను గురించి తెలియచేస్తుంది. అందులోనూ ఇక్కడ భూమికి, సూర్యుడికి గల దూరాన్ని యుగ సహస్ర యోజన అని వర్ణించారు తులసీదాస్. యుగ అంటే పన్నెండు వేల సంవత్సరాలు, సహస్ర అంటే వేయి, యోజనం అంటే ఎనిమిది మైళ్లు, యుగ సహస్ర యోజనం అంటే వీటన్నింటినీ గుణిస్తే 96000000 మైళ్లు. దీన్ని కిలోమీటర్లలోకి మారిస్తే 153600000. ఇది భూమికీ సూర్యుడికి మధ్య గల దూరం.


రామాయణం రాసిన వాల్మీకినే తులసీదాస్


తులసీదాస్ మరెవరో కాదు రామామృతాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షినే తులసీదాస్ అని భక్తుల నమ్మకం. అందుకు తగినట్లుగా వాల్మీకి, తులసీదాస్ కు ఒక పోలిక కూడా ఉంది. వాల్మీకి సంస్కృతంలో రాసిన రామాయణాన్ని తిరిగి స్థానిక భాషలో రామచరిత మానస్ అన్న పేరుతో రచించాడు. దానివల్ల మరింత మంది రామకథను గానంచేసే అవకాశం లభించింది. ఆయన జన్మించింది పండరీపురంలో అయినా జీవనాన్ని కొనసాగించింది వారణాసిలో. అక్కడే అతనికి హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రదేశం ఇఫ్పటికీ ఉంది. అక్కడ ఉన్న సంకటమోచన హనుమాన్ గుడిని నిర్మించింది తులసీదాస్. తులసీదాస్ రామచరిత మానస్ రచించిన ప్రదేశం కూడా ఇప్పుడు మనం కాశీలో చూడవచ్చు.


హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. భయం తొలుగుతుంది. మీలో మీకు తెలియకుండానే ఒక పాజిటివీ ఏర్పడుతుంది. కీర్తిప్రతిష్టతలు కలుగుతాయి. దుష్టశక్తుల భయం తొలగిపోతుంది. ఉద్యోగానికి సంబంధించిన ఏవైనా సమస్యలున్నా తొలిగిపోతాయి. దీన్ని పటిస్తే ఈ పనికాదు అనుకున్న పని సులభంగా నెరవేరుతుంది. ఆంజనేయ తత్వాన్ని అర్థం చేసుకుని రాముడికి దగ్గరగా చేస్తాయి. పరమాత్ముడి వైభవాన్ని వివరిస్తాయి. అదేవిధంగా దీన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల అన్నీ కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.


Also Read: సర్పదోషాలు తొలగాలంటే నాగుల చవితి రోజున ఇలా చేయండి