రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా భారీ రామానుజ విగ్రహ ప్రాంగణాన్ని సీఎం పరిశీలించారు. ముఖ్యమంత్రికి చిన్నజీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్స్ అధినేత డా.జూపల్లి రామేశ్వరరావు ఏర్పాట్ల గురించి తెలియజేశారు. శ్రీమద్రామానుజ విగ్రహం సమానత్వానికి ప్రతీకలాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. రామానుజ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం యాగశాలను సందర్శించి పెరుమాళ్లను దర్శించుకున్నారు. 


రెండోరోజు అరణి మథనంతో వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మహాక్రతువులో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీ నారాయణ మహాయాగాన్ని వేదపండితులు నిర్వహించారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలతో బాలాగ్నిని రగిలించిగా 9 నిమిషాల్లో అగ్ని పుట్టింది. ఆ అగ్నిహోత్రాన్ని పెద్దది చేస్తూ 1035 కుండలాలు ఉన్న యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పవిత్ర యాగశాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించినట్టు చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా యాగశాల కుడివైపు భాగానికి భోగ మండపం, తిరుమల క్షేత్రాన్ని స్మరించేలా మధ్య భాగానికి పుష్ప మండపం, కాంచీపురానికి గుర్తుగా వెనుక వైపు ఉన్న భాగానికి త్యాగ మండపం, మేల్కోట క్షేత్రాన్ని తలచుకుంటూ ఎడమ వైపు ఉన్న మండపానికి జ్ఞాన మండపం అని పేరు పెట్టారు. ఆపై చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా 114 యాగశాలల్లో లక్ష్మీ నారాయణ మహాక్రతువు నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై లక్ష్మీనారాయణ మహా యాగాన్ని వైభవంగా నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వైష్ణవ స్వాములకు జూపల్లి రామేశ్వరరావు దీక్షావస్త్రాలను సమర్పించారు.  ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు మంత్రి హరీశ్ రావు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి ఎంఎల్ఏ రోజా పాల్గొన్నారు. 


ప్రవచన మండపంలో ప్రారంభంగా పెద్జ జీయర్ స్వామి పూజా కార్యక్రమాన్ని చిన్న జీయర్ స్వామి స్వయంగా ఆచరింపజేసి మంగళనీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది భక్తులు పెద్ద జీయర్ స్వామిని పూజించారు. అదే సమయంలో చిన్న జీయర్ స్వామి సన్యాసాశ్రమ స్వీకార విశేషాలను స్వామివారి ఔన్నత్యాన్ని గురించి మహోమహోపాధ్యాయ డా.సముద్రాల రంగరామానుజులు వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ నుంచి విచ్చేసిన శ్రీమాన్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణేష్టి, సత్సంతానానికై వైనేతేయేష్టి, శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ జరుగనున్నాయి. కార్యక్రమంలో ప్రధానఘట్టం ఫిబ్రవరి 5న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 216 అడుగుల సమతామూర్తి విగ్రహం జాతికి అంకితం ఇవ్వనున్నారు.