'లూసిఫర్' సినిమాలో సోషల్ మీడియా ద్వారా ఒక్కో క్యారెక్టర్ ని పరిచయం చేస్తుంటాడు ఓ వ్యక్తి. మోహన్ లాల్ ఎంట్రీకి ముందు  ఓ మాట చెబుతాడు...హిందువులకు మైరావణుడు,ఇస్లాంలో ఎబ్లిసెంట్, క్రిస్టియన్స్ లూసిఫర్ అని. మూడింటికీ అర్థం ఒకటే మరి ఎవరీ మైరావణుడు ( క్రిస్టియానిటీలో లూసిఫర్) మైరావవణుడు అంటే చాలామందికి తెలుసు కానీ లూసిఫర్ అనగానే అందరికీ అర్థమవుతుందనే ఆ పదం వినియోగించాల్సి వచ్చింది. ఇంతకీ పంజముఖ ఆంజనేయస్వామికి మైరావణుడి ఏంటి సంబంధం...


రావణుడి మేనమామ మైరావణుడు: రామాయణంలో రామ రావణ యుద్ధం సమయంలో  మైరావణుడి ప్రస్తావన వస్తుంది. రావణుడికి మేనమామ. పాతాళంలో లంకకు అధిపతి. శివుడి అనుగ్రహంతో ఎన్నో వరాలు పొందిన రాక్షసుడు. రామ రావణ యుద్ధంలో రామ లక్ష్మణుల దాటికి రావణుడి సైన్యం చెల్లా చెదురైపోవడంతో ఇక రాముడిని జయించడం అసాధ్యం అనుకున్న రావణుడు తన మేనమామ మైరావణుడి సహాయాన్ని ఆర్ధిస్తాడు. సరే అని హామీ ఇచ్చిన మైరావణుడు... సూచీముఖుడు, మూషికముఖుడు,పాషాణ బేధి అనే రాక్షసులను వరుసగా పంపిస్తాడు. రాత్రి వేళ రామ లక్ష్మణులతోపాటు మొత్తం వానర సైన్యానికి హనుమంతుడు తన వాలంతో శత్రు దుర్భేద్యమైన ప్రాకారాన్ని నిర్మించి రక్షిస్తుంటాడు. దీంతో లోపలకు ప్రవేశించలేక ఆ రాక్షసులు వెనుతిరుగుతారు. 


కొడుకుని కలిసిన హనుమంతుడు: ఇక రంగంలోకి దిగిన మైరావణుడు..విభీషణుడి వేషంలో వెళ్లి హనుమంతుడి అనుమతితో లోపలకు అడుగుపెట్టి రామలక్ష్మణులను అపహరించి తీసుకొస్తాడు. ఆ తర్వా అసలు విభీషణుడు రావడంతో హనుమంతుడు హుతాశుడవుతాడు. తన కన్ను కప్పి స్వామిని అపహరించిన ఆ దుర్మార్గుడు ఎవరు అంటూ మహోగ్ర రూపుడై పైకి లేస్తాడు. అప్పుడు విభీషణుడు ఈ పని ఖచ్చితంగా మహా మాయవి పాతాళ లంకాధిపతి అయిన మైరావణుడిదే అని చెబుతాడు. పాతాళ లోకానికి వెళ్లిన ఆంజనేయుడు.. తనతో యుద్ధం చేసిన రాక్షసులు అందర్నీ హతమారుస్తాడు కానీ ఓ రాక్షస యోధుడితో జరిగిన యుద్ధంలో అలసిపోతాడు. ఆశ్చర్యపోయిన హనుమంతుడు..మహావీరా ! నాకు సాధారణంగా యుద్ధంలో అలసట కలగదు. అలాంటి నాతో అలసిపోయే అంతగా యుద్ధం చేయగలిగిన నీవు ఎవరు ? " అని అడిగాడు.


మైరావణుడి గురించి తండ్రికి సమాచారం ఇచ్చిన ఆంజనేయుడి కొడుడు: అప్పుడా యోధుడు " మా తల్లి ఒక అప్సర కన్య. మాతంగ మహర్షి శాపానికి గురై ... మీ స్వేదబిందువు ద్వారా తల్లై శాపవిమోచనం చెందింది. కుమారా నువ్వు మైరావణుడి వద్దకు వెళ్ళు..నీతో యుద్ధం చేసి ఎవరైతే అలసిపోతారో ఆ వీరుడే నీ తండ్రి అని చెప్పిందని నువ్వు ఆంజనేయుడివి అయి ఉంటావని అంటాడు. పుత్రుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్న ఆంజనేయుడితో.. తండ్రీ ఏమి చేయాలో సెలవీయండి అని అడగ్గా..మైరావణుడి గురించి అడిగి తెలుసుకుంటాడు.


ఐదు దిక్కుల్లో దీపాలు ఆపేందుకు ఐదు ముఖాలు: మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు తనతో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు. వాటిని ఒక్కసారి ఆపాలంటే తనకు ఐదు ముఖాలు ఉండాలంటూ పంచముఖ ఆంజనేయుడి అవతారం ఎత్తాడు.తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖం ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా  ఆర్పేసి మైరావణుడిని సంహరిస్తాడు. అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు.


ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. స్వామివారి పంచముఖాల్లో ఒక్కో ముఖానికి ఒక్కో రూపం. దక్షిణాన నరసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహవతారం, ఊర్ద్వముఖాన హయగ్రీవుని అంశ. ఈ ఐదు రూపాలు కష్టాల నుంచి గట్టెక్కించి అభయాన్నిచ్చేవే. అందుకే పంచముఖ ఆంజనేయుడు అంత పవర్ ఫుల్ అని చెబుతారు పండితులు.


Also Read: జెండాపై కపిరాజు( హనుమంతుడు)ని ఎందుకు పెడతారు, ఇంటిపై ఆ జెండా పెడితే ఏమవుతుంది


Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి