మిత్రుడు అంటే సూర్యభగవానుడు. సర్వజగత్తుకూ వెలుగులు పంచేవాడు, చైతన్యప్రదాత. అందుకే స్నేహితుణ్ని మిత్రుడన్నారు. దుర్మార్గమైన పనుల నుంచి నివారించే వ్యక్తి, సత్కార్యాలు చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చేవాడు, రహస్యాలను కాపాడేవాడు, సద్గుణాలను కలిగి ఉండేవాడు, ఆపత్కాలంలో నీడలా అనుసరించివచ్చేవాడే నిజమైన మిత్రుడు. మనిషి సౌశీల్యం అతడు పాటించే మిత్రధర్మాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఐశ్వర్యం, విద్య, పదవిని దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయకూడదు. అలాంటి వారెందరో పురాణ ఇతిహాసాల్లో ఉన్నారు. 




శ్రీరాముడు-సుగ్రీవుడు
రామకథలో వాల్మీకి మహర్షి.. స్నేహితుడి గొప్పదనాన్ని, మైత్రీప్రాశస్త్యాన్ని రాముడి ద్వారా లోకానికి చాటాడు. రామాయణంలో గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు రాముడికి ఆప్తమిత్రులుగా కనిపిస్తారు. రాముడు చక్రవర్తి అయినుప్పటికీ... గిరిజనుడైన గుహునితో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేసి మైత్రీధర్మానికి స్థాయీభేదాలు లేవని ప్రపంచానికి చాటిచెప్పాడు. కష్టాల్లో సహకారం అందించేవాడు నిజమైన మిత్రుడని రామసుగ్రీవులు చాటారు. వారిద్దరూ భార్యావియోగాన్ని అనుభవించినవారే. సుగ్రీవుని భార్య రుమను వాలి తన అధీనంలోకి తీసుకుంటే.. సీతాదేవిని రావణుడు అపహరించాడు. రామ, సుగ్రీవుల మైత్రీబంధమే.. రుమ, సీతల విముక్తికి కారణమైంది. శత్రువు సోదరుడైనా సరే.. అధర్మాన్ని ఎదిరించి వచ్చినందుకు విభీషణుడితో రాముడు స్నేహం చేశాడు.
‘మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన’.. మిత్రభావంతో వచ్చినవానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనన్నాడు.


ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగో పి వా పునః
వయస్యార్థే ప్రవర్తన్తే స్నేహం దృష్ట్వా తథావిధమ్‌


నిజమైన స్నేహానికి ధనాన్నైనా, శరీర సుఖాన్నైనా, చివరకు దేహాన్నైనా త్యాగం చేయాల్సిందే తప్ప స్నేహాన్ని వదలరాదని దీని భావం. 


దశరథుడు-జటాయువు
స్నేహానికి కాలపరిమితి ఉండదు...స్నేహితుడి వరకే పరిమితం అయిపోకూడదు. స్నేహితుడి కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉండాలి. మిత్రుడిని ఎంతగా ప్రేమిస్తామో... అతడి కుటుంబ సభ్యులకూ అంతే ప్రేమనందిచాలి. శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు, జటాయువు ప్రాణ స్నేహితులు. యుద్ధాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. దశరథుడు మరణించిన తర్వాత అతడి కుమారుడైన రాముడినీ జటాయువు స్నేహితుడిగానే చూశాడు. వనవాసానికి వచ్చిన రాముడికి తనను తాను పరిచయం చేసుకున్నాడు జటాయువు. నా మిత్రుడిలాగే నిన్నూ కాపాడతానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం రావణుడు సీతను అపహరిస్తున్నప్పుడు  ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. రెక్కలు తెగిపడిపోయినా రాముడు వచ్చేవరకు ప్రాణాలు బిగపట్టి నిలుపుకున్నాడు. సీతమ్మ వివరాలు చెప్పిన తర్వాతే ప్రాణం విడిచాడు. స్నేహమంటే త్యాగం. స్నేహమంటే మిత్రుడిని కాపాడేందుకు ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టడం. 






కృష్ణుడు-అర్జునుడు
సంతోషంగా ఉన్నప్పుడు మనచుట్టూ చాలామంది ఉంటారు... కానీ కష్టం వచ్చినప్పుడు మనకి అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవాడే స్నేహితుడు. పురాణాల్లో ఇలాంటి స్నేహితులంటే కృష్ణార్జునులే.  మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య యుద్ధానికి అంతా సిద్ధంగా ఉంది. రెండు వైపులా వీరులంతా యుద్ధరంగానికి చేరుకున్నారు. అర్జునుడి సారథిగా ఉన్న ప్రాణమిత్రుడు కృష్ణుడు రథాన్ని నేరుగా యుద్ధరంగంలోకి తీసుకువస్తాడు. యుద్ధరంగంలో కౌరవుల పక్షంలో ఉన్న తన బంధువులు, మిత్రుల్ని చూసి అర్జునుడు కలత చెందుతాడు. యుద్ధం చెయ్యలేనంటూ రథం దిగిపోతాడు. గొప్ప పరాక్రమవంతుడైన తన మిత్రుడు అర్జునుడు పిరికివాడిలాగా యుద్ధరంగం నుంచి పారిపోవటం కృష్ణుడికి ఏమాత్రం నచ్చదు. యుద్ధం ఎందుకు చెయ్యాలో, చెయ్యకపోవటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో అన్నీ చక్కగా వివరిస్తాడు. నిరాశ వదిలిపెట్టాలని, సరైన సమయంలో ధైర్యం కోల్పోతే లక్ష్యాన్ని సాధించలేమంటూ బోధిస్తాడు. అర్జునుడిలో ఉన్న విచారం, నిరాశ అన్నీ కృష్ణుడి మాటలతో తొలగిపోతాయి. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తాడు.




ఇక కృష్ణుడు- కుచేలుడు... కర్ణుడు-దుర్యోధనుడి స్నేహం గురించి అందరకీ తెలుసిందే..
కృష్ణుడు-కుచేలుడు
శ్రీకృష్ణుడు, కుచేలుడుల స్నేహ బంధం విడదీయరానిది. కుచేలుడి అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానం మహా భాగవతం దశమ స్కందంలో ఈ ప్రస్తావన వస్తుంది.  శ్రీ కృష్ణుడు, బలరాముడు, సుధాముడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేస్తారు. విద్యాభ్యాసం అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకున్నాడు. కుచేలుడు తన స్వగ్రామం చేరుకున్నాడు.


కుచేలుడు  బండెడు సంతానంతో దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే కుచేలుడి ‘”భార్య లోక రక్షకుడైన శ్రీకృష్నుడిని దర్శనం చేసుకుని రమ్మంటుంది'”. కుచేలుడు ద్వారకా నగరం పోయేముందు కుచేలుని భార్య ఒక చిన్నఅటుకుల మూట కట్టి ఇస్తుంది. ద్వారక చేరుకున్న కుచేలుడు అక్కడ భవనాలు, రాజప్రాకారాలు చూసి తనను కృష్ణుడ్ని కలవనిస్తారా అని సందేహపడతాడు. కానీ స్వయంగా ఆహ్వానించి లోపలకు తీసుకెళ్లి సకలమర్యాదలు చేస్తాడు కృష్ణుడు. ఆ సమయంలో కుచేలుడి అదృష్టాన్ని చూసి సభలోని వారంతా కొనియాడతారు.  


అతిథి మర్యాదలు పూర్తయ్యాక కుచేలుడీతో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలను చర్చిస్తాడు. ఆ తర్వాత కుచేలుడితో... నాకోసం ఏమైనా తీసుకొచ్చావా అని అడుగుతాడు. అంత వైభవాన్ని అనుభవిస్తున్న కృష్ణుడికి...తాను తెచ్చిన అటుకుల మూట ఇవ్వడం సరికాదని వెనక్కు దాచుతాడు కుచేలుడు. అదిగమనించిన కన్నయ్య... అవి తీసుకుని గుప్పెడు అటుకులు తింటాడు. వెంటనే కుచేలుడికి సర్వసంపదలు కలుగుతాయి. రెండో గుప్పెడు తినబోతుండగా.... స్వామీ మొదటిసారి మీరు తిన్నప్పుడే సకల సంపదలు కలిగాయని రుక్మిణి చెబుతుంది. ఆ తర్వాత సంతోషంగా స్నేహితుడికి వీడ్కోలు పలుకుతాడు కృష్ణుడు. 




కర్ణుడు-దుర్యోధనుడు
కర్ణుడు స్నేహానికి మారు పేరు. స్నేహం కోసం ప్రాణాలిచ్చాడు. తన స్నేహితుడు ధర్మం వైపు ఉన్నాడా? అధర్మం వైపు ఉన్నాడా అని కాదు అన్ని వేళలా తన హితుని క్షేమం మాత్రమే కోరిన వాడు కర్ణుడు. తనను నమ్మని తనకు ఆశ్రయం ఇచ్చిన దుర్యోధనుడి కోసం ప్రాణాలిచ్చిన గొప్ప స్నేహితుడు కర్ణుడు.  పాండవులకి ఎదురు నిలిచే ధైర్యంలేని సమయంలో కర్ణుడు నేనున్నానంటూ దుర్యోధనుడికి అండగా నిలిచాడు. తాను అధర్మం వైపు నిలుస్తున్నానని కర్ణుడికి తెలుసు. కానీ తను అవమానానికి గురైనప్పుడు దుర్యోధనుడే తనకు అండగా నిలిచాడని గుర్తించుకుని ప్రాణం పోయే వరకు దుర్యోధనుడి వెంటే ఉన్నాడు. దుర్యోధనుడిని నమ్మితే తనకు మరణం తప్పదని తెలిసినా స్నేహాన్ని మాత్రం వదల్లేదు కర్ణుడు.


మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక రోజు రాత్రి శ్రీకృష్ణుడు కర్ణుడి శిబిరానికి వెళ్తాడు. కర్ణుడికి అతని పుట్టు పూర్వోత్తాలను వివరిస్తాడు. నువ్వు పాండవులకి అన్నవి. యుద్ధంలో పాండవుల వైపు ఉండి పోరాడు అని కోరుతాడు కృష్ణుడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఓ నవ్వు నవ్విన కర్ణుడు... "నా పుట్టుక గురించి తెలుసు. నేను పడ్డ అవమానాలు తెలుసు. ఈ యుద్ధంలో పాండువులే విజయం సాధిస్తారనీ నాకు తెలుసు. నాకు మరణం తప్పదని తెలుసు. పాండవులు ధర్మాత్ములు. అయినా కష్ట సమయంలో నా స్నేహితుడిని వదిలేసి ఎలా వస్తావని  అనుకున్నావు" అని అంటాడు. దుర్యోధనుడికి ఈ ప్రపంచంలో ఎవ్వరిపైనా నమ్మకం లేదు. నన్ను మాత్రమే నమ్ముతాడు. నేను ఉన్నాననే బలంతోనే తాను రణరంగంలోకి దిగాడు. ఇప్పుడు నేను పాండవులు వైపు వెళితే నా ప్రాణ మిత్రుడికి ద్రోహం చేసినట్లే. నా స్నేహితుడి కోసం ప్రాణాలైనా విడుస్తానుగానీ అతనికి ద్రోహం మాత్రం చెయ్యను." అని కరాఖండిగా చెబుతాడు కర్ణుడు.