Dhanteras 2023 Date: ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఐదురోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే  శ్రీ మహాలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. 


లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం|
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియాం||


ధనత్రయోదశి ఎప్పుడొచ్చింది (Dhanteras 2023) 


దీపావళి పండుగ ధనత్రయోదశి తోనే ప్రారంభమవుతుంది. ఈ ఏడాది నవంబరు 11 శనివారం రోజు ధనత్రయోదశి వచ్చింది. ఈ  రోజునే బంగారం ఎందుకు కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ వెనుక కొన్ని పురాణ కథలున్నాయి. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందట. అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. అందుకే ధంతేరాస్ వచ్చేసరికి బంగారం వెండి ధరలు పెరిగినా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే వినియోగదారులు మాత్రం కొనుగోలు చేసేందుకు వెనకాడరు.


Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!


ధన్వంతరి జయంతి (dhanvantari jayanti 2022)


ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి.  ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం  ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. 


ధన్వంతరి గాయత్రీ 


ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి 
తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్ 


ధన్వంతరి  తారకమంత్రం 


ఓం ధం ధన్వంతరయే నమః 


ధన్వంతరి మంత్రః 


ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే 
అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ 
త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప 
శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా |


Also Read: నవంబరు నెలలో ఈ రాశువారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం!


ఉత్తరాది పండుగ


ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తరాదివారే ఎక్కువగా జరుపుకుంటారు. రాను రాను దక్షిణాదివారూ ఫాలో అవుతున్నారు. బంగారం-వెండి కొనుగోలు చేయడం, లక్ష్మీపూజ చేయడం మంచిదే కదా ఇందులో తప్పేముందని భావిస్తున్నారు. అందుకే తమ శక్తి కొలది బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. వినాయకుడు, లక్ష్మీదేవి, కుబేరుడి బొమ్మలు కొత్తవి కొనుగోలు చేసి పూజించడాన్ని  శుభప్రదంగా భావిస్తారు. సాధారణంగా ఈ పూజను ప్రదోష వేళలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాల కాలాన్నే ప్రదోషకాలం అంటారు. ధన త్రయోదశి రోజున ఎవ్వరికీ అప్పులు ఇవ్వడం, అనవసర ఖర్చులు చేయడం చేయరు..


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!