Brahmastra:  బాలీవుడ్,టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా గురించే చర్చ జరుగుతోంది.  అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, హీరోయిన్ మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే..ఇక్కడ డిస్కషన్ ఏంటంటే..ఇంతకీ బ్రహ్మాస్త్రం అంటే ఏంటి? ఎంత పవర్ ఫుల్ గా ఉంటుంది? ఎవరెవరి దగ్గర ఉండేది? ఎవరు ఎవరిపై ప్రయోగించారో చూద్దాం...


బ్రహ్మాస్త్రం అంటే ఏంటి?
బ్రహ్మాస్త్రం అంటే చాలామంది అపోహ ఏంటంటే బ్రహ్మ ఇచ్చిన అస్త్రం, బ్రహ్మ దేవుడు సృష్టించిన అస్త్రం అనుకుంటారు. కానీ బ్రహ్మము అనేది ఓ తత్వం...వివరణ చెప్పలేనిది అని అర్థం. సృష్టి అంతా ఒక్కటే అయితే ఎవరో..ఆయనే పరమాత్మ, పరబ్రహ్మ అని పేరు..ఆయన ద్వారా వచ్చిన అస్త్రం కాబట్టి బ్రహ్మాస్త్రం అని పేరు.  


అస్త్ర-శస్త్రాలు అంటే
అస్త్ర-శస్త్రాలు రెండింటినీ కలపి చెబుతారు కానీ ఈ రెండింటి మధ్యా చాలా వ్యత్యాసం ఉంది. శస్త్రం అంటే పదునుగా చెక్కిన ఆయుధం. ఈటె, కత్తి ఇవన్నీ శస్త్రాలుగా చెప్పొచ్చు.  అస్త్రం అంటే అక్కడ ఏం వస్తువు ఉందన్నది కాదు మంత్ర బలంతో పనిచేసేదని అర్థం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే  ఆ క్షణం అక్కడ ఓ గడ్డిపరక దొరికితే దాన్ని అభిమంత్రించి వదిలిపెడితే అది అస్త్రంగా మారుతుంది. బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం, అగ్ని అస్త్రం..ఇలా వీటికి లోహంతో పనిలేదు..మంత్ర బలంతో పనిచేస్తాయి. బ్రహ్మాస్త్రం పూర్తిగా గురు శుష్రూష చేస్తే మాత్రమే ఆ బలం లభిస్తుంది కానీ బలవంతంగా దక్కించుకునేది కాదు..


Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
 
బ్రహ్మాస్త్రాన్ని ఎవరెవరు ప్రయోగించారు?
ఈ బ్రహ్మాస్త్రం త్రేతాయుగంలో రాముడికి ఉంది. యుద్ధంలో చివరిగా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే రావణ సంహారం చేశాడు.  
ద్వాపర యుగంలో భీష్ముడు,పరుశరాముడకి, కృష్ణుడికి, ద్రోణుడికి,అర్జునుడికి,కర్ణుడికి కూడా బ్రహ్మాస్త్రం ఉంది. 
పరుశరాముడి నుంచి ద్రోణుడు, కర్ణుడు.. ద్రోణుడి నుంచి అర్జునుడు ఇది నేర్చుకున్నారు. కృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు..


ద్రోణుడు-కర్ణుడికి పరుశరాముడే గురువు
ఓసారి పరుశరాముడు దాన ధర్మాలు చేస్తున్నాడని తెలిసి అక్కడకు వెళతాడు ద్రోణుడు.  భూమిని కశ్యపుడికి, ఐశ్వర్యాన్ని పేద బ్రహ్మలకు ఇచ్చాను..ఇత తన దగ్గర ఏమీలేదని పరుశరాముడు చెప్పడంతో..అస్త్ర శస్త్ర విద్యలు నేర్పమని అడుగుతాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణుడికి బ్రహ్మాస్త్రం ఉపదేశం చేస్తాడు పరుశరాముడు. ఆ తర్వాత ద్రోణుడి నుంచి అర్జునుడు నేర్చుకుంటాడు..


అశ్వత్థామకి కూడా పూర్తిగా ఉపదేశించని ద్రోణుడు
ద్రోణుడు తన కొడుకు అయిన అశ్వత్థామకు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగం చెబుతాడు కానీ ఉపసంహారం చెప్పడు. ఎందుకంటే అశ్వత్థామ ఆవేశపరుడు. కోపం వస్తే ఎలా స్పందిస్తాడో కూడా తెలియదు. భారత యుద్ధం ముగిసిన తరువాత శివుడి అంశతో అందరిని సంహరించిన అశ్వత్థామ పాండవులు తనను ఏమైనా చేస్తారేమో అనే భయంతో తనను కాపాడుకోవడం కోసం పాండవుల భార్యల గర్భాల్లో, పాండవుల వారసుల గర్భాలలో ఉన్న శిశువులతో సహా "అపాండవం అవ్వు గాక!" అని బ్రహ్మశిరోనామకాస్త్రం సంధించాడు. కాని ఉపసంహారం తెలియదు. శ్రీకృష్ణుడు ఉపసంహారం ఉపదేశిస్తాను ఉపసంహరించు అని బ్రతిమలాడినా వినలేదు. అంత మూర్ఖుడు అని గ్రహించే ద్రోణుడు తన కొడుకుకి సైతం నేర్పించలేదు. అదే ఉద్దేశంతోనే  అనవసర పగతో రగిలిపోతున్న కర్ణుడికి కూడా ఉపదేశించలేదు.


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?


కర్ణుడిది ప్రయోజనం లేని విద్య
అర్జునుడి మీదున్న ప్రేమతో  బ్రహ్మాస్త్రం ఉపదేశించలేదని తనలో తాను ఊహించుకుంటాడు కర్ణుడు. పరశురాముడి వద్దకు వెళ్లి బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి  బ్రహ్మాస్త్రం ప్రయోగ-ఉపసంహార విధులు నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం దాదాపు ముగిసిన తరువాత ఒకరోజు పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడ మీద తల పెట్టి పడుకున్నాడు. ఇంతలో ఒక రాక్షసుడు పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తోడ తొలుస్తూ ఉంటాడు. గురువుకి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు ఓర్చుకుంటాడు. అప్పుడు నిద్రలేచిన పరుశరాముడు   బ్రాహ్మణుడికి ఇంత శక్తి ఉండదని దివ్యదృష్టిలో నిజం తెలుసుకుంటాడు. "యుద్ధ సమయంలో నువ్వు బ్రహ్మాస్త్ర ప్రయోగ మంత్రం మర్చిపోదువు గాక! అని శపిస్తాడు. అంటే కర్ణుడికి ఉపదేశం ఉన్నప్పటికీ ఉపయోగం లేదన్నమాట.


బ్రాహ్మాస్త్రానికి సైన్స్ కి లింక్
బ్రహ్మాస్త్రం అంటే.. అంతకుమించి ఆయుధం లేదని అర్థం. అందుకే భారత సైన్యంలోనూ శక్తివంతమైన మిస్సైల్స్‌కు బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. పురాణ ఇతిహాసాల్లో మాత్రమే బ్రహ్మాస్త్రం పేరు వినిపించినా.. మోడ్రన్ మిస్సైల్ టెక్నాలజీకి బ్రహ్మాస్త్ర టెక్నిక్స్‌ మూలం అన్న చర్చ కూడా ఉంది. మహాభారత కాలం నాటి అస్త్రాలు ఇప్పటి అణ్వాయుధాల కంటే భయంకరమైనవని అంటూ గోర్బోవ్ అనే రష్యన్ పండితుడు చెప్పాడంటారు.