జూన్ 22 బుధవారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం


ఎర్రటి ఎండకు మండి మండి నెర్రలిచ్చిన నేల తొలకరి చినుకుల కోసం తపించిపోతుంది. మేఘం ఉరిమి చినుకు కురియగానే  నేలతల్లి తన ఆనందాన్ని మట్టి పరిమళంగా వెదజల్లుతుంది. ఆ చినుకుతడి తగిలిన వెంటనే నేలలోపల నుంచి బిలబిల మంటూ ఎర్రటి పురుగులు బయటకొచ్చేస్తాయి. వీటినే ఆరుద్ర పురుగులు అంటారు. ఆరుద్ర కార్తె ప్రారంభం కాగానే ఇవి కనిపిస్తే ఆ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. అందుకే ఆరుద్ర పురుగులను తమకు శుభవార్త తీసుకొచ్చే నేస్తాలుగా భావిస్తారు రైతులు. ఎర్రగా బొద్దుగా చూడముచ్చటగా కనిపించే  ఇవి బయట కనిపించగానే రైతులంతా పలుగు పారా అందుకుని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. 


ఆరుద్ర పురుగులు వచ్చేశాయ్
వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఏటా ఆరుద్ర కార్తె ప్రారంభం కాగానే కనిపించే ఈ పురుగులు ఈ ఏడాది రెండు రోజుల ముందే..అంటే..మృగశిర కార్తెలోనే కనువిందుచేశాయి. అంటే ఈ సంవత్సరం వరుణుడు తగ్గేదేలే అన్నట్టుంటాడని అర్థం. పల్లెటూర్లలో ఓ వ్యవసాయ క్షేత్రంలో చూసినా ఆరుద్ర పురుగులు కనిపించేవి . అయితే రాను రాను ఫెస్టిసైడ్స్ వాడకం ఎక్కువై పుడమి తల్లి కాలుష్య కాసారంగా మారుతోంది. దీంతో ఏటికేడు ఆరుద్ర పురుగుల ఉనికి తగ్గిపోతోంది. ఈ ఏడాది మాత్రం ముందే అనుకున్న సమయం కన్నా ముందే కనిపించడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. 


Also Read: గుడిలో అడుగుపెట్టే ముందు ద్వారానికి( గడపకి) ఎందుకు నమస్కారం చేస్తారు


పర్యావరణ నేస్తాలు ఆరుద్ర పురుగులు
అందంగా కనిపించే ఆరుద్ర పురుగును కొన్నిచోట్ల పట్టు పురుగు, చందమామ పురుగు , లేడీ బర్డ్ , ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ క్లాత్ తో చేసిన బొమ్మలా ఉంటాయి. ముట్టుకోగానే అత్తిపత్తి ఆకుల్లా ముడుచుకుపోతాయ్. ఇంగ్లీష్ లో Red Velvet Mite అని పిలిచే ఈ ఆరుద్ర పురుగులు పర్యావరణ నేస్తాలు.ఇవి నేలను గుల్లబారకుండా చేసి పంటలకు పోషకాలు అందిచడంలో సహకరిస్తాయి. 


కార్తెలు అంటే ఏంటి?
జోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా జాతకాలు,పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు. అయితే వీరి లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. ప్రస్తుతం మృగశిర కార్తె పూర్తై...జూన్ 22 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభమైంది. 


Also Read: మీ బెడ్‌రూమ్‌ నుంచి బాత్‌రూం వరకు అంతా ఆ ఎనిమిది మంది డైరెక్షన్‌లోనే, బిగ్‌ బాస్‌ కంటే ఎక్కువ ఫోకస్ ఉంటుంది