AP Inter Results 2022 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు నేటి(జూన్ 22) మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు, ఒకేషనల్ ఫలితాలు అన్నీ ఒక్కసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల అయ్యాక విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు.


10 లక్షల మంది విద్యార్థులు..
ఏపీలో ఇంటర్ పరీక్షలు 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ఏపీ ఇంటర్‌ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో మే 24వ తేదీ వరకు ఏపీ ఇంటర్ పరీక్షలను పూర్తి చేసింది. ఆపై ఇంట‌ర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా చేశారు. ఏపీలో మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజ‌ర‌య్యారు. 


అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలు..
ఏపీలో పదో తరగతి పరీక్షల్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించింది. పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చి పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ద్వారా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్‌ బోర్డ్ ఎగ్జామ్స్‌ను పర్యవేక్షించారు. నేడు పరీక్షా ఫలితాల విడుదలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. విద్యాశాఖ మంత్రి బొత్స నేటి మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్ సైట్‌ https://bie.ap.gov.in/లో ఫలితాలు చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తర్వాత విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు. 


తెలంగాణ ఇంటర్ ఫలితాలు


తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు మే 6న ప్రారంభమై మే 24వ తేదీతో ముగిశాయి.  ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియలో వేగం పెంచారు. రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం చేపడుతోంది. ఈ ఏడాది కొత్తగా మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసింది.  జూన్‌ రెండో వారం చివరి నాటికి స్పాట్‌ వాల్యుయేషన్‌ ( Spot Valueation ) పూర్తి చేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంకా ఫలితాలు ( Results Not Ready ) సిద్ధం కానట్లు తెలుస్తోంది. ఫలితాలు సిద్ధమైన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు చెబుతోంది.