YSR Jagan Political Vendetta Claims:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, మాజీ మంత్రులు, కీలక నేతలు వరుసగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని ముందస్తు బెయిళ్ల కోసం హైకోర్టు మెట్లు ఎక్కడం లేదా ఆజ్ఞాతంలోకి వెళ్లడం ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూకబ్జా, డెత్ సర్టిఫికెట్ల ఫోర్జరీ కేసుల విచారణ నెదుర్కొనడం, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కిడ్నాప్ వివాదంలో చిక్కుకోవడం, మహిళా ఎస్ఐపై దౌర్జన్యం ఆరోపణలతో ఆముదాలవలస ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆజ్ఞాతంలోకి వెళ్లడం వంటి వరుస ఘటనలు విపక్షాన్ని తీవ్ర ఆత్మరక్షణలో పడేశాయి.ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు అయ్యారు. ఆర్కే రోజా, కైలే అనిల్ కుమార్, విశ్వేశ్వర్ రెడ్డి  వంటి కీలక నాయకులు సైతం రకరకాల క్రిమినల్ కేసులు, అరెస్టు భయంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

Continues below advertisement

ప్రతీకార రాజకీయాలంటున్న వైసీపీ 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలకు  పాల్పడుతోందని, వైఎస్సార్‌సీపీ నేతలను భయాందోళనకు గురిచేసేందుకే పోలీసులు, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అబద్ధపు కేసులు బనాయిస్తున్నారని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న  కేసులు ఎక్కువగా రాజకీయాలకు సంబంధం లేనివి. భూక్రమబద్ధీకరణ పత్రాల ఫోర్జరీ, బ్రతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు చూపించడం  , సివిల్ తగాదాల్లో అపహరణలు , ఆన్-డ్యూటీ మహిళా పోలీసులపై భౌతిక దౌర్జన్యాలు   వంటి తీవ్రమైన నాన్-బెయిలబుల్ క్రిమినల్ కేసులు .

Continues below advertisement

అధికారం లేకపోయినా దూకుడు చూపిస్తున్నారా? 

గత ఐదేళ్ల పాలనలో నియోజకవర్గాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నాయకులు, ప్రభుత్వం మారిన తర్వాత కూడా తమ పాత ధోరణినే కొనసాగించడం. స్థానిక అధికార యంత్రాంగంపై భౌతిక దాడికి దిగడం లేదా చట్టవ్యతిరేక భూ లావాదేవీలలో భాగస్వాములు కావడం ద్వారా స్వయంగా కూటమి ప్రభుత్వానికి లీగల్ ఆధారాలను అందించి ఉచ్చులో చిక్కుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో సానుభూతి కోసం వైఎస్సార్‌సీపీ ఎంచుకున్న వ్యూహాత్మక రాజకీయ  బాధితులుగా నిలిచే స్ట్రాటజీ కూడా కావొచ్చని భావిస్తున్నారు.  తాము ప్రతిపక్షంలో ఉన్నామని, ప్రభుత్వం కావాలనే కేసులు పెడుతోందని ప్రజల్లో చూపించుకోవడం ద్వారా రాజకీయంగా మైలేజ్ పొందే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయం ఉంది. అయితే, సివిల్ వివాదాలు, వ్యక్తిగత క్రిమినల్ ఆరోపణలు ఉన్న కేసుల్లో ఈ  పొలిటికల్ విక్టిమ్  కార్డ్ సరిగ్గా పనిచేయదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. సామాన్య ప్రజలు భూకబ్జాలు, కిడ్నాప్ కేసులను పొలిటికల్ వెండ్రెట్టాగా చూడటానికి సిద్ధంగా లేకపోవడమే వైఎస్సార్‌సీపీ నరేటివ్‌కు అతిపెద్ద అడ్డంకిగా మారిందని అంటున్నారు. 

కేసులతో వెనక్కి తగ్గుతున్న వైసీపీ క్యాడర్ 

ఈ వరుస అరెస్టులు, ముందస్తు బెయిళ్ల కొట్టివేత పరిణామాలు వైఎస్సార్‌సీపీ కేడర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. నియోజకవర్గ స్థాయిలో నడిపించే ప్రధాన నాయకులే రోజులు, వారాల తరబడి ఆజ్ఞాతంలోకి వెళ్లడం లేదా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంతో స్థానిక శ్రేణుల్లో నాయకత్వ శూన్యత ఏర్పడుతోంది. ద్వితీయ శ్రేణి నాయకులు కనీసం నిరసన ప్రదర్శనలు చేసేందుకు కూడా వెనకడుగు వేసేలా ఈ చట్టపరమైన చర్యలు మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ తన డిఫెన్సివ్ మైండ్‌సెట్ నుండి బయటపడటం అత్యంత క్లిష్టంగా మారనుంది. చట్టబద్ధమైన నేరాలకు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వైఎస్సార్‌సీపీ లీగల్, మీడియా విభాగాలు విఫలమవుతున్నాయని స్పష్టమవుతోంది. సరైన క్రిమినల్ రక్షణ ప్రణాళికలు లేకుండా, అధిష్ఠానం ఇచ్చే రాజకీయ హామీలను మాత్రమే నమ్ముకుని క్షేత్రస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్న ఇన్‌ఛార్జ్‌లు చివరకు న్యాయపరమైన సంక్షోభంలో మునిగిపోతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా ఆ పార్టీలో వినిపిస్తోంది.