YSRCP Kapu Plan : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి జనసేన పార్టీ నిద్ర లేకుండా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాపు సామాజికవర్గం పూర్తిగా దూరమైతే.. గెలుపుపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న వైఎస్ఆర్‌సీపీ పవన్ కల్యాణ్ దూకుడుతో టెన్షన్ పడుతోంది.దీంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంబటి రాయుడు వంటి వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా... పెద్దగా వర్కవుట్ అవడం లేదు. అవి ఎంత వరకు ఉపయోగపడినా.. కనీసం కాపు ఓట్లలో చీలిక తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పరంగా వైఎస్ఆర్‌సీపీ కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాపు ల్లో బాగంగా చెప్పుకునే  తూర్పుకాపు, శెట్టిబలిజ వంటి కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. 


కాపుల్లో ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు


 కాపు ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో విధి విధానాలను ఖరారు చేయనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  కాపుల సంక్షేమానికి ఏర్పాటయిన కాపు వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం ఉప కులాలైన తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను చేర్చారు. అయితే వీరితో పాటు తూర్పుకాపు, శెట్టిబలిజ లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు జనాభా దామాషా ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.   కాపు కార్పొరేషన్‌ పరిధిలో 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద ఆర్థిక చేయూతనందిస్తోంది.  బలిజలు,   ఒంటరి, తెలగ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ద్వారా వారిని ఆకట్టుకోవాలని నిర్ణయంచారు. 


కాపుల సంక్షేమానికి భారీగా ఖర్చు చేశామంటున్న ప్రభుత్వం
 
నాలుగేళ్లలో కాపుల సంక్షేమానికి రూ. 32 వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.  ఉత్తరాంధ్రలో తూర్పుకాపులు, శెట్టి బలిజలతో పాటు రాయలసీమలో బలిజలు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్‌తో వీరికి వెసులుబాటు కల్పించాలనేది ప్రభుత్వ భావన.  ఇప్పటికే  బీసీ ఉపకులాలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.  గత సార్వత్రిక ఎన్నికల్లో పాదయాత్ర సందర్భంగా ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞాపనలను తిరగేస్తున్నారు. ఇందులో భాగంగానే కాపు ఉప కులాల కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వమే కొంత కార్పస్‌ఫండ్‌ కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.  కొత్త కార్పొరేషన్లతో రాజకీయంగా కాపు ఓట్లలో చీలిక సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. 


పేరుకే కార్పొరేషన్లు - నిధులే ఉండవు !


ప్రభుత్వం అ  అగ్రకులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.  బీసీ కులాలకు ఏర్పాటు చేసింది. ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా..  వివిధ పథకాల కింద ఖర్చు పెడుతున్న నిధులను ఈ కార్పొరేషన్ల లెక్కల్లో చూపిస్తున్నారు తప్ప కొత్తగా నిధులు ఇవ్వడం లేదు. చివరికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఇవ్వాల్సిన నిధులను కూడా.. ఇలా అందరికీ ఇచ్చే పథకాలకిందే చూపిస్తున్నారు. దీంతో.. కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్లుగా చూపిస్తున్నారు తప్ప నేరుగా కేటాయించడం లేదు. మామూలుగా ఏదైనా సామాజిక వర్గ కార్పొరేషన్ అంటే.. ప్రత్యేకంగా నిదులు కేటాయించి.. ఆ సామాజిక వర్గ యువత ఉపాధి కోసం ఆర్థిక సాయం చేస్తారు. గత నాలుగేళ్లుగా పథకాలు తప్ప..అలాంటి సాయం ఏదీ చేయడం లేదు. అందుకే ఇలాంటి కార్పొరేషన్ల వల్ల ఉపయోగం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.