తూర్పుగోదావరి జిల్లాలో గత కొంతకాలంగా అధికార వైసీపీలో అంతర్గత రగడ తీవ్రమవుతోంది.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య లోకల్‌ వార్‌ మరీ తీవ్రమవుతోంది. గతంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ప్రెస్‌మీట్ల వేదికగా రచ్చకెక్కగా బ్లేడ్‌ బ్యాచ్‌లను మెయింటైన్‌ నువ్వు చేస్తున్నావంటే నువ్వు చేస్తున్నావంటూ సోషల్‌మీడియా వేదికగా ఆరోపణలు చేసుకున్నారు.. చివరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో ఇద్దరూ ఒకే మాటపైకి వచ్చి సఖ్యత వచ్చిందనుకుంటున్న తరుణంలో రాజమండ్రి వేదికగా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య రగడ మళ్లీ రచ్చకెక్కుతోంది.


రాజమండ్రిలో అసలేం జరిగింది.. 
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ అనుచరవర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రాజమండ్రి యువజన విభాగ అధ్యక్షుడి పదవికి పీతా రామకృష్ణ అనే వైసీపీ నాయకుడ్ని నియమించడంతో ఆయన మరింత యాక్టివ్‌ అయ్యారు. మరోపక్క రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్‌ వైసీపీ యువజన విభాగం రీజనల్‌ ఇంచార్జ్‌గా నియమించడంతో  రాజమండ్రి వేదికగా జరిగే పార్టీ కార్యక్రమాలు, ఇతర విషయాల్లో వర్గపోరు తీవ్రమయ్యింది.. రాజమండ్రి యువజన విభాగ అధ్యక్షునిగా పనిచేస్తున్న పీతా రామకృష్ణను ఎంపీ మార్గాని భరత్‌ వెంట తిప్పుకోవడం, ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో పీతా రామకృష్ణ, జక్కంపూడి అనుచరులు బాహాబాహీలకు దిగడంతో ఒక్కసారిగా వైసీపీలో అంతర్గత కుమ్ములాట మరోసారి తెరమీదకు వచ్చింది. ఇదిలా ఉంటే పీతా రామకృష్ణను హెచ్చరిస్తూ జక్కంపూడి గణేష్‌ మాట్లాడిన ఆడియో టేపులు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అందులో పరుష పదజాలంతో రామకృష్ణను జక్కంపూడి గణేష్‌ హెచ్చరించడంతో ఈవివాదానికి మరింత ఆజ్యం పోసింది. 


రాజమండ్రిపై పట్టుకోసం ప్రయత్నాలు..
రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన మార్గాని భరత్‌ 2019 ఎన్నికల్లో విజయం సాధించి పట్టుసాధించారు. అయితే అదే సమయంలో వైసీపీ తరపున రాజమండ్రి అర్బన్‌, రాజమండ్రి రూరల్‌ ఈరెండు నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలు ఓటమి చవిచూశాయి.. దీంతో అధికార పార్టీ ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌కు రాజమండ్ర్రిలో అన్నీ తానై చూసుకునే పరిస్థితి కలిగింది. మరోపక్క రాజమండ్రిలో పట్టున్న జక్కంపూడి రాజాను రాజానగరం నియోజకవర్గానికి పంపడం అక్కడ ఆయన గెలుపొందినా రాజా సోదరుడు జక్కంపూడి గణేష్‌ రాజమండ్రిపైనే దృష్టిసారించడంపై ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు నిత్యం వీరి మద్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి తలెత్తిందన్న చర్చ జరుగుతోంది..


ముఖ్యమంత్రి సమక్షంలో హెచ్చరించినా..
రాజమండ్రి ఎంపీ భరత్‌ను, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఎంపీ మిధున్‌రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ పిలిచి గట్టిగానే ఇరువురిని హెచ్చరించి సఖ్యత కుదిర్చారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఆతరువాత ఇద్దరు కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి బాగానే మాట్లాడినా మళ్లీ గత కొంతకాలంగా ఇద్దరి మద్య అంతర్గత వార్‌ బాగానే నడుస్తోందని తాజా పరిణామాలును బట్టి స్పష్టం అవుతుందంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే రాజమండ్రిలోని రెండు నియోజకవర్గాలపై పూర్తి పట్టున్న తెలుగుదేశం పార్టీ ఈ వైసీపీలోని అంతర్గత విభేధాలతో పార్టీకు తీవ్ర నష్టం జరగుతోందన్న విమర్శలు పార్టీ వర్గాలనుంచే వినిపిస్తున్నాయి..