YSRCP Rajyasabha Candidates : అసెంబ్లీ( Assembly), సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections)కు వ్యూహాలను సిద్ధం చేస్తున్న వైసీపీ... మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హిందూపురం ఎంపీ గోరంట్లమాధవ్ తో పాటు 14 మందికి అసెంబ్లీ టికెట్ నిరాకరించారు వైసీపీ అధినేత, సీఎం జగన్. మరికొందరికి కొత్త నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ మూడు స్థానాలను తన ఖాతాలో పడేలా జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు గెలడానికి బలం ఉండటంతో ముగ్గుర్ని బరిలోకి దించుతున్నారు. టీటీడీ  మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులును రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. సామాజిక సమీకరణాలతో పాటు ప్రాంతీయ లెక్కలు వేసుకున్న తర్వాత సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, అరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి పేర్లను అధికారికంగా నేడు ప్రకటించే అవకాశం ఉంది.


ఫిబ్రవరి నెలాఖరులో ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నేత, నెల్లూరు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ పదవీకాలం ఏప్రిల్‌ 3తో ముగియనుంది. దీంతో ఫిబ్రవరి నెలాఖరులో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. రాజ్యసభ ఎన్నికల ముగిసిన వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. వైసీపీకి పూర్తి బలం ఉండటంతో వారి ఎన్నిక లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ అధినేత జగన్...ఎక్కడో తేడా కొడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో వారంతా...వైసీపీ రాజ్యసభ అభ్యర్థులకు ఓట్లు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా... ఎంపీ స్థానం చేజారిపోయే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ పకడ్బందీగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి...ఈ సారి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.


మూడు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత
సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకున్న తర్వాతే... సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, అరణి శ్రీనివాసులును రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు సీఎం జగన్. ఉత్తరాంధ్ర నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, రాయలసీమ నుంచి అరణి శ్రీనివాసులు, ఆంధ్రా ప్రాంతం నుంచి టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపుతున్నారు. గొల్ల బాబురావు ఎస్సీ సామాజికవర్గం అయితే, బీసీ సామాజికవర్గం నుంచి అరణి శ్రీనివాసులు, ఓసీ సామాజిక వర్గం సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు. 


ఒకే దెబ్బకు రెండు పిట్టలు
వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపడం ద్వారా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి లైన్ క్లియర్ అయింది. 2వందల కోట్లు డిపాజిట్ చేయాలని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను తిట్టాలని కండిషన్లు పెట్టడం పోటీ చేసేందుకు వెనుకాడారు. పక్క పార్టీల నేతలకు టచ్ లోకి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి...వైసీపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తేనే...తాను ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తానని సీఎం జగన్ కు చెప్పారు. పునరాలోచనలో పడ్డ జగన్...ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఆశించిన వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. యధావిధిగా మాగుంటకు సిట్టింగ్ స్థానాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.