YS Sharmila Strong Counter To Vijayasai Reddy: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడడానికే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila).. మాజీ సీఎం జగన్‌పై నిందలు వేస్తున్నారన్న విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారూ మీరు చదివింది జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా.? అంటూ ప్రశ్నించారు. 'ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్.. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా?. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగిన వాళ్లే. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ గారి వల్ల బలపడిన వాళ్లే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే.?. YSR మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది YSR . బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరు.' అని పేర్కొన్నారు. 


'ఐదేళ్లు గాడిదలు కాశారా'


YSR మరణానికి చంద్రబాబు గారు కారణం అయితే.. మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా.? అంటూ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు.?. దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు.?. దోషులను ఎందుకు శిక్షించలేదు.?. అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు.?. ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా.?. YSR మరణం తర్వాత చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా.?. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా.?. చేయకపోతే జగన్ గారు సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు.?. ఇప్పుడు మళ్లీ  తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ గారు కాదా.? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


'ఆ పిచ్చి వీడలేదా.?'






చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవని షర్మిల అన్నారు. 'YSR తన బిడ్డ పెళ్లికి చంద్రబాబు గారిని పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీతార్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి.?. జగన్ గారికి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?. ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికో.. ఆయన  బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం YSR బిడ్డకు ఎన్నటికీ రాదని మాటిస్తున్నా.' అని పేర్కొన్నారు.


విజయసాయి ఏమన్నారంటే.?


కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ షర్మిల.. చంద్రబాబు, ఎన్డీయేతో లాలూచీ పడి జగన్‌పై వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చెల్లెలిపై ప్రేమతో ఆస్తులు రాసిస్తే షర్మిల రిటర్న్ గిఫ్ట్‌గా.. చంద్రబాబుతో లాలూచీ పడి జగన్‌ను వంచించారని అన్నారు. జగన్‌ను జైలుకు పంపడమే చంద్రబాబు, షర్మిల లక్ష్యమని ఆరోపించారు. వైఎస్ఆర్ మృతికి కారణమైన కాంగ్రెస్, చంద్రబాబుతో చేతులు కలుపుతారా.? అంటూ నిలదీశారు. ఆస్తుల విషయంలో చాలా చర్చలు జరిగాయని.. ఈ సమస్య ఇద్దరిది మాత్రమేనని అన్నారు. అయితే, ప్రత్యర్థులు రంగంలోకి దిగడంతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.


Also Read: Palasa Tension: పలాసలో హైటెన్షన్ - కాశీబుగ్గ పీఎస్‌లో వైసీపీ నేతల్ని చితక్కొట్టిన టీడీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్