YSRCP Cadre Dissatisfaction AP Politics:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  వ్యూహాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ శైలిపై క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు స్వయంగా దిగకుండా, కేవలం పరామర్శ యాత్రలు, ప్రెస్ మీట్లకే జగన్ పరిమితమవుతున్నారనే విమర్శలు కేవలం ప్రత్యర్థి వర్గాల నుంచే గాక, సొంత పార్టీ క్యాడర్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి.  

Continues below advertisement

  పరామర్శల రాజకీయం - సింపతీ వ్యూహమేనా? 

అధికారం కోల్పోయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి పర్యటనల తీరును పరిశీలిస్తే, ఎక్కువ శాతం అరెస్టు అయిన వైఎస్సార్‌సీపీ నేతలు, బాధితులు లేదా జైలులో ఉన్న నాయకులను పరామర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాల్లో పరామర్శలు అనేవి క్యాడర్‌కు ధైర్యం చెప్పడానికి ఒక మార్గం అయినప్పటికీ, ప్రజా సమస్యలపై స్వయంగా రోడ్డెక్కి నిరసన తెలపకపోవడం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రాధాన్యతలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేవలం ప్రెస్ మీట్లలో సవాళ్లు విసరడం వల్ల మీడియా కవరేజ్ వస్తుంది తప్ప, ప్రభుత్వంపై ప్రత్యక్ష రాజకీయ ఒత్తిడి పెరగదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Continues below advertisement

 జగన్ ప్రత్యక్ష పోరాటాలకు రాకపోవడానికి కారణాలు 

స్వయంగా జగన్ వీధుల్లోకి రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.  మాజీ ముఖ్యమంత్రిగా తన పర్యటనలపై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు, సెక్షన్ 30 లేదా విఐపి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను ప్రభుత్వం సాకుగా చూపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  జగన్ స్వయంగా నాయకత్వం వహించి భారీ ఆందోళనలు చేపడితే, శాంతిభద్రతల సమస్య నెపంతో కొత్తగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక సీబీఐ, ఈడీ కేసులతో పాటు ఇతర విచారణలు ఎదుర్కొంటున్నందున, కొత్త చిక్కుల్లో చిక్కుకోకుండా ఉండటానికి ఒక  కంట్రోల్డ్ ప్రొటెస్ట్  మోడల్‌ను జగన్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

 క్యాడర్‌ను ముందుంచి నాయకుడు వెనుక ఉండటం 

ప్రజా సమస్యలపై లేదా వివాదాస్పద అంశాలపై నిరసనలకు పిలుపునిచ్చినప్పుడు, ద్వితీయ శ్రేణి నాయకులను , కార్యకర్తలను రోడ్డుపైకి పంపుతున్నారు. వారు నిరసనలు తెలిపినప్పుడు పోలీసులు వారిపై కేసులు నమోదు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం లేదా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతోంది. ఆ తర్వాత జగన్ వెళ్లి ఆ నేతలను జైలులో పరామర్శిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు  పాల్పడుతోందని చూపించడానికి జగన్ ప్రయత్నిస్తున్నప్పటికీ, నాయకుడు ముందుండి నడిపించకపోవడం వల్ల శ్రేణుల్లో రక్షణ భావం లోపిస్తోంది.  జగన్ తీరుపై గ్రామ, మండల స్థాయి కార్యకర్తల్లో, ద్వితీయ శ్రేణి నాయకుల్లో పలు ప్రతికూల చర్చలు నడుస్తున్నాయి. జగన్ పిలుపుతో నిరసనలు తెలిపి కేసులు ఎదుర్కొంటున్న స్థానిక నేతలకు, పోలీసు కేసులు పెడితే రక్షణగా నిలిచే యంత్రాంగం పార్టీలో కనిపించడం లేదనే అసంతృప్తి ఉంది.   ప్రజా ఉద్యమాలకు - ప్రెస్ మీట్లకు ఉన్న తేడా 

ప్రతిపక్షంగా నిలబడాలంటే ప్రజాక్షేత్రంలో గళం విప్పడం చాలా ముఖ్యం. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి లేదా పార్టీ ఆఫీస్ నుంచి కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం, గణాంకాలతో కూడిన ప్రెస్ మీట్లు పెట్టడం మూలంగా క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య ప్రజలకు కనెక్ట్ కావడం కష్టం. పాదయాత్రలు లేదా స్వయంగా నిరసన ప్రదర్శనల్లో జగన్ పాల్గొంటే వచ్చే  పొలిటికల్ మైలేజ్ , ప్రెస్ మీట్ల ద్వారా రాదు. ప్రతిపక్ష నాయకుడు నేరుగా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తేనే కార్యకర్తల్లో ఉత్సాహం నిండుతుంది.

ఎన్నికలకు ఎడాది ముందు పాదయాత్ర ప్రస్తుతానికి పరామర్శలు - ప్రెస్ మీట్లు  అనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఎన్నికల వేడి పెరిగే కొద్దీ ఈ విధానం పార్టీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. కేవలం తమ పార్టీ నేతలపై జరుగుతున్న అరెస్టలపై మాత్రమే పరామర్శలు చేయడం కాకుండా, అణగారిన వర్గాలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలపై జగన్ స్వయంగా రోడ్డెక్కితేనే వైఎస్సార్‌సీపీ మళ్లీ తన పునాదులను బలపరుచుకోగలదు. అలా కాకుండా క్యాడర్‌ను ముందుకు నెట్టి, నాయకుడు వెనుక ఉండి విమర్శలు చేస్తే, కీలక నాయకులు,  ద్వితీయ శ్రేణి కార్యకర్తలు భవిష్యత్తులో నిరసనలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.