YS Jagan Regional Strategy : ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కోసం మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్ను నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమకు హక్కుల పేరుతో రాయలసీమ ధర్మాగ్రహ పోరాటం నడుస్తుంటే, మరోవైపు ఉత్తరాంధ్రలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర ప్రత్యేక ఉద్యమం తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో గతంలో చేపట్టిన తరహా వ్యూహాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
ఇతర ప్రాంతాలకు అన్యాయం అనే భావన
వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ఎంచుకున్న ఈ రీజినల్ కార్డు వెనుక ప్రాథమిక వ్యూహం స్పష్టంగానే ఉంది. రాజధాని అమరావతిపై చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమితమైన ప్రాధాన్యత ఇస్తుండటంతో, కోస్తాంధ్ర మినహా మిగిలిన రెండు కీలక ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో తమకు అన్యాయం జరుగుతోంది అనే భావనను బలంగా నాటడం వైసీపీ వ్యూహం. ఆయా ప్రాంతాల్లో కోల్పోయిన తమ ఓటు బ్యాంక్ను మళ్లీ ఏకీకృతం చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఫెయిలైన ప్రాంతీయవాదం
అయితే, ఈ ప్రాంతీయ రాజకీయం వైసీపీకి పొలిటికల్ అడ్వాంటేజ్ ఇస్తుందా అంటే.. దీన్ని ఒక భారీ వ్యూహాత్మక తప్పిదం గా కూడా చూడవచ్చని అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానుల ఫార్ములాను మూడో ప్రాంతాల ప్రజలు కూడా తిరస్కరించిన దాఖలాలు స్పష్టంగా కనిపించాయి. విశాఖను రాజధాని చేస్తామని చెప్పినా ఉత్తరాంధ్రలో, సీమకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినా రాయలసీమలో వైసీపీకి ఆశించిన సీట్లు రాలేదు. పైగా, రాష్ట్రాన్ని మళ్లీ ప్రాంతాల వారీగా ముక్కలు చేసే విధంగా మాట్లాడటం వల్ల విభజన రాజకీయం చేస్తున్నారనే ప్రతికూల ప్రచారం పొరుగు జిల్లాల్లో బలంగా వ్యాపించే ప్రమాదం ఉంది.
ఐదేళ్లలో పెద్దగా జరగని పనులు పెద్ద మైనస్
మరో కీలకమైన అంశం ఏమిటంటే, అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాలు, కడప స్టీల్ ప్లాంట్ లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రాజెక్టులపై ఎందుకు స్పష్టమైన ప్రగతి చూపించలేకపోయారనే ప్రశ్నలకు వైసీపీ వద్ద తగిన సమాధానాలు లేవు. స్వయంగా ఐదేళ్లు సీఎంగా ఉండి, సకల అధికారాలు ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధిని, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ప్రత్యేక పోరాటాలు , ప్రాంతీయ ఉద్యమాలు పేరుతో రోడ్డెక్కడం పట్ల తటస్థ ఓటర్లలో అసహనం కనిపిస్తోంది. ఇది కేవలం అధికారం కోల్పోవడంతో రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న సెంటిమెంట్ నాటకం గానే ప్రచారంలోకి వెళ్తోంది.
సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం
సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి దశాబ్దం దాటినా, ఇంకా రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విడదీస్తూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అని రచ్చ చేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, పెట్టుబడులు దెబ్బతింటాయనే ఆందోళన ఐటీ ఉద్యోగులు, యువతలో వ్యక్తమవుతోంది. తెలంగాణ మాదిరిగా ఉత్తరాంధ్ర లేదా సీమ సెంటిమెంట్ను రగిల్చి పబ్బం గడుపుకోవాలనే ఆలోచన ఏపీ సమాజంలో వర్కవుట్ కాదని, ప్రశాంతమైన వాతావరణం కావాలని ఆశిస్తున్న మెజారిటీ పౌరుల నుండి తీవ్ర కౌంటర్లు ఎదురవుతున్నాయి.
కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేలా అమరావతి అభివృద్ధితో పాటు, విశాఖకు టీసీఎస్ లాంటి ఐటీ దిగ్గజాలు, రాయలసీమకు ఆటోమొబైల్, సోలార్ ప్రాజెక్టులు కేటాయిస్తూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మంత్రం జపిస్తోంది. ఈ పరిణామాల మధ్య వైసీపీ అనుసరిస్తున్న ప్రాంతీయ వైషమ్యాల వ్యూహం, సొంత పార్టీకి ఉత్తరాంధ్ర, సీమలోనే కాకుండా మధ్య కోస్తాలో కూడా తీవ్ర రాజకీయం నష్టం కలిగించే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
