Why YSRCP Senior Leaders Are Silent After Election: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు, ప్రజా క్షేత్రంలో కదలికలు తగ్గడంతో.. పార్టీలోని ద్వితీయ శ్రేణి, ముఖ్యంగా సగానికి పైగా సీనియర్ నాయకులు పూర్తిగా  ఫీల్డ్ కు దూరమయ్యారు. సిక్కోలు నుంచి నెల్లూరు వరకు, అటు రాయలసీమ కోటల వరకు ఒకప్పుడు ఉద్దండ పిండాలుగా వెలిగిన వైసీపీ సీనియర్లు ఇప్పుడు నియోజకవర్గాల్లో ముఖం చాటేస్తున్నారు. పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కుదరకపోవడమా? లేక మారుతున్న రాజకీయ సమీకరణాలతో గోడ మీద పిల్లి  వాటంగా వ్యవహరిస్తున్నారా?  

Continues below advertisement

 ప్రెస్ మీట్లకే పరిమితమైన  యాక్టివిజం 

ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్న కొద్దిమంది నేతలు సైతం కేవలం తాడేపల్లి కేంద్రంగా లేదా వారి వ్యక్తిగత కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టడానికే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలబడటం వంటి పనులకు వీరు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కేవలం మైకుల ముందు ఘాటు విమర్శలు చేసి, సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలవడమే రాజకీయం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది.

Continues below advertisement

 వారసుల భవిష్యత్ కోసం గోడ మీద పిల్లి  వాటం 

ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు గమనిస్తే.. చాలా మంది సీనియర్ నేతలకు తమ రాజకీయ ప్రస్థానం ముగింపు దశకు చేరింది. ఇప్పుడు వారి ప్రధాన ఆందోళన అంతా తమ వారసుల రాజకీయ భవిష్యత్తు గురించే. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ తరఫున గట్టిగా నిలబడి అధికార కూటమి పై పోరాడితే, భవిష్యత్తులో తమ వారసులకు పొలిటికల్ కెరీర్ లేకుండా పోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే అధికార పక్షంతో అనవసరమైన వైరాన్ని కొనితెచ్చుకోకుండా, తమ వ్యాపారాలను, ఆస్తులను కాపాడుకుంటూ  అండర్ ప్లే చేస్తున్నారనేది స్పష్టమవుతోంది.

 రాయలసీమలోనూ అండర్ ప్లే రాజకీయం 

వైసీపీకి కంచుకోట లాంటి రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫ్యాక్షన్, పంతాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే సీమ నియోజకవర్గాల్లో చాలా మంది మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా సైలెంట్ అయిపోయారు. క్యాడర్‌ను కాపాడుకోవడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అధికార పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకుంటూ, లో ప్రొఫైల్ మెయింటెన్ చేయడం ద్వారా ప్రస్తుత గండం నుంచి గట్టెక్కవచ్చనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అవసరమైతే తప్ప బయటకు రాకూడదనే ఒక అలిఖిత నిబంధనను వారు పెట్టుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

 జగన్ ఫుల్ టైమ్ రాకపోవడమే ప్రధాన మైనస్ 

నాయకులలో ఈ స్థాయి స్తబ్దత రావడానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శైలి కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పూర్తిగా వీధుల్లోకి వచ్చి, నిరంతరాయంగా ప్రజా పోరాటాలు చేయకపోవడంతో కింది స్థాయి నేతలకు కూడా ఆ అవసరం కనిపించడం లేదు. అధినేతే తాడేపల్లి ,  బెంగళూరు ప్యాలెస్‌లకే పరిమితమైతే, తాము మాత్రం రోడ్లెక్కి కేసులు ఎందుకు పెట్టించుకోవాలనే ధోరణి సీనియర్లలో బలంగా నాటుకుపోయింది. లీడర్ షిప్ నుంచి స్పష్టమైన యాక్షన్ ప్లాన్, భరోసా లేకపోవడమే ఈ రాజకీయ శూన్యతకు ప్రధాన కారణం.

 మంచి అవకాశం వస్తే  జంప్ అయ్యేందుకేనా? 

ఈ సుదీర్ఘ నిశ్శబ్దం వెనుక మరో పెద్ద వ్యూహం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం తటస్థంగా ఉంటూ, రాబోయే రోజుల్లో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వైపు దూకేందుకు  వీరు మానసికంగా సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఏవైనా అసంతృప్తులు తలెత్తినా లేదా కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చినా.. తమకు అనుకూలమైన పార్టీలోకి మారిపోయేందుకు వీలుగానే వీరు ఏ పార్టీని తీవ్రంగా దూషించకుండా సేఫ్ గేమ్  ఆడుతున్నారు. సరైన సమయం, సరైన అవకాశం వస్తే వీరంతా వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.

 ఈ పరిస్థితి మారకపోతే కష్టమే.. 

వైసీపీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ  సైలెంట్ మోడ్ వ్యూహం ఎంతమాత్రం పనికిరాదు. జగన్ వెంటనే ఫీల్డ్‌లోకి వచ్చి సీనియర్లలో నమ్మకాన్ని, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాల్సి ఉంది. అలా కాకుండా ఇదే స్తబ్దత మరికొన్ని నెలలు కొనసాగితే, రాబోయే రోజుల్లో వైసీపీ కేవలం బోర్డులకే పరిమితమై, నేతలంతా ఇతర పార్టీల వైపు వలస వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో పోరాడేవాడే నాయకుడిగా నిలబడతాడు తప్ప, గోడ మీద పిల్లిలా ఉంటే రాజకీయం పిల్లిమొగ్గలు వేయడం ఖాయమని రాజకీయవర్గాలు అంచనా  వేస్తున్నాయి.