AP Political Realignment news: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పంథాలో పెను మార్పు కనిపిస్తోంది. ఢిల్లీ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉంటూ, వివాదాస్పద బిల్లుల విషయంలోనూ బీజేపీకి అండగా నిలిచిన జగన్, ఇప్పుడు రూటు మార్చారు. రాష్ట్రంలో తన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా ఆయన ఎంచుకున్న ఎస్ఐఆర్ అంశం, ఇప్పుడు ఆయనను జాతీయ రాజకీయాల వైపు నడిపిస్తోంది. అమరావతి వేదికగా జరిగిన వర్క్‌షాప్‌లో జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన ఎన్డీయే నీడ నుంచి బయటకు వచ్చి, జాతీయ స్థాయి ప్రాంతీయ శక్తులతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Continues below advertisement

తమిళనాడు, బెంగాల్ ఉదాహరణలతో కొత్త పల్లవి 

నిన్నటి వరకు కేంద్రం వేసే ప్రతి అడుగును సమర్థించిన జగన్, ఇప్పుడు అదే కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను శంకిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ ఎదుర్కొన్న  ఓట్ల తొలగింపు  సమస్యలను ఆయన ప్రస్తావించారు. అక్కడ లక్షలాది మంది జెన్యూన్ ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి.. ఇప్పుడు ఏపీలోనూ అదే కుట్ర జరుగుతోంది  అని జగన్ వ్యాఖ్యానించడం ద్వారా, నేరుగా అమిత్ షా పర్యవేక్షణలోని వ్యవస్థలనే టార్గెట్ చేశారు. ఇది కేవలం రాష్ట్ర స్థాయి విమర్శ కాదు.. జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలకు వ్యతిరేకంగా గళం విప్పడం ద్వారా తాము కూడా  యాంటీ-బీజేపీ క్యాంపులో చేరుతున్నామనే హింట్‌ను ఆయన ఇచ్చారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 

Continues below advertisement

రాజకీయ పునర్వ్యవస్థీకరణ   జగన్ రెడ్డి తీసుకున్న ఈ  యూ-టర్న్  వెనుక బలమైన కారణం ఉంది. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్డీయేలో కీలకంగా మారడంతో, ఇక మీదట కేంద్రం నుంచి వైసీపీకి లభించే రాజకీయ రక్షణ దాదాపుగా ఉండదని ఆయన గ్రహించారు. ఈ క్రమంలో ఒంటరిగా పోరాడటం కంటే, జాతీయ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రాంతీయ శక్తులతో గళం కలపడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈ పార్టీలన్నీ ఇప్పటికే యుద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు జగన్ కూడా వీరితో గొంతు కలపడం వల్ల జాతీయ స్థాయిలో వైసీపీకి ఒక కొత్త వేదిక లభించనుంది.

 ఢిల్లీలో వైసీపీ గొంతు మారుతుందా? 

ఇప్పటివరకు రాజ్యసభలో బీజేపీకి అవసరమైన మెజారిటీని అందిస్తూ వచ్చిన వైసీపీ, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వ్యతిరేక గళం వినిపిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎస్ఐఆర్ అంశంపై పార్లమెంట్ లోపల ఇండియా బ్లాక్ నేతలతో కలిసి వైసీపీ పోరాడితే.. అది జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద రియలైన్‌మెంట్ అవుతుంది.  నేను ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాను  అని చెప్పే జగన్, ఇప్పుడు రాష్ట్రంలో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జాతీయ విపక్షాల అండను కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

 కేడర్ మోరల్ పెంచే వ్యూహం

ఓటమి భారంతో కుంగిపోయిన వైసీపీ కేడర్‌లో  ఎస్ఐఆర్  పేరుతో పోరాట పటిమను నింపాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.  మన ఓట్లను దొంగిలిస్తున్నారు.. కాపాడుకుందాం రండి అనే నినాదం ద్వారా కార్యకర్తలను మళ్లీ జనాల్లోకి పంపేందుకు ఇది ఒక మంచి సాకుగా ఉపయోగపడనుంది. గ్రాస్ రూట్ లెవల్‌లో ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఒక ఉద్యమంలా చేపట్టాలని ఆయన పిలుపునివ్వడం వెనుక.. పార్టీని మళ్లీ క్రియాశీలకంగా మార్చాలనే తపన కనిపిస్తోంది.  జగన్ తన రాజకీయ చదరంగంలో 'ఎస్ఐఆర్' అనే అస్త్రాన్ని ప్రయోగించి అటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, ఇటు జాతీయ స్థాయిలో ఎన్డీయే అగ్ర నాయకత్వాన్ని రక్షణలో పడేశారు. పార్లమెంట్‌లో మిత్రుడిగా ఉన్న నేత, ఇప్పుడు బయట శత్రువుగా మారడం పట్ల బీజేపీ అగ్రనాయకత్వం ఎలాంటి ప్రతివ్యూహం రచిస్తుందనేది వేచి చూడాలి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాలనే కాకుండా, ఢిల్లీలోని కూటమి సమీకరణాలను సైతం మార్చేలా కనిపిస్తోంది.