YS Jagan BJP Permanent Frieendship:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు అధికారంలో ఉన్న కూటమిపై విమర్శలు ఎక్కుపెడతాయి. కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అటు కేంద్రంలోని బీజేపీతో, ఇటు ఏపీలోని కూటమితో భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి జగన్ పర్మినెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా అన్నట్లుగా వస్తున్న వార్తలను వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.  ఎన్డీఏ కూటమిలో భాగం కాకపోయినప్పటికీ, ఎన్నికల్లో బీజేపీ అండతో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఎదుర్కొంటూనే.. బీజేపీ అగ్రనేతలతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు కనిపిస్తున్నాయి.

Continues below advertisement

 కేసుల భయం.. 

జగన్ మోహన్ రెడ్డిపై పదిహేనేళ్ల నుంచి  నడుస్తున్న సీబీఐ, ఈడీ కేసులే ఆయనను బీజేపీకి ఎదురెళ్లకుండా ఆపుతున్నాయన్నది  ప్రధాన వాదన. కేంద్రంలోని పెద్దల ఆగ్రహానికి గురైతే ఈ కేసులు వేగం పుంజుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఎన్నికల్లో తగిలిన ఘోర పరాజయానికి బీజేపీ కూడా ఒక కారణమే అయినప్పటికీ, జగన్ తన విమర్శలను కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకే పరిమితం చేస్తున్నారు. బీజేపీని విమర్శించకపోవడం ద్వారా కేంద్రం నుంచి ఒక రకమైన  రక్షణ కవచాన్ని ఆశిస్తున్నట్లు కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.  

Continues below advertisement

 మిత్రత్వం వెనుక మైండ్ గేమ్ 

 బీజేపీ మాకు మిత్రుడే అని వైసీపీ ప్రచారం చేసుకోవడం వెనుక మరో కోణం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అయితే, బీజేపీకి జగన్ కూడా పర్మినెంట్ ఫ్రెండ్  అని చెప్పడం ద్వారా.. కూటమిలో చిచ్చు పెట్టాలనేది వైసీపీ వ్యూహం . మీరు కూటమిలో ఉన్నా, మాకు ఢిల్లీలో పట్టుంది అని కేడర్‌కు భరోసా ఇవ్వడం ద్వారా పార్టీ నుంచి వలసలను అడ్డుకోవాలని జగన్ భావిస్తున్నారు. అయితే, ఈ డబుల్ గేమ్ ఎంతవరకు పారుతుందన్నది సందేహమే.

 ఓటు బ్యాంకుకు పెను ముప్పు? 

రాజకీయంగా చూస్తే, బీజేపీతో సాన్నిహిత్యం వైసీపీకి పెద్ద నష్టం కలిగించే అవకాశం ఉంది. వైసీపీకి సంప్రదాయంగా ఉన్న   ముస్లిం, క్రైస్తవ మ, దళిత ఓటు బ్యాంకు వ్యతిరేకమవుతుంది.  గత ఎన్నికల్లోనే మైనారిటీ ఓటర్లు కొంతమేర వైసీపీకి దూరమైనట్లు కాంగ్రెస్‌కు పెరిగిన ఓటింగ్ నిరూపించింది.  ఇప్పుడు మళ్ళీ తామే  శాశ్వత మిత్రులం అని ప్రచారం చేసుకోవడం ద్వారా.. మైనారిటీలను పూర్తిగా వ్యతిరేకం చేసుకునే ప్రమాదం ఉంది. ఇది వైసీపీ పునాదులనే కదిలించే వ్యూహాత్మక తప్పిదం  అయ్యే అవకాశం ఉంది. శాసనసభలో విపక్ష హోదా కూడా లేని ప్రస్తుత తరుణంలో, జగన్ అనుసరిస్తున్న ఈ   వైఖరి  పార్టీ శ్రేణుల్లో అయోమయానికి గురిచేస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంటే, మరోవైపు కేంద్రం మద్దతు కూడగట్టలేక, అలాగని కేంద్రాన్ని ఎదిరించలేక వైసీపీ సతమతమవుతోంది.  

 వ్యూహాత్మక తప్పిదమా? 

రాజకీయ విశ్లేషకుడు ఒకరు చేసిన  అమిత్ షా  చేసినట్లుగా ప్రచారం చేస్తున్న  వ్యాఖ్యలను వైరల్ చేయడం వెనుక వైసీపీ ఉద్దేశం.. కూటమి నేతల్లో అభద్రతా భావం నింపడమే కావచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు దీనిని భిన్నంగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాబట్టలేకపోయారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా బీజేపీ భజన చేయడం వల్ల ప్రయోజనం లేదని సామాన్య ఓటర్లు భావించే ప్రమాదం ఉంది.  వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఈ ప్రచారం ఒక  రెండంచుల కత్తి  లాంటిది. ఢిల్లీలో తన పట్టును నిరూపించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నా, అది కాస్తా తన సొంత ఓటు బ్యాంకును దూరం చేసే దిశగా వెళ్తోంది. బీజేపీతో స్నేహం వల్ల జగన్‌కు వ్యక్తిగతంగా కేసుల పరంగా ఊరట లభించవచ్చేమో కానీ, రాజకీయంగా మాత్రం వైసీపీకి ఇది పెద్ద గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ  పర్మినెంట్ ఫ్రెండ్షిప్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.