Jayalalithaa Legacy Thalapathy Vijay:  తమిళనాడు రాజకీయాల్లో ఆరు దశాబ్దాల ద్రవిడ దిగ్గజాల  ఏకఛత్రాధిపత్యానికి గండికొడుతూ,  తమిళగ వెట్రి కజగం అధినేత, నూతన ముఖ్యమంత్రి దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 34.92 శాతం ఓట్ల షేర్‌తో 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత అనుభవించిన అపారమైన ప్రజాధరణను ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ తన సొంతం చేసుకున్నారు. అన్నాడీఎంకే  నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, ఆ పార్టీ కేడర్ ,  ఓటర్లకు విజయ్ ఒక ఆశాకిరణంలా కనిపించారు.  అమ్మ ఆశయాలను, ప్రజా రంజక పాలనను నేనే ముందుకు తీసుకెళ్తాను అనే నినాదంతో ఆయన నేరుగా అన్నాడీఎంకే సాంప్రదాయ ఓటు బ్యాంకుపై గురి పెట్టారు.  

Continues below advertisement

అన్నాడీఎంకేకు  వార్నింగ్  బెల్  

అసెంబ్లీ విశ్వాస పరీక్షలో విజయ్ ప్రదర్శించిన రాజకీయ తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తన ప్రభుత్వానికి మెజార్టీ తగ్గకుండా ఉండటమే కాకుండా, విపక్ష అన్నాడీఎంకేను ఆయన కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. ఎడప్పాడి పళనిస్వామి  నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి విజయ్ వైపు నిలబడటం తమిళనాట ఒక చారిత్రాత్మక మలుపు. ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం వంటి అగ్రనేతల వర్గం విజయ్‌కు జై కొట్టడం చూస్తుంటే.. అన్నాడీఎంకే శకం ముగిసిందని, ఆ పార్టీలోని శక్తివంతమైన వర్గాలన్నీ ఇక శాశ్వతంగా టీవీకే గూటికి చేరిపోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

 పథకాలతో  అమ్మ సెంటిమెంట్‌కు జవజీవాలు 

విజయ్ కేవలం రాజకీయంగానే కాకుండా, పాలనాపరంగా కూడా జయలలిత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గత డీఎంకే హయాంలో నిర్లక్ష్యానికి గురైన  అమ్మ క్యాంటీన్ల ను తిరిగి ప్రారంభించడమే కాకుండా, వాటిని అత్యంత ఆధునికీకరించి పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన  వెంటనే నిర్ణయం తీసుకోవడం ద్వారా.. తాను జయలలితకు అసలైన రాజకీయ వారసుడిని అని విజయ్ నిరూపించుకున్నారు.  తమిళనాడులో డీఎంకేను వ్యతిరేకించే ఓటు బ్యాంకు ఎప్పుడూ ఒక పార్టీని బలంగా నిలబెడుతుంది. గతంలో ఆ పాత్రను అన్నాడీఎంకే పోషించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని విజయ్ ఆక్రమించారు.  స్టాలిన్, ఉదయనిధిల నేతృత్వంలోని డీఎంకేను ఎదుర్కోగల ఏకైక శక్తి టీవీకే మాత్రమేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

 సిద్ధాంతాల కలయిక - ద్రవిడ జాతీయవాదం 

విజయ్ తన సిద్ధాంతాన్ని  ద్రవిడ జాతీయవాదం, సామాజిక న్యాయం గా ప్రకటించడం ఒక మాస్టర్ స్ట్రోక్. ద్రవిడ పార్టీల అవినీతిని, వారసత్వ రాజకీయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారే తప్ప.. తమిళ అస్తిత్వానికి మూలమైన పెరియార్, అంబేద్కర్ ఆశయాలకు తాను వ్యతిరేకం కాదని చాటారు. తన ప్రచార పటాల్లో పెరియార్, కామరాజ్ వంటి మహానుభావుల చిత్రాలను ఉంచడం ద్వారా ద్రవిడ ఓటర్ల మనసు గెలుచుకున్నారు. కేవలం సోషల్ మీడియా హైప్‌తోనే విజయ్ గెలిచారనే విమర్శలను తుడిచిపెట్టి, క్షేత్రస్థాయిలో అన్నాడీఎంకేను కనుమరుగు చేస్తూ విజయ్ ఒక నూతన ద్రవిడ శకానికి నాంది పలికారు.