YCP leaders are being arrested only after giving all legal opportunities : తెలుగుదేశం పార్టీ నేతలు ఐదేళ్లలో అనుభవించిన కేసులు, అరెస్టులు, కష్టాలను గుర్తుకు తెచ్చుకుంటే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది  దాదాపు సున్నా అనుకోవచ్చు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల్లో చాలా మంది ఇప్పటికీ అసభ్యంగా , ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఏ ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్న  దాఖలాలు లేవు. ఎవరినైనా అరెస్టు చేసినా  నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. ఈ కారణంగా టీడీపీ సోషల్ మీడియా టీముల్లో అసంతృప్తి కనిపిస్తోంది. కానీ అలా చేయడానికి .. ఆ నేతల్ని.. సోషల్ మీడియా కార్యకర్తల్ని ప్లాన్డ్ గా బుక్ చేయడానికేనన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి తాజా సాక్ష్యం.. దాడుల కేసుల్లో వైసీపీ నేతలకు అరెస్టు కావడం మినహా మరో మార్గం లేకపోవడం. 


అరెస్టు భయంతో వైసీపీ ముఖ్య నేతలు 


మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో కీలక నేత, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. ఆచూకీ తెలిస్తే దేవినేని అవినాష్, జోగి రమేష్ వంటి మరో పది మంది కీలక నేతల్ని అరెస్టు చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డికీ అరెస్టు భయం ఉందన్న గుసగుసలు వినిపిస్తన్నాయి. ఇప్పటికే పలు విచారణలను సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు. వైసీపీ హయాంలో అంతా బహిరంగంగానే అవినీతి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి క్లారిటీ వస్తోంది.


వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు - పరారీలో ఉండగా పట్టుకున్న పోలీసులు


న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయిన తర్వాతే అరెస్టులు


టీడీపీ  కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో ప్రభుత్వం మారగానే కదలిక వచ్చింది. పోలీసులు సీసీ ఫుటేజీ , కాల్ రికార్డులు బయటకు తీసి కీలక వ్యక్తుల్ని నిందితులుగా మార్చారు. అయితే వైసీపీ హయాంలో జరిగినట్లుగా అర్థరాత్రి అరెస్టులు చేయలేదు. వారికి న్యాయపరమైన అన్ని అవకాశాలను కల్పించారు. ముందస్తు బెయిల్ కోసం.. అరెస్టు నుంచి రక్షణ కోసం ప్రయత్నించి విఫలమైన తర్ాతనే రంగంలోకి దిగారు. అంటే ఇప్పుడు వారు అరెస్టు నుంచి డిఫెండ్ చేసుకోవడానికి తప్పుడు కేసులు అని వాదించడానికి అవకాశం లేదు. అంతే కాదు కక్ష సాధింపు అని కూడా చెప్పలేరు. ఎందుకంటే.. చట్ట ప్రకారమే అన్నీ చేశారు కానీ ఎక్కడా గీత దాటలేదని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితి వస్తే వారికి జైలుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు కక్షసాధింపులన్న  విమర్శలు రావు..  దాడులకు పాల్పడిన వారిని జైలుకు పంపినట్లవుతుంది. 


అరెస్ట్ భయంతో ఆజ్ఞాతంలో వైసీపీ ముఖ్య నేతలు - ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు


ముందు ముందు ఇదే వ్యూహం


వైసీపీ నేతలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. పలు అంశాల్లో సీఐడీ విచారణ కూడా జరుపుతోంది. మద్యం, ఇసుక స్కాముల్లో పెద్ద తలకాయలే ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారిని కూడా కక్ష పూరితంగా జైలుకు పంపాలన్న లక్ష్యంతో కాకుండా.. చట్టబద్ధంగా అన్ని అవకాశాలు కల్పించి.. ఇక దారి లేని పరిస్థితుల్లో అరెస్టు కావడం తప్ప మరో ఆప్షన్ లేదన్న స్థితికి తీసుకు వచ్చి అరెస్టు చేయాలనుకుంటున్నారు. అప్పటికీ వారిపై పెట్టిన కేసుల్లో ప్రజల్లో చర్చ జరుగుతుందని వారికీ నిజాలు తెలుస్తాయని.. భావిస్తున్నారు.  చట్ట ప్రకారం వ్యవస్థ నడుస్తోందని ప్రజలకు నమ్మకం కలిగించడం ముఖ్యమని.. ఆ దిశగానే చర్యలు ఉంటాయని మొదటి నుంచి చెబుతున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. 


వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని కూడా.. గీత దాటుతున్నా.. అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. వారు ఆ తప్పుల్ని పదేపదేచేస్తే.. కోలుకోలేని దెబ్బను చట్టపరంగా కొట్టడానికే అవకాశాలు కల్పిస్తున్నారని..ఈ వ్యూహాన్ని వారు ఊహించలేకపోతున్నారని భావిస్తున్నారు. మొత్తంగా రాజకీయాల్లో ఆవేశం..ఈగోలు ముఖ్యం కాదన ఆలోచనతోనే ప్రత్యర్థుల్ని  దెబ్బకొట్టాలన్న వ్యూహాన్ని టీడీపీ పాటిస్తోంది.