Tamil Nadu Assembly Elections: తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీతో ఒక సంచలనంలా మెరిసినప్పటికీ, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ క్షేత్రస్థాయిలో ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లు ఆయన్ని వెనుకబడిపోయేలా చేస్తున్నాయి.  ఏప్రిల్ 23, 2026న జరగనున్న పోలింగ్‌కు ముందు తమిళనాడు రాజకీయ చిత్రం ప్రధానంగా DMK-నేతృత్వంలోని కూటమి ,  AIADMK-BJP కూటమి మధ్యే కేంద్రీకృతమైంది.  

Continues below advertisement

ఒంటరి పోరు - అతివిశ్వాసమా? వ్యూహలోపమా?

విజయ్ తన పార్టీని స్థాపించినప్పటి నుండి ఎటువంటి కూటముల్లో చేరకుండా 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో గత 50 ఏళ్లుగా ఏదో ఒక ప్రధాన ద్రావిడ పార్టీతో కూటమి లేకుండా గెలవడం అసాధ్యమనేది చరిత్ర చెబుతున్న సత్యం. విజయ్ ఈ విషయాన్ని విస్మరించి, కేవలం తనకున్న  స్టార్ ఇమేజ్  తోనే గట్టెక్కవచ్చని భావించడం ఆయనకు పెద్ద మైనస్ అయింది. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు లేకపోవడం, జిల్లాల్లో బలమైన రెండో శ్రేణి నాయకత్వం కరువవ్వడం విజయ్ పార్టీని బలహీనపరుస్తోంది.

Continues below advertisement

ఓట్ల చీలిక - స్టాలిన్‌కు వరమా?                      

విజయ్ ప్రధానంగా DMKని తన బద్ధశత్రువుగా ప్రకటించుకున్నారు. అయితే, విశ్లేషకుల ప్రకారం విజయ్ చీల్చే ఓట్లు ప్రతిపక్షమైన AIADMK లేదా తటస్థ ఓటర్లవే అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అంతిమంగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కే మేలు జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. విజయ్‌ను బి-టీమ్ గా చిత్రీకరించే ప్రయత్నం కూడా జరుగుతోంది, ఇది తటస్థ ఓటర్లలో సందిగ్ధతను పెంచుతోంది.

కూటముల బలం - విజయ్ ఏకాకి

ప్రస్తుతం DMK కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి బలమైన భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. అటు AIADMK కూడా BJP , PMK వంటి పార్టీలతో పటిష్టమైన పొత్తు కుదుర్చుకుంది. ఈ రెండు పెద్ద కూటముల మధ్య విజయ్ ఒక  X-Factor  గా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. విజయ్ కనీసం 15-20% ఓట్లు సాధించినా, అవి సీట్లుగా మారే అవకాశం తక్కువని, కేవలం కింగ్ మేకర్ కావాలని ఆయన ఆశించినా అది కూడా కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి.

అనుభవలేమితోనే సమస్య 

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా విజయ్ కీలక రాష్ట్ర సమస్యలపై  స్పష్టమైన వైఖరి తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం అవినీతి నిర్మూలన అనే సాధారణ నినాదంతో ఓట్లు పడవని, ప్రజలకు ఒక  విజన్  చూపించడంలో ఆయన విఫలమయ్యారని తమిళ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో జరిగిన ఒక తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ వంటి చట్టపరమైన చిక్కులు కూడా ఆయన ప్రచార సమయాన్ని వృధా చేశాయి. విజయ్ సభలకు జనం విపరీతంగా వస్తున్నా, ఆ జనం ఓట్లుగా మారుతారా అనేది పెద్ద ప్రశ్న. ఎంజీఆర్, జయలలిత కాలం నాటి సినిమా గ్లామర్ పాలిటిక్స్ ఇప్పుడు పని చేయడం లేదు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక లాంగ్ టర్మ్ ' ప్రాజెక్టుగా భావిస్తే ఈ ఎన్నికలు ఆయనకు ఒక పాఠంలా మిగులుతాయి.