Telangana Leaders Language:  తెలంగాణ అసెంబ్లీలో  దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు మాట్లాడిన బాషను విన్న ప్రజలు అవాక్కయ్యారు. మొదటి వారం రోజుల పాటు సజావుగా సాగిన సమావేశాలు చివరికి వచ్చేసరికి దారి తప్పినట్లుగా మారాయి. చివరి రోజు దానం నాగేందర్ అత్యంత ఘోరంగా మాట్లాడారు. పైగా అవి వాడుక పదాలేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఉపసంహరించుకున్నప్పటికీ.. అవి ప్రజల్లోకి వెళ్లిపోయాయి. చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే ఏపీలో ఐదేళ్ల పాటు ఇదే భాష విచ్చలవిడిగా వినిపించింది. అలాంటి నేతలకు.. ఆ భాషను ప్రోత్సహించిన పార్టీకి అక్కడి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. తేరుకోకుండా దెబ్బకొట్టారు. కానీ ఈ గుణపాఠాన్ని  నేర్చుకోవడంలో తెలంగాణ నేతలు విఫలమయ్యారు. 


కాంగ్రెస్ పార్టీని ఇ్బబందుల్లోకి నెట్టిన దానం నాగేందర్ 


తెలంగాణ అసెంబ్లీలో దానం నాగేందర్  బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు  బెదిరింపులు ఏపీలో కొంత మంది వైసీపీ నేతల్ని గుర్తుకు తెచ్చాయి.   వైసీపీ హయాంలో ఏపీ అసెంబ్లీలో మాత్రమే చూసిన లాంగ్వేజ్ ను ఆయన  తెలంగాణ అసెంబ్లీకి తీసుకు వచ్చారన్న విమర్శలు వచ్చాయి.  తాను అన్నీ సాధారణ వాడుక భాషనే వాడానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.  దానం నాగేందర్   అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆ పార్టీ  బీఫాం ఇస్తే గెలిచారు.  ఇది రెండో సారి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ ఆయనకు రెండు సార్లు టిక్కెట్ ఇచ్చింది.   ఇప్పుడు కూడా ఆయన అఫీషియల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ ఆ పార్టీ నేతలపైనే   బూతులు అందుకున్నారు. గెలిచిన పార్టీని అసెంబ్లీలో అలా తిట్టడం.. సభ్యుల్ని  బెదిరించడం ఆయనను  పార్టీలో చేర్చుకున్న పార్టీ నేతలకు కూడా ఇబ్బందికరంగానే మారింది.    


ఎల్ఆర్ఎస్‌పై తాజా అప్ డేట్ - మూడు నెలలోనే పూర్తి - తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం


తరచూ గీత దాటి విమర్శలు చేస్తున్న కౌశిక్ రెడ్డి 


కాంగ్రెస్ లోనే కాదు.. బీఆర్ఎస్ లోనూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా ఉంది. ఆయన మహిళా నేతలపై తరచూ అనుచిత వ్యాఖ్యలు  చేస్తూనే ఉన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే సీతక్కపై అనుచితంగా మాట్లాడినట్లుగా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతకు ముందు గవర్నర్ గా ఉన్న తమిళిశై సౌందరరాజన్‌పై అత్యంత అసభ్యకరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. దూకుడుగా ఉండే కౌశిక్ రెడ్డి.. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలో గీత దాటుతున్నారు. ఇది తరచూ విమర్శల పాలవుతోంది. 


ఏపీలో బూతు నేతలకు పోలింగ్ బూతుల్లోనే జవాబిచ్చిన ప్రజలు


ఏపీలో ఐదేళ్ల కాలంలో రాజకీయ భాష ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయింది. అసెంబ్లీలోనే కాదు.. బయట కూడా అత్యంత ఘోరంగా తిట్టుకున్నారు. మహిళా నేత రోజా కూడా తీసిపోలేదు. ఇలా వారి భాష వినీ వినీ చిరాకు పడిన ప్రజలు ఆ బూతు నెతలు ఎవర్నీ మరోసారి అసెంబ్లీకి  పంపించలేదు. అత్యంత ఘోరంగా ఓడించారు. బూతు నేతలందరికీ పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత వారెవరూ బహిరంగంగా కనిపించడం లేదు. అంతా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి నిర్వాకం కారణంగా వారి పార్టీ కూడా ఘోరంగా  ఓడిపోయింది. 


బొత్సకు ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థి - ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై కూటమి కసరత్తు


తెలంగాణ నేతలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం !


అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. అహంకారం చూపించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు సహించరు. తమదైన రోజున ఓటుతో బుద్ది చెబుతారు. తాము గొప్పగా బటన్లు నొక్కి డబ్బులిచ్చామని.. ్ందుకే తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతామని అనుకుంటే..  ఏపీలో ఎన్నికల ఫలితాల్లాంటివే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో .. కాస్త ఘాటుగా మాట్లాడినా ప్రజలు అది ఉద్యమ ఆవేశం అనుకున్నారు కానీ.. ఇప్పుడు మాత్రం..  రాజకీయాల్లో ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ను ప్రయోగిస్తే... ప్రజలే ముందుగా శిక్షించడానికి సిద్ధమవుతారు. చట్టసభల్లోనే కాదు..బయట కూడా..  ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన  బాధ్యత నేతలదే. ఎందుకంటే వారిని ఎన్నుకున్నది ప్రజలే మరి.